పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
మైసూరులో పౌర విమానయాన శాఖ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఉడాన్ పథకం తదుపరి దశ, పైలట్ శిక్షణ వ్యవస్థ బలోపేతంపై చర్చించిన కమిటీ
నాడు పోస్టు చేయడమైనది:
21 AUG 2026 7:04PM by PIB Hyderabad
కర్ణాటకలోని మైసూరులో పౌర విమానయాన మంత్రిత్వశాఖ పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... కేంద్ర పౌర విమానయాన, సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ పాల్గొన్నారు.
పార్లమెంటు సభ్యులు శ్రీ గోపాల్ జీ ఠాకూర్ (దర్భంగా, బీహార్)... శ్రీ అనూప్ సంజయ్ ధోత్రే (అకోలా, మహారాష్ట్ర)... శ్రీమతి సయానీ ఘోష్ (జాదవ్పూర్, పశ్చిమ బెంగాల్)... శ్రీ కామాఖ్య ప్రసాద్ తాసా (కాజిరంగా, అస్సాం)... డాక్టర్ ఎం. ధనపాల్ (రాజ్యసభ, తమిళనాడు)... శ్రీ రామ్రావు సఖారం వాడ్కుటే (రాజ్యసభ, మహారాష్ట్ర)... మైసూర్ ఎంపీ శ్రీ యదువీర్ చామరాజ వడియార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన... చర్చలను ఆయా ప్రాంతాలకు మరింత చేరువ చేసే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, ఆ శాఖకు చెందిన పార్లమెంటరీ సలహా కమిటీ 2017 తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెలుపల సమావేశమైంది. మైసూరులో జరిగిన ఈ సమావేశంలో, 'ఉడాన్' పథకం తదుపరి దశ, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థలో సంస్కరణలు, ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ పరివర్తన వంటి అంశాలపై కమిటీ చర్చించింది.
కమిటీని ఉద్దేశించి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... భారత విమానయాన రంగ వృద్ధి ప్రధాన గమ్యస్థానాలకు మించి, విమానాశ్రయాల అభివృద్ధికి మించి విస్తరిస్తోందని అన్నారు. "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన 'ఉడాన్' ద్వారా, విమానయాన రంగ ప్రాంతీయ అభివృద్ధికి, సమ్మిళిత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా మారుతోంది. దీని ద్వారా రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులు, సమాజాలూ లబ్ధి పొందుతున్నాయి. ఎమ్ఆర్వో, ఎయిర్ కార్గో వంటి రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తూ... డ్రోన్లు, ఈవీటీవోఎల్ల ద్వారా భారత విమానయాన ఆవిష్కరణల తదుపరి దశకు ఇది నాయకత్వం వహిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
ఉడాన్ పథకం ద్వారా వచ్చిన మార్పులను వివరిస్తూ “గత పదేళ్లలో, మేం విమానాశ్రయాల అభివృద్ధికి, విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం సుమారు రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఉడాన్ తదుపరి దశ కింద అపూర్వమైన రీతిలో రూ. 28,840 కోట్లు కేటాయించడం ద్వారా ఈ లక్ష్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాం” అని కేంద్ర మంత్రి తెలిపారు. భద్రత, శిక్షణలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూనే, శిక్షణ పొందిన పైలట్ల లభ్యతను పెంచడానికి ఎఫ్టీవో వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలనూ ఆయన కమిటీకి వివరించారు.
ఎఫ్టీవో వ్యవస్థ 2020లో ఉన్న 32 ఎఫ్టీవోల నుంచి 2026 నాటికి 41కి విస్తరించింది. ఫ్లయింగ్ బేస్ల సంఖ్య 32 నుంచి 63కి పెరిగింది. కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు ప్రారంభించిన ఎఫ్టీవో ర్యాంకింగ్ విధానం... ఎఫ్టీవోల పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కల్పించింది. దీని ద్వారా యువత తమ పైలట్ కెరీర్ ప్రారంభ దశలోనే సరైన అవగాహనతో నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది.
విమానయాన రంగంలోని అవకాశాలను ప్రస్తావిస్తూ "ప్రపంచంలోనే ఎక్కడా లేనంత భారీ స్థాయిలో భారతీయ విమానయాన సంస్థలు విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. విమానాల ఆర్డర్లు ఒక అంశం మాత్రమే. వాటిని నడపడానికి నైపుణ్యం, భద్రత పట్ల అవగాహన కలిగిన సిబ్బంది ఎంతో అవసరం. భారత విమానయాన రంగ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సిబ్బందిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని అనుకోవడం లేదు. దాని కోసం అవసరమైన సిబ్బందికి ఇక్కడే, మన దేశంలోనే శిక్షణనివ్వాలని మేం కోరుకుంటున్నాం" అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
విమానాల వినియోగంలో గణనీయ వృద్ధితో... అంటే ఒక్కో విమానం సగటున ఏడాదికి 1,765 గంటల పాటు ఎగరడం ద్వారా (ఇది సుమారు 1,500 గంటల ప్రపంచ స్థాయి ప్రమాణం కంటే ఎక్కువ) 'ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ'లో వచ్చిన మార్పుల గురించి కమిటీ చర్చించింది. రెండు దశాబ్దాలకు పైగా వరుసగా లోటును ఎదుర్కొన్న తర్వాత, ఈ సంస్థ తొలిసారిగా మిగులు బడ్జెట్టును సాధించింది.
పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ వీర్ విక్రమ్ యాదవ్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేష్ నిర్వాన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరైన ఎంపీలకు వివరాలను అందించారు. విలువైన సూచనలను అందించినందుకు సభ్యులను కేంద్ర మంత్రి అభినందించారు. పౌర విమానయాన రంగాన్ని నిరంతరం వృద్ధి చేసే, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే చర్యలను చేపట్టేటప్పుడు ఈ సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.


***
(రిలీజ్ ఐడి: 2302226)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34