నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వరల్డ్ స్కిల్స్ షాంఘై–2026లో పదకొండు కొత్త నైపుణ్య విభాగాల్లో తొలిసారిగా పోటీపడుతున్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 12:55PM by PIB Hyderabad
2026 సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు చైనాలోని షాంఘైలో జరిగే 48వ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో పదకొండు కొత్త నైపుణ్య విభాగాల్లో భారత్ తొలిసారి పాల్గొంటోంది. తద్వారా తన ప్రపంచ నైపుణ్యాల పరిధిని విస్తరించుకుంటోంది.
స్కిల్ ఇండియా బృందంలో దాదాపు 70 మంది పోటీదారులు ఉన్నారు. ఈ బృందం మొత్తం 64 విభాగాలకు గాను 63 నైపుణ్య విభాగాల్లో పోటీల్లో పాల్గొంటుంది. వరల్డ్ స్కిల్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతి పెద్ద, అత్యంత వైవిధ్యమైన బృందాల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది.
డెంటల్ ప్రోస్తెటిక్స్, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీ, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్, ఆప్టోఎలక్ట్రానిక్ టెక్నాలజీ, రిటైల్ సేల్స్, మానవ రహిత ఏరియల్ వ్యవస్థలు, ఇండస్ట్రియల్ మెకానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, హెవీ వెహికల్ టెక్నాలజీ, ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ అనే పదకొండు కొత్త నైపుణ్యాల్లో భారత్ మొదటిసారి పోటీ పడనుంది.
దేశ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ సాధించిన విస్తరణనూ, పరిణతినీ ఈ కొత్త విభాగాల్లో భారత్ పోటీపడటం తెలియజేస్తోంది. సంప్రదాయ వ్యాపారాల్లోని బలమైన పునాదుల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రత్యేక సేవలు, సృజనాత్మక పరిశ్రమలు, తర్వాతి తరం పారిశ్రామిక సామర్థ్యాల దిశగా విస్తరిస్తోంది.
నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) ఈ బృందానికి నాయకత్వం వహిస్తోంది. పారిశ్రామిక సంస్థలు, శిక్షణ కేంద్రాలు, ఆయా రంగాల నిపుణులతో కలిసి పనిచేస్తూ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) వరల్డ్ స్కిల్స్ కోసం భారత బృందాన్ని సన్నద్ధం చేస్తోంది.
ఈ పోటీల్లో భారత్ పాల్గొనడంపై ఎంఎస్డీఈ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అవసరాలకు తగిన, అంతర్జాతీయంగా ఉపయోగపడే సామర్థ్యాల దిశగా మన నైపుణ్య వ్యవస్థ సాధిస్తున్న పరిణామాన్ని కొత్త నైపుణ్య విభాగాల్లో భారత్ పోటీపడటం తెలియజేస్తోంది. బలమైన భాగస్వామ్యాలు, పటిష్టమైన సన్నాహాల ద్వారా మన యువత ఆత్మవిశ్వాసంతో పోటీ పడటానికి, ప్రపంచ ప్రమాణాలతో తమను తాము పోల్చుకోవడానికి వీలు కల్పిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.
ఆరోగ్యసేవల సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్ డిజైన్, నిఘా వ్యవస్థలు, డ్రోన్ టెక్నాలజీలు, అధునాతన తయారీ, రవాణా పరిష్కారాలు, వినియోగదారు కేంద్రక సేవలతో సహా పని భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆధునిక రంగాలకు కొత్త విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిని చేర్చడం... అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య రంగాల్లో యువతకు అవకాశాలను అన్వేషించడంపై భారత్ సారించిన దృష్టిని స్పష్టం చేస్తోంది.
ఈ కొత్త విభాగాల్లో పోటీలకు సన్నద్ధమవడానికి కర్ణాటకలోని గవర్నమెంట్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (జీటీటీసీ), గాంధీనగర్లోని మెట్రోవుడ్స్ ల్యాండ్స్కేప్, గాంధీనగర్లోని నామ్టెక్, బెన్నెట్ విశ్వవిద్యాలయం, క్రోమా, టైటాన్ కంపెనీ లిమిటెడ్ – తనిష్క్, షాపర్స్ స్టాప్, రిలయన్స్ ట్రెండ్స్, ఎస్ఏఎన్వై హెవీ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రఖార్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్, డెనెక్స్పర్ట్ డెంటల్ ల్యాబ్ లాంటి ప్రత్యేక శిక్షణ సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములతో కూడిన సహకారాత్మక వ్యవస్థ తోడ్పాటు అందిస్తోంది.
అనుబంధం
ఇంటెలిజెంట్ భద్రతా సాంకేతికత: ప్రజలు, మౌలిక వసతులు, ఆస్తులకు భద్రత కల్పించే స్మార్ట్ వ్యవస్థల రూపకల్పన, ఏర్పాటు, నిర్వహణపై ఈ విభాగం దృష్టి పెడుతుంది. ఇందులో కృత్రిమ మేధ ఆధారిత నిఘా వ్యవస్థలు, స్మార్ట్ సెన్సర్లు, స్వయంచాలక స్పందనా వ్యవస్థలు వంటి సాంకేతికతలను ఉపయోగిస్తారు.
ల్యాండ్స్కేప్ గార్డెనింగ్: సృజనాత్మకతతో పాటు ఆచరణాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ.. పర్యావరణానికి అనుకూలమైన, ఉపయోగకరమైన ప్రదేశాలను రూపొందించేందుకు డిజైన్, నిర్మాణం, పర్యావరణ అవగాహనను కలిపి ఉపయోగించే రంగం ఇది.
ఆప్టోఎలక్ట్రానిక్ సాంకేతికత: కాంతి, విద్యుత్ శాస్త్రాలను కలిపి ఉపయోగించే వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం ఇది. అధునాతన తయారీ, వైద్య సేవలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్మార్ట్ సాంకేతికతలు వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది.
డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్: డిజైన్, కంటెంట్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా వివిధ వేదికల్లో ఆకట్టుకునే, వినియోగదారులు చురుగ్గా పాల్గొనే డిజిటల్ అనుభవాలను రూపొందించడం ఈ రంగం ప్రధాన లక్ష్యం.
రిటైల్ అమ్మకాలు: ఉత్పత్తులపై సమగ్ర అవగాహన, కమ్యూనికేషన్, ఉత్పత్తుల ప్రదర్శన, నాణ్యమైన సేవలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వినియోగదారులతో మంచి సంబంధాలు, అనుభవ ఆధారిత వ్యాపార నమూనాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
భారీ వాహన సాంకేతికత: రవాణా, పారిశ్రామిక వ్యవస్థలు మరింత అధునాతనంగా మారుతున్న నేపథ్యంలో లోపాలను గుర్తించడం, మరమ్మతులు చేయడం, నిర్వహణ చేపట్టడం వంటి సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి పెడుతుంది.
మానవ రహిత వైమానిక వ్యవస్థలు: మౌలిక సదుపాయాలు, వ్యవసాయం నుంచి ప్రజా సేవలు, పర్యవేక్షణ, అభివృద్ధి చెందుతున్న స్వయంచాలక సాంకేతికతల వరకు వివిధ రంగాల్లో డ్రోన్ సాంకేతికతల వినియోగంలో విస్తరిస్తున్న తీరును ప్రదర్శిస్తుంది.
డెంటల్ ప్రోస్థెటిక్స్: డెంటల్ క్రౌన్స్, డెంటల్ ఇంప్లాంట్లు, కృత్రిమ దంతాలు వంటి ప్రత్యేక దంత పరికరాలను ఖచ్చితత్వంతో రూపొందించి తయారు చేయడం ఈ రంగం ప్రధాన ఉద్దేశం. ఇవి నోటి ఆరోగ్యానికి సంబంధించిన పనితీరును పునరుద్ధరించడంతో పాటు జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి.
పారిశ్రామిక యంత్ర సాంకేతికత: సంక్లిష్టమైన పారిశ్రామిక యంత్రాలు, ఉత్పత్తి వ్యవస్థలను ఖచ్చితంగా అమర్చడం, నిర్వహించడం, లోపాలను గుర్తించి పరిష్కరించడం, పనితీరును మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ రంగం దృష్టి సారిస్తుంది.
సాఫ్ట్వేర్ టెస్టింగ్: కఠినమైన పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియల ద్వారా సాఫ్ట్వేర్ నాణ్యత, విశ్వసనీయత, వినియోగదారుల పనితీరును మెరుగుపరచడంలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
విమానాల నిర్వహణ: సంపూర్ణ భద్రత, నిబంధనలకు అనుగుణంగా వాటి నిర్వహణను నిర్ధారించేందుకు విమానంలోని యాంత్రిక, విద్యుత్, ద్రవ, నిర్మాణ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అవసరమైన సర్వీసింగ్, సమస్యల పరిష్కారం, మరమ్మతులతో పాటు విమానం ప్రయాణానికి సురక్షితంగా ఉందో లేదో కూడా కఠినమైన పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2308331)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14