ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రతిభావంతులైన 97 మంది క్రీడాకారులకు ముంబయి ఆదాయపు పన్ను విభాగంలో ఉద్యోగాలు
प्रविष्टि तिथि:
12 AUG 2026 6:14PM by PIB Hyderabad
ముంబయి ఆదాయపు పన్ను విభాగం క్రీడల కోటాలో 97 మంది ప్రతిభాశాలి క్రీడాకారులను ఉద్యోగాల్లో చేర్చుకుంది. క్రీడా ప్రావీణ్యాన్ని గౌరవించి, ఉన్నత స్థాయి ప్రతిభావంతులు ప్రజాసేవా రంగంలో ప్రవేశించి రాణించేటట్లు చూడాలని ఈ విభాగం తన నిబద్ధతను చాటుకుంటోంది. ఆ నిబద్ధత తాజా నియామకంతో మరింత బలోపేతమైంది. కొత్తగా ఉద్యోగంలో ముంబయి ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనరు శ్రీ ఆలోక్ కుమార్ ఈ రోజు ముంబయి లోని ఆయ్కర్ భవన్లో నియమించిన క్రీడాకారులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సంవత్సరం జనవరి 7న విడుదల చేసిన నోటిఫికేషన్లో 97 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. వివిధ విభాగాల క్రీడాకారుల వద్ద నుంచి 3,595 దరఖాస్తులు వచ్చాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిశిత పరిశీలననూ, మూల్యాంకన ప్రక్రియలనూ చేపట్టిన తరువాత అర్హతల ఆధారంగా 97 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన క్రీడాకారుల్లో 80 శాతాని కన్నా ఎక్కువ మంది అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన, లేదా పోటీపడిన వారు కావడం చెప్పుకోదగిన అంశం. ఇది ఆదాయపు పన్ను విభాగంలో చేర్చుకునే ప్రతిభావంతుల అసాధారణ స్థాయిని సూచిస్తోంది.
ఉద్యోగాలలో నియమించిన అభ్యర్థుల్లో శ్రీ తరుణ్ కోటియన్, శ్రీ అభిషేక్, తేజల్ హసబ్నీస్, శ్రీ ఆకాశ్ ఎన్నదగిన వారు. శ్రీ తరుణ్ కోటియన్ ముంబయి రంజీ క్రికెట్ జట్టుకు చెందిన ఆల్రౌండర్. ఈయన ఒకప్పుడు భారతీయ టెస్ట్ టీమ్లో సభ్యునిగా కూడా ఉన్నారు. శ్రీ అభిషేక్ ఈ సంవత్సరం అహమదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన క్రీడా చాంపియన్షిప్లో రెండు స్వర్ణపతకాలు సాధించారు. తేజల్ హసబ్నీస్ భారతీయ మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి. శ్రీ ఆకాశ్ పారాస్పోర్ట్స్ క్రీడాకారుడు. ఈయన.. 2024లో న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ షూటింగ్ పారా స్పోర్ట్ (డబ్ల్యూఎస్పీఎస్) వరల్డ్ కప్లోనూ, 2025లో దుబాయ్లోని అల్ ఏన్లో నిర్వహించిన డబ్ల్యూఎస్పీఎస్ వరల్డ్ కప్లోనూ స్వర్ణ పతకాలను సాధించారు.



ఈ నియామకం దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ప్రతిభాశాలి క్రీడాకారులకు అందించడంతో పాటు, క్రీడాజగతిలో ప్రావీణ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఆదాయపు పన్ను చేస్తున్న ప్రయత్నాల్లో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తోంది. కొత్తగా ఉద్యోగంలో నియమించుకున్న వారికి క్రీడాభ్యాసాన్ని కొనసాగించడమే కాకుండా పోటీలలో పాల్గొనే అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చంటూ ముంబయి ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనరు శ్రీ ఆలోక్ కుమార్ హామీని ఇచ్చారు. వారు తమ క్రీడా కెరియర్ను తీర్చిదిద్దుకోవడం కోసం కనబరిచిన క్రమశిక్షణనీ, దృఢసంకల్పాన్నీ, ప్రావీణ్యాన్నీ ప్రజలకు సేవలను అందించడంలో కనబరుస్తారని ముంబయి ఆదాయపు పన్ను విభాగం ఆశిస్తోందని కూడా ఆయన అన్నారు.
ఉద్యోగంలో చేర్చుకున్న వారికి వారు పోషించాల్సిన పాత్ర, వారి బాధ్యతలు, వారికి వర్తించే ప్రభుత్వ నిబంధనలను గురించి తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2298842)
आगंतुक पटल : 6