మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘ఎన్ఎంఎంఎస్ఎస్ 2026-27’ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు దాఖలుకు సెప్టెంబరు 30 వరకూ గడువు పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 6:25PM by PIB Hyderabad
‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2026-27’ (ఎన్ఎంఎంఎస్ఎస్) కింద దరఖాస్తు సమర్పణ గడువును కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ పథకం కింద ఇప్పటికే ఎంపికైన విద్యార్థులు ‘నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్’ (ఎన్ఎస్పీ) ద్వారా సెప్టెంబరు 30వ తేదీవరకూ దరఖాస్తులను దాఖలు చేయవచ్చు. ఈ గడువు పొడిగింపుపై పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి:
|
వివరాలు
|
పొడిగించిన తేదీ
|
|
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ
|
30.09.2026
|
|
ఐఎన్ఓ ధ్రువీకరణకు (ఎల్1) చివరి తేదీ
|
15.10.2026
|
|
డీఎన్ఓ ధ్రువీకరణకు (ఎల్2) చివరి తేదీ
|
31.10.2026
|
ఈ పథకం కింద ‘ఎన్ఎస్పీ’ పోర్టల్ ద్వారా దరఖాస్తు దాఖలుకు 2026 జూన్ 1 నుంచి విద్యార్థులను అనుమతించారు. ఈ ప్రాజెక్టు సంవత్సరం… అంటే- 2026-27కుగాను ఎంపికైన విద్యార్థులు ముందుగా ఈ పోర్టల్ ద్వారా ‘ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్’ (ఓటీఆర్) చేసుకోవాలి. ఆ తర్వాత తామెంచుకున్న స్కాలర్షిప్ పథకం కింద దరఖాస్తును సమర్పించాలి.
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖలోని పరిధిలోని పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం ఈ ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం’ అమలవుతోంది. ప్రాథమిక స్థాయి నుంచి 8వ తరగతి తర్వాత విద్యార్థులు బడి మానేయకుండా చూడటం సహా ఉన్నత మాధ్యమిక స్థాయి… అంటే- 12వ తరగతిదాకా విద్య పూర్తి చేసేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులు చదువు కొనసాగించేలా ఈ ఉపకార వేతనం దోహదం చేస్తుంది.
దీనికింద రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన 9వ తరగతి విద్యార్థులకు ఈ పథకం కింద ఏటా లక్ష వరకూ కొత్త స్కాలర్షిప్లు లభిస్తాయి. విద్యార్థి విద్యా ప్రతిభ ఆధారంగా 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ నవీకరణ విధానంలో ఈ ఉపకార వేతనం మంజూరవుతూంటుంది. ఈ పథకం కింద ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఏటా రూ.12,000 వంతున ఉపకార వేతనం లభిస్తుంది.
ఈ ఉపకార వేతనాన్ని డీబీటీ విధానంలో ‘పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (పీఎఫ్ఎంఎస్) ద్వారా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సాయం పొందడానికి నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలు మించరాదు. అలాగే, అర్హత పరీక్షకు హాజరు కావాలంటే కనీసం 55 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం సడలింపు)తో 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
విద్యార్థులకు ఉపకారవేతనాల పథకం అమలు కోసం ‘నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్’ (ఎన్ఎస్పీ) పేరిట కేంద్ర ప్రభుత్వం ఒకే వేదికను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 31.08.2026 నాటికి 79,398 కొత్త, 1,87,208 నవీకరణ దరఖాస్తులు దాఖలయ్యాయి.
పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులందరూ పొడిగించిన గడువులోగా ‘ఎన్ఎస్పీ’ ద్వారా దరఖాస్తుల సమర్పణను పూర్తి చేయాలని విద్యా మంత్రిత్వశాఖ సూచించింది. ఇప్పటికే సమర్పించిన వారు సంబంధిత ఇనిస్టిట్యూట్/జిల్లా/రాష్ట్ర నోడల్ అధికారులతో వాటి ధ్రువీకరణను నిర్ధారించుకోవాలని తెలిపింది.
ఎంపికైన విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తుల పరిశీలనను పోర్టల్ ద్వారా రెండు (ఎల్1, ఎల్2) స్థాయులలో నిర్వహిస్తారు. ఇందులో తొలి దశ (ఎల్1) ఇనిస్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (ఐఎన్ఓ) వద్ద, మలి దశ (ఎల్2) జిల్లా నోడల్ ఆఫీసర్ (డీఎన్ఓ) వద్ద చేపడతారు. తదనుగుణంగా ఐఎన్ఓ స్థాయిలో పరిశీలనకు చివరి తేదీని 15.10.2026గా, డీఎన్ఓ స్థాయిలో 31.10.2026గా నిర్ణయించింది.
***
(రిలీజ్ ఐడి: 2305834)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5