బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు గనుల వేలం: పారదర్శకత ద్వారా ఆత్మనిర్భర్ భారత్కు ఊతం
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 11:19AM by PIB Hyderabad
దశాబ్ద కాలంగా భారతదేశంలో బొగ్గు గనుల కేటాయింపు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2014లో 204 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత... ఈ కేటాయింపులు పారదర్శకంగా, నిబంధనల ఆధారిత విధానంలోకి మారాయి. జూన్ 18, 2020న వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గనుల కేటాయింపు దిశగా ఇది మరో కీలక ముందడుగు. ఆరేళ్లలో ఇది మైనింగ్ రంగంలో అత్యంత కీలక నిర్మాణాత్మక సంస్కరణల్లో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా చేకూరిన ప్రయోజనాలు పరిశ్రమలకు, ప్రభుత్వ ఖజానాకు, బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల్లోని స్థానిక కమ్యూనిటీలకు పారదర్శకంగా అందుతున్నాయి.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఎంఎస్టీసీ వేదిక ద్వారా ఆన్లైన్లో రెండు దశల్లో వేలం నిర్వహిస్తారు. బిడ్డర్ల సమక్షంలోనే వేలం పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో డీకోడ్ చేస్తారు. ఎలాంటి తుది వినియోగ నిబంధనలు లేవు. ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) అనుమతి ఉంది. ముందస్తు చెల్లింపులు తక్కువగా ఉండి, భవిష్యత్తు ఆదాయంలో వాటాకు సర్దుబాటు చేసే విధంగా వేలం నిబంధనలను రూపొందించటం వల్ల చిన్న, కొత్త సంస్థలకు కూడా పోటీపడే అవకాశం లభించింది. ఈ విధానం ద్వారా విజయవంతంగా ఇప్పటి వరకు 147 బొగ్గు గనులను వేలం వేశారు. 44 కొత్త కంపెనీలు బొగ్గు గనులను దక్కించుకున్నాయి. ఈ పాలసీ కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే కాక... బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు మాత్రమే చేసే కోల్ ఇండియా అనుబంధ సంస్థలైన వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్), నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) వంటి ప్రభుత్వ రంగ బొగ్గు పీఎస్యూలను ఆకర్షించింది. ఇవి కూడా ఇటీవల జరిగిన వేలంలో ప్రైవేటు రంగ సంస్థలతో సమానమైన నిబంధనలతో బ్లాక్ల కోసం బిడ్డర్లుగా పోటీపడ్డాయి.
ప్రతి వేలం వేసిన బ్లాక్ ద్వారా రాష్ట్రాలకు బలమైన ఆదాయ వాటా అందుతుంది. ఇందులో పోటీ ద్వారా బిడ్ చేసిన ఆదాయ వాటా (రాయల్టీకి అదనం), రాయల్టీ (చట్టబద్ధమైనది, రాష్ట్రానికి చెందాల్సింది), డీఎంఎఫ్ నిధులు (పీఎంకేకేకేవై ద్వారా మైనింగ్ జిల్లా అభివృద్ధికి ఖర్చు చేస్తారు), ఎన్ఎంఈటీ నిధులు (భవిష్యత్ అన్వేషణకు నిధులు సమకూరుస్తాయి), జీఎస్టీ రూపంలో ఉంటుంది. 2020 నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులకు వేలం జరిగింది. ఇవి సుమారు రూ. 47,500 కోట్ల వార్షిక ఆదాయాన్ని, రూ. 55,000 కోట్ల మూలధన పెట్టుబడిని, 4.9 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య గనుల నుంచి సమకూరిన మొత్తం ఆదాయం (ముందస్తు, ప్రీమియం చెల్లింపులతో కలిపి) దాదాపు రూ. 3,090 కోట్లు.
ఈ ఆదాయంతో పాటు ఉత్పత్తి కూడా సమాంతరంగా సాగుతోంది. కేవలం వాణిజ్య గనుల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి 12.55 మిలియన్ టన్నుల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 23.51 మిలియన్ టన్నులకు పెరిగింది. సొంత వినియోగ, వాణిజ్య గనులు రెండూ కలిసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 210 ఎంటీల ఉత్పత్తిని చేశాయి. దీనిద్వారా తొలిసారిగా 200 మిలియన్ టన్నుల మైలురాయిని దాటాయి. దశాబ్దం కిందట ఈ ఉత్పత్తి కేవలం 28.8 ఎంటీలుగా ఉండేది. ఇది ఈ కాలంలో సుమారు 22 శాతం చక్రవడ్డీ వార్షిక వృద్ధిని (సీఏజీఆర్) తెలియజేస్తుంది. దేశీయంగా తవ్వితీసే ప్రతి అదనపు టన్ను బొగ్గు వల్ల దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. బొగ్గు రంగంలో స్వావలంబన సాధించాలనే భారత్ ప్రయత్నాలకు ఇది మద్దతిస్తుంది.
పారదర్శకమైన, టెక్నాలజీ ఆధారిత వేలం విధానం కొత్తగా రంగంలోకి వచ్చేవారిని నిరంతరం ఆకర్షిస్తోంది. ప్రభుత్వ రంగ గనులు కూడా కేటాయింపుల ద్వారా కాకుండా, ప్రైవేట్ సంస్థలతో సమానంగా పోటీపడేలా సమాన అవకాశాలు కల్పించే సమర్థవంతమైన వాతావరణం ఏర్పడింది. రాయల్టీ, ప్రీమియం, డీఎంఎఫ్, ఎన్ఎంఈటీ అన్నీ కలిసున్న ఆదాయ-భాగస్వామ్య విధానం గత దశాబ్దంలో రాష్ట్రాల బొగ్గు ఆదాయాన్ని దాదాపు మూడు రెట్లు పెంచింది. ఇవన్నీ కలిసి వాణిజ్య బొగ్గు గనుల వేలం విధానాన్ని రాష్ట్రాలు, పరిశ్రమలు, స్థానిక సమాజాలు, దేశ శక్తి భద్రతకు గొప్ప విజయంగా మారుస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2310215)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7