ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో నైజీరియా ఉపాధ్యక్షునితో ప్రధాని సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 6:13PM by PIB Hyderabad
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు జీసీవోఎన్ కాషిం షెట్టిమా ముస్తఫాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన నైజీరియా బృందానికి ఉపాధ్యక్షులు జీసీవోఎన్ కాషిం షెట్టిమా ముస్తఫా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశీ వ్యవహారాలు, పారిశ్రామిక, వాణిజ్య, పెట్టుబడులు, సమాచార ఆవిష్కరణలు-డిజిటల్ టెక్నాలజీ, మానవతా వ్యవహారాలు, పేదరికం తగ్గింపు, మహిళా వ్యవహారాలు, శాస్త్ర, సాంకేతిక శాఖలతో సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు ఉన్నారు.
భారత్, నైజీరియా బహుముఖ సంబంధాలను నాయకులిద్దరూ సమీక్షించారు. వివిధ రంగాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, ఇంధన భాగస్వామ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలతో సహా ముఖ్యమైన రంగాలపై చర్చల్లో ప్రధాన దృష్టి సారించారు. ఇండియా-నైజీరియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలు, ఆందోళనలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధానమంత్రి మోదీ, ఉపాధ్యక్షులు షెట్టిమా ముస్తఫా తమ ఆలోచనలను పంచుకున్నారు. బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన, మరింత మందికి ప్రాతినిధ్యం అందించే, సమ్మిళితమైన, బహుళ ధృవ అంతర్జాతీయ వ్యవస్థ కోసం కలసి పనిచేయాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు.
నైజీరియాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికీ, ఆఫ్రికా దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేయడానికీ భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. నైజీరియా సామర్థ్య నిర్మాణానికీ, ఆర్థిక వృద్ధికీ భారత్ అందిస్తున్న అభివృద్ధి అనుభవాలను, సహకారాన్ని ఉపాధ్యక్షులు షెట్టిమా ముస్తఫా ప్రశంసించారు.
ఇరు దేశాలతో పాటు విస్తృతమైన గ్లోబల్ సౌత్లో శాంతికీ, సంక్షేమానికీ, అభివృద్ధికీ దోహదపడేందుకు బలమైన, భవిష్యత్తు దృష్టితో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించడంలో భారత్, నైజీరియా దేశాల ఉమ్మడి అంకితభావాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2309886)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2