యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారత 2036 ఒలింపిక్ క్రీడాకారుల బృందాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా.. ప్రతిభావంతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
ప్రతిభావంతులను గుర్తించడం, శిక్షణ, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టిపెట్టిన భారత క్రీడా ప్రాధికార సంస్థ 63వ పాలక మండలి సమావేశం
प्रविष्टि तिथि:
20 AUG 2026 6:38PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలంటూ.. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ముందుకు తీసుకెళ్తూ.. 2036 ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే బృందాన్ని సిద్ధం చేయడం లక్ష్యంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం కోసం వేగవంతమైన, సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఈ రోజు ఆదేశించారు.
భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) 63వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ.. రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించి భారత క్రీడా లక్ష్యాలకు పునాది ఇప్పటి నుంచే పడాలని స్పష్టం చేశారు. ‘‘భారత్లో ఒలింపిక్స్ నిర్వహించే నాటికి నిర్దేశించుకున్న పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక ఈ క్షణం నుంచే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలి’’ అని గౌరవనీయ మంత్రి స్పష్టం చేశారు.
దేశంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి పిలుపు మేరకు.. భారత క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిభాన్వేషణ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని డాక్టర్ మాండవీయ సూచించారు. అత్యున్నత స్థాయికి ఎదిగే సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ఒక క్రమబద్ధమైన వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
‘‘ప్రతిభావంతులను రెండు స్పష్టమైన దశల్లో గుర్తించాలి: మొదట రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో బాగా రాణిస్తున్న క్రీడాకారులను గుర్తించాలి. అనంతరం వారి సామర్థ్యాన్ని అంచనా వేసి.. అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కావాల్సిన దేహ ధారుఢ్యం, తృష్ణ, అంకితభావం, నైపుణ్యాలు వారిలో ఉన్నాయో లేదో విశ్లేషించాలి’’ అని ఆయన సూచించారు.
ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు ప్రక్రియ పాఠశాలలు, జిల్లాలు, కళాశాలలు సహా క్రీడారంగంలోని ప్రతి స్థాయికీ విస్తరించాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘క్రీడా పాఠశాలలు, ఉన్నత స్థాయి శిక్షణ వ్యవస్థలకు ఎప్పటికప్పుడు నాణ్యమైన అథ్లెట్లను అందించేలా ఒక సమగ్రమైన ప్రతిభావంతుల సమూహాన్ని సిద్ధం చేయడమే ముఖ్య లక్ష్యంగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
శిక్షణ రంగాన్ని మరింత విస్తరించడం కోసం ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనాను రూపొందించాల్సిన అవసరముందని డాక్టర్ మాండవీయ అన్నారు. ఈ విధానం ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతిభాన్వేషణలో ఎంపికైన క్రీడాకారులను.. సరైన అకాడమీలకు పంపి, వారికి ప్రత్యేక శిక్షణ అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సీఎస్ఆర్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా క్రీడా రంగాన్ని విస్తరించడంలో కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషించగలదని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ భాగస్వామ్యాలు ప్రభుత్వ శిక్షణ కేంద్రాలకు అదనంగా దేశంలో శిక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తాయన్నారు. అలాగే ప్రతిభాన్వేషణలో ఎంపికైన క్రీడాకారుల కోసం విస్తృత స్థాయిలో శిక్షణ అకాడమీల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడుతుందన్నారు.
శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా.. జాతీయ కోచ్ల గుర్తింపు సంస్థ (ఎన్సీఏబీ) ఏర్పాటుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరించిన ‘ఖేలో ఇండియా’ పథకంలో కీలక భాగమైన ఎన్సీఏబీ.. కోచ్ల గుర్తింపు, వారి నైపుణ్యాభివృద్ధికి మరింత వ్యవస్థీకృత విధానాన్ని అందిస్తుంది.
భారత క్రీడా ప్రాధికార సంస్థలో డిప్యుటేషన్ ప్రాతిపదికన సహాయక కోచ్ (పే లెవల్-6) పోస్టు భర్తీకి సంబంధించి నియామక నిబంధనలలో ప్రతిపాదించిన సవరణకు కూడా పాలక మండలి ఆమోదం తెలిపింది.
దేశ క్రీడా రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే వేగాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం అనేక దిశల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం ఈ వేగాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. మన క్రీడా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు మన వేగాన్ని మూడురెట్లు పెంచుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతుండడం, భారతీయుల్లో క్రీడలపై మక్కువ క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా.. దేశంలో ఆ దిశగా ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘‘కొత్త తరం కొత్త కలలను మనం సాకారం చేయాలి. ఆ దిశగా మన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగించాలి’’ అని శ్రీ మాన్సుఖ్ మాండవీయ అన్నారు.
***
(रिलीज़ आईडी: 2301880)
आगंतुक पटल : 6