కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భౌతిక మౌలిక సదుపాయాల నుంచి సాంకేతిక వ్యవస్థల వరకు.. విప్లవాత్మక వృద్ధిని ప్రపంచానికి చాటుతున్న భారత్: కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిరాభివృద్ధి దిశగా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు అవసరాలేగానీ విలాసాలు కావు
బ్రిక్స్ ఐసీటీ విభాగంలో సుస్థిర, పటిష్ట డిజిటల్, ఐసీటీ వ్యవస్థలపై కీలకోపన్యాసం చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
प्रविष्टि तिथि:
20 AUG 2026 4:10PM by PIB Hyderabad
‘సుస్థిర, పటిష్ట డిజిటల్, ఐసీటీ వ్యవస్థలు: ప్రభావవంతమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు - ప్రభుత్వ సేవల బలోపేతం, ఆర్థిక వృద్ధిపై అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలు’ అనే అంశంపై పూణేలో ఈ రోజు నిర్వహించిన బ్రిక్స్ ఐసీటీ బృంద చర్చలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కీలకోపన్యాసం చేశారు.
బ్రిక్స్ దేశాల మంత్రులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పారిశ్రామిక ప్రముఖులతో కూడిన అంతర్జాతీయ ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి ప్రసంగించారు. పౌరుల సాధికారతే లక్ష్యంగా, ఆర్థిక పురోగతికి ఊతమిచ్చేలా సార్వత్రిక, సమ్మిళిత, పటిష్ట డిజిటల్ వ్యవస్థల రూపకల్పన దిశగా భారత్ వ్యూహాత్మక దృక్పథాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
భారత్ విప్లవాత్మక ప్రయాణాన్ని వివరిస్తూ డాక్టర్ పెమ్మసాని కీలక వ్యాఖ్యలు చేశారు. మౌలిక సదుపాయాలంటే రహదారులు, ఓడరేవులు, విద్యుత్ గ్రిడ్ల వంటి భౌతిక ప్రాజెక్టులే అని భావించే సంప్రదాయ ధోరణి ఏళ్ల తరబడి కొనసాగిందనీ, అయితే భారత్ ఈ ఆలోచనలను మార్చేసిందనీ అన్నారు. గుర్తింపు, బ్యాంకింగ్, చెల్లింపులు, ధ్రువీకరించదగ్గ పత్రాలు, వినియోగదారుల సమ్మతితో కూడిన డేటా ఆధారంగా దేశ ప్రజలందరికీ ఉపయోగపడే ‘డిజిటల్ మౌలిక సదుపాయాలు’ అన్న కొత్త నమూనాను భారత్ ఆవిష్కరించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ప్రభుత్వ శాఖలు ప్రజలకు వివిధ సేవలను అందించేందుకు వీలుగా ఒక సార్వత్రిక, పరస్పర అనుసంధానంగా ఉండే ప్రాథమిక ప్రజా వేదికను ఏర్పాటు చేయడమే అసలైన వినూత్న ఆవిష్కరణ అని ఆయన వివరించారు.
భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలకు మౌలిక ప్రాతిపదికలుగా నిలిచిన అంశాలను సహాయ మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. కోట్లాది సిమ్ కార్డుల జారీ, బ్యాంకింగ్ సేవలు, ప్రామాణీకరణలను.. అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన రిమోట్ వెరిఫికేషన్ ద్వారా ఇక్కడి ప్రాథమిక గుర్తింపు వ్యవస్థ సాధ్యం చేసిన తీరును డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. చెల్లింపుల విషయానికొస్తే.. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. 720 బ్యాంకులను అనుసంధానిస్తూ, దేశీయ డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం వాటా సాధించడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు 49 శాతం వాటాతో యూపీఐ ముందంజలో నిలిచిందనీ, తొమ్మిది భాగస్వామ్య దేశాలకు కూడా విస్తరించిందనీ ఆయన వెల్లడించారు.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పోర్టల్ ప్రాధాన్యాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది 56 మంత్రిత్వశాఖలకు చెందిన 318 పథకాలను ఏకీకృతం చేసి మధ్యవర్తులను తొలగించింది. అలాగే డిజిలాకర్ వ్యవస్థ... 700 మిలియన్ల యూజర్లుండగా, 9 బిలియన్ల ధ్రువీకృత ఆధారాలను అది జారీ చేసింది. సార్వత్రిక డిజిటల్ వాణిజ్య వ్యవస్థ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్ (జీఈఎం), ఖాతా సమీకృత వ్యవస్థ (అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్) వంటి సరికొత్త కార్యక్రమాలు.. మార్కెట్ లభ్యతనూ, వ్యక్తిగత డేటా సార్వభౌమత్వాన్నీ ప్రజాస్వామ్యీకరిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సాఫ్ట్వేర్ ఆవిష్కరణలకు మద్దతుగా భారత టెలికాం రంగం బలంగా విస్తరిస్తోంది. 4 బిలియన్ డాలర్లతో చేపట్టిన సార్వత్రిక విస్తరణ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 4జీ నెట్వర్కు దాదాపు 99 శాతం గ్రామాలకు విస్తరించిందని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. అలాగే 5 లక్షలకు పైగా బేస్ స్టేషన్ల ఏర్పాటుతో ప్రపంచంలో అత్యంత వేగంగా 5జీ సేవలను ప్రారంభించిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని వివరించారు. దీనికి తోడు 17 బిలియన్ డాలర్ల భారత్ నెట్ మిషన్ ద్వారా.. ప్రతి ప్రధాన గ్రామాన్నీ వేగవంతమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్కుతో అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ భారత్ విశేష పురోగతి సాధించిందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. 2030 నాటికి 30 శాతం టెలికాం మౌలిక సదుపాయాలను పునరుత్పాదక ఇంధనంతో నడపాలన్నది జాతీయ లక్ష్యం కాగా.. టవర్ల నిర్వహణలో ఇప్పటికే 12.4 శాతం హరిత ఇంధన వినియోగాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయలు (డీపీఐ) అగ్రగామి ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమైన విలాసం కాదనీ, అభివృద్ధి చెందిన దేశాల్లో సుస్థిరాభివృద్ధికి అది అత్యవసరమనీ స్పష్టం చేస్తూ.. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ప్రసంగాన్ని ముగించారు. భారీ లైసెన్సింగ్ రుసుముల భారాన్ని తప్పించేందుకు వీలుగా.. ఓపెన్ సోర్స్ సాంకేతిక చట్రాలను పరస్పరం పంచుకునేలా ఒక పటిష్టమైన బ్రిక్స్ డిజిటల్ భాగస్వామ్యం ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయ ఐసీటీ ప్రమాణాల రూపకల్పన సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం లభించేలా.. ఉమ్మడి సామర్థ్యాభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సదస్సులో గౌరవ బ్రెజిల్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఫ్రెడెరికో డి సిక్వేరా ఫిల్హో, దక్షిణాఫ్రికా కమ్యూనికేషన్లు, డిజిటల్ సాంకేతికతల శాఖ ఉపమంత్రి మోండ్లీ గుంగుబేలే, బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, అంతర్జాతీయ సాంకేతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2301777)
आगंतुक पटल : 4