న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. 2026 ఆగస్టు 31న బిష్కెక్ వేదికగా నిర్వహించిన 26వ ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు అనంతరం.. ఈ నాయకులిద్దరూ సమావేశం కావడం ఏడాదిలో ఇది రెండోసారి.
రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య వినిమయ, ప్రజా మధ్య సంబంధాల అంశాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. 2026 సెప్టెంబరు 9 నుంచి 11 వరకు భారత్లో తొలిసారిగా రష్యా అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ‘ఇన్నోప్రోమ్ ఇండియా’ నిర్వహణను స్వాగతించిన వారు... వాణిజ్య, పారిశ్రామిక సంబంధాల విస్తరణలో ఈ ప్రదర్శన అత్యంత కీలకం కానుందని పేర్కొన్నారు. ఇన్నోప్రోమ్ ఇండియా ప్రదర్శనను కూడా వారు సందర్శించి.. అక్కడి ప్రతినిధులతో సంభాషించారు.
బహుపాక్షిక వేదికలపై.. ముఖ్యంగా 2026లో భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న బ్రిక్స్ సమావేశాల్లో భారత్ - రష్యా సహకారంపై వారిద్దరూ చర్చించారు. అలాగే నౌకా వాణిజ్యంపై, భారతీయ నావికుల భద్రతపై ప్రభావం చూపిన పశ్చిమ ఆసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని ఘర్షణలతోపాటు.. పరస్పర ప్రయోజనాలున్న కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. ఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
భౌగోళిక - రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ.. ఇరు దేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం దృఢంగా ముందుకు సాగుతూ విశేష పురోగతిని కనబరుస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనిని మరింత బలోపేతం చేసే దిశగా నిరంతర కృషిని కొనసాగించడంపై అంగీకారానికి వచ్చారు.
24వ భారత్ - రష్యా వార్షిక సదస్సు సందర్భంగా రష్యాలో పర్యటించాల్సిందిగా.. భారత ప్రధానమంత్రి శ్రీ మోదీని రష్యా అధ్యక్షుడు శ్రీ పుతిన్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానానికి శ్రీ మోదీ అంగీకారం తెలిపారు. దౌత్యపరమైన చర్చల ద్వారా.. పరస్పర సౌలభ్యాన్ని బట్టి శిఖరాగ్ర సమావేశ తేదీలను నిర్ణయిస్తారు.