ఆర్థిక మంత్రిత్వ శాఖ
గంజాయి అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా చేపట్టిన దాడుల ద్వారా 740 కేజీల గంజాయి, చరస్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ...13 మంది అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 11:05AM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా వర్గాల సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దేశవ్యాప్తంగా ఎనిమిది కీలక ప్రాంతాలపై దాడులు చేశారు. 15 రోజులపాటు సాగిన ఈ దాడుల్లో దాదాపు 740 కేజీల గంజాయి (హైడ్రోపోనిక్ గంజాయి సహా), చరస్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం13 మందిని అరెస్టు చేశారు. స్వాధానం చేసుకున్న మాదకద్రవ్యాల్లో 709.6 కేజీల గంజాయి, 24.5 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి, 5 కేజీల చరస్ ఉన్నాయి.
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 08.09.2026న జరిగిన దాడిలో రాయ్పూర్ సమీపంలోని ఓల్డ్ ధంతరి రోడ్ వద్ద విశాఖపట్నం నుంచి వస్తున్న రెండు ట్రక్కులను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. సరకును లారీల్లోకి తరలిస్తున్న ప్రాంతాల్లో 10 సంచుల్లో ఉన్న 61 ప్యాకెట్లలో గంజాయి ఉన్నట్లు అనుమానించారు. పరీక్షలు నిర్వహించగా అది గంజాయి అని తేలింది. ఈ తనిఖీల్లో భాగంగా 375.95 కేజీల గంజాయిని, రవాణా చేస్తున్న రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద నలుగురిని అరెస్టు చేశారు.
అంతకు ముందు 26.08.2026న రాయ్పూర్ సమీపంలో... ఓ ట్రక్కులో 124 కేజీల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ఒకరిని అరెస్టు చేశారు.
సరైన సమాచారంతో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన మరికొన్ని దాడుల్లో పాట్నా సమీపంలోని ఔరంగాబాద్-పాట్నా హైవేపై డీఆర్ఐ అధికారులు ఓ లారీని అడ్డగించారు. ఈ తనిఖీల సమయంలో అధికారులపై దాడి జరగడంతో ఒక అధికారికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యాడు. వాహనాన్ని తనిఖీ చేయగా, డ్రైవర్ క్యాబిన్ వెనక రహస్య అరలోని 90 ప్యాకెట్లలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం140.5 కిలోల గంజాయిని, లారీని స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్లోని లుథియానా సమీపంలో ఈ నెల 1, 2వ తేదీల్లో మరొక అనుమానాస్పద వాహనాన్ని డీఆర్ఐ అధికారులు అడ్డగించారు. తనిఖీ చేయగా, కారు కింద భాగంలోని రహస్య అరల్లో దాచిన 67 గంజాయి ప్యాకెట్లలో 69 కిలోల గంజాయిని గుర్తించారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని… ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ఇద్దరిని అరెస్టు చేశారు.
డీఆర్ఐ అధికారులకు అందిన సమాచారం ఆధారంగా 03.09.2026న గోరఖ్పూర్ రైల్వేస్టేషన్లో అమర్నాథ్ ఎక్స్ప్రెస్ రైలు సాధారణ బోగీలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికుల తొడ భాగంలో, మోకాలి తొడుగుల వంటి కవర్లలో, చీరల లోపల దాచిన సుమారు 5 కిలోల చరస్ బయటపడింది. ఈ చరస్ను నేపాల్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. చరస్ను స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
గత 15 రోజుల్లో మూడు వేర్వేరు దాడుల్లో హనోయ్, వియత్నాం, బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి హెదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకున్న ముగ్గురు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. వారి నుంచి అధికంగా మత్తును కలిగించే సుమారు 24.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీఆర్ఐ నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోంది. రోడ్డు, రైలు, విమాన మార్గాలు... వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలు, రహస్య గదులు, ప్రయాణికుల లగేజీల్లో దాచిన మాదకద్రవ్యాలను అధికారులు గుర్తిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2308225)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7