రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్ లో శ్రీలంక నౌకాదళం కమాండర్ వైస్ అడ్మిరల్ డామియన్ ఫెర్నాండో అధికార పర్యటన
శ్రీలంక నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి అధికార పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2026 6:30PM by PIB Hyderabad
శ్రీలంక నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ డామియన్ ఫెర్నాండో 2026 ఆగస్టు 26 నుంచి 29 వరకు భారతదేశంలో అధికారికంగా పర్యటిస్తున్నారు. సముద్ర రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసి భారత్ - శ్రీలంక నౌకాదళాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.
వైస్ అడ్మిరల్ డామియన్ ఫెర్నాండోకు ఈ రోజు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ వద్ద సైనిక గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన జాతీయ యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆపరేషన్లు, సామర్థ్య పెంపు, శిక్షణ, సముద్ర భద్రతకు సంబంధించిన చర్యలతో సహా సముద్ర రంగ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడంపై భారత నౌకాదళధిపతి (సీఎన్ఎస్) అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్తో ఆయన చర్చలు జరిపారు.
ఈ పర్యటనలో భాగంగా, వైస్ అడ్మిరల్ ఫెర్నాండో రక్షణ శాఖ సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు. పరస్పర సహకారం, ఉమ్మడి భాగస్వామ్య అవకాశాలను పరిశీలించడానికి భారత రక్షణ రంగానికి చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.
పర్యటనలో భాగంగా, వైస్ అడ్మిరల్ ఫెర్నాండో కొచ్చి సందర్శిస్తారు. రెండు దేశాల నౌకాదళాల మధ్య శిక్షణ సంబంధాలను, వృత్తిపరమైన మార్పిడులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టితో భారత నౌకాదళ శిక్షణా సంస్థలను, దక్షిణ నౌకాదళ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శిస్తారు.
శ్రీలంక నౌకాదళం భారత నౌకాదళానికి సముద్ర రంగంలో సుదీర్ఘకాలంగా అత్యంత కీలకమైన సముద్ర భాగస్వామిగా ఉంది. వైస్ అడ్మిరల్ డామియన్ ఫెర్నాండో పర్యటన భారత్ - శ్రీలంక నౌకాదళాల మధ్య గల బహుముఖ సంబంధాలను మరింత పటిష్టం చేయడంతో పాటు సముద్ర రంగ సహకారాన్ని మరింత పెంపొందించడానికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరింత స్థిరత్వానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2303979)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4