ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్లో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 11:33PM by PIB Hyderabad
గౌరవనీయులైన మహంత్ స్వామి, ఫ్రాన్స్ ప్రభుత్వ గౌరవనీయ ప్రతినిధులు, విశిష్ట అతిథులు, ప్రవాస భారతీయులు సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలుపంచుంటున్న హరి భక్తులు, సోదరీసోదరురా…
జై స్వామినారాయణ్!
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఇవాళ భారీ స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం భారత్-ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలలో కొత్త మలుపుగా నిలుస్తుంది. పూజనీయ సాధువులు, సనాతన సంప్రదాయ పరిరక్షక మహనీయుల ఆశీస్సులతో నేటి ఈ ప్రారంభోత్సవ వేదిక ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భావనకు ప్రతీకగా మారింది. స్వామినారాయణ్ అనుగ్రహం, మన సాధువుల ఆదరం, ఆశీస్సుల రూపంలో ఇలాంటి పవిత్ర సందర్భాల్లో పాలుపంచుకునే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. నేనివాళ పారిస్లో మీ మధ్య లేనప్పటికీ, హృదయానుగత సంధానంతో మీతో మమేకమైనట్లు భావిస్తున్నాను.
మిత్రులారా!
ఈ నేపథ్యంలో పరమ పూజనీయ స్వామి మహారాజ్ను కూడా నేను సగౌరవంగా స్మరించుకుంటున్నాను. ప్రాచీన భారత సాంస్కృతిక-ఆధ్యాత్మిక వైభవం అమూల్యం, అపారం. దాని పునరుజ్జీవనం దిశగా ఆయన శ్రీకారం చుట్టిన ఉద్యమ కాంతులు నేడు ఐరోపా సహా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా అబుధాబిలో ఒక భారీ ఆలయం 2024లో ప్రారంభమైంది. ఇవాళ భగవద్దర్శనం కోసం వేలాది హరిభక్తులు సహా పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పుడు పారిస్లోనూ స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణం- ఆ పరంపర కొనసాగడం మన సాధువుల సంకల్పానికి, సామర్థ్యానికి నిదర్శనం. ఈ పవిత్ర కార్యం చేపట్టిన పూజనీయ మహంత్ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ సందర్భంగా ‘బాప్స్’ స్వామి నారాయణ్ సంస్థకు, లక్షలాది హరి భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
వివిధ దేశాలలో ‘బాప్స్’ ఆలయాలను సంస్థాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రాచీన భావనలు, మానవీయ విలువలు కూడా వాటితో పాటు సమున్నతంగా నిలుస్తాయి. భారతీయ తాత్త్వికత “సమానం మనః సహ చిత్తమేషాం” అంటుంది.. అంటే- మనందరి మనసులూ ఏకం కావాలి.. మన హృదయాలు అనుసంధానితం కావాలి అని అర్థం. ఆ మేరకు ఫ్రాన్స్లో ఈ భారీ ఆలయం నిర్మాణంతో ఈ దేశ వైవిధ్యం నిస్సందేహంగా మరింత సుసంపన్నం కాగలదు. అదే సమయంలో భారత్-ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలకు నవ్యోత్తేజం కలుగుతుంది.
మిత్రులారా!
భారత్-ఫ్రాన్స్ సంబంధాలు ఇటీవల సరికొత్త శిఖరాలకు చేరాయి. నా మిత్రుడైన అధ్యక్షుడు మాక్రాన్తో సంయుక్తంగా ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాం. సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ రంగం నుంచి అంతరిక్షం, వాతావరణ పరిరక్షణ చర్యల దాకా మేం మరింత వేగంతో, ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నాం. ఈ క్రమంలో 2026ను “భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం”గా ప్రకటించాం. మా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకం… ఎందుకంటే- ఇది మన పురాతన సాంస్కృతిక-రాజకీయ సంబంధాల బలమైన పునాదిపై నిర్మితమైనది. చరిత్రే దీనకి ప్రత్యక్ష సాక్షి- ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగం నేటికీ ఇక్కడి ప్రజల స్మృతిపథంలో సజీవం. సంస్కృత భాషకు ప్రాచుర్యం కల్పించడంలో ఫ్రెంచి పండితులు ఎంతటి కీలక కీలక పాత్ర పోషించారో బహుశా ఆ భాషాభిమానులకు తెలిసే ఉంటుంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమైన్ రోలాండ్ రచనలు మన సమాజాల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచాయి. పారిస్ నుంచి పుదుచ్చేరిలోని అరబిందో ఆశ్రమం దాకా “ది మదర్” ఆధ్యాత్మిక ప్రస్థానం అసంఖ్యాక భారత, ఫ్రెంచ్ సాధకులకు ఎనలేని స్ఫూర్తినిచ్చింది.
మిత్రులారా!
శ్రీల ప్రభుపాద స్వామి కూడా కొన్ని దశాబ్దాల కిందట ఫ్రాన్స్ను సందర్శించారు. ‘ఇస్కాన్’ ద్వారా ఆయన భారత్-ఫ్రాన్స్ ఆధ్యాత్మిక సంబంధాలకు కొత్త అధ్యాయాన్ని జోడించారు. మరోవైపు యోగా కూడా నేడు రెండు దేశాల ప్రజల మధ్య అనుసంధాన మాధ్యమంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈఫిల్ టవర్ ముందు నిర్వహించిన కార్యక్రమ చిత్రాలు ఫ్రాన్స్లో యోగాకుగల ఆదరణకు నిదర్శనం. ఇప్పుడీ అద్భుత ‘బాప్స్’ ఆలయం ద్వారా ఈ సాంస్కృతిక బంధాలకు మరో కొత్త మలుపు తిరిగింది.
మిత్రులారా!
భారత్-ఫ్రాన్స్ సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులపై నేడు చర్చలు సాగుతున్న నేపథ్యంలో స్వామి నారాయణ్ ఆలయం ఈ అవకాశానికి ఓ కొత్త కోణాన్ని జోడించింది. ఈ ఆలయం “మేడ్ ఇన్ ఇండియా” (భారత్లో రూపకల్పన) “బిల్ట్ ఇన్ ఫ్రాన్స్” (ఫ్రాన్స్లో నిర్మితం). నిర్మాణంలో వాడిన అనేక శిల్పాలు భారత్లోనే ఊపిరిపోసుకున్నాయి. ప్రాచీన భారత శిల్పకళా నైపుణ్యం, ఫ్రాన్స్ ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో జోడుకట్టింది. పారిస్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత ఆలయం రెండు దేశాల మధ్య సహకారం-అవకాశాలకు చిహ్నంగా శతాబ్దాల పాటు వెలుగొందుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
మిత్రులారా!
స్వామి నారాయణ్ ఆలయాలు సదా భక్తి కూడళ్లుగానే కాకుండా, సేవా కేంద్రాలుగానూ విలసిల్లుతున్నాయి. ఆ క్రమంలోనే ఇక్కడి ఆలయం కూడా సేవా కార్యక్రమాల కూడలిగా నిలుస్తుందని నాకు తెలిసింది. ఇక్కడి నుంచి విస్తరించే భారతీయ సంస్కృతి స్వరాలు ఐరోపా దేశాలన్నిటా గల ప్రజలకు మేలు చేస్తాయని నమ్ముతున్నాను. భవిష్యత్తులో నాకు సమయం దొరికినప్పుడల్లా, తప్పకుండా ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేస్తాను. చివరగా, ఈ శుభ సందర్భాన ఇక్కడి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులకు, కుటుంబాలకు, హరి భక్తులకు, ప్రవాస భారతీయులందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
అనేకానేక ధన్యవాదాలు!
మెర్సీ బోకూ…
జై స్వామి నారాయణ్!
****
(రిలీజ్ ఐడి: 2307359)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8