ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అనీమియా ముక్త్ భారత్ అభియాన్ కార్యాచరణ మార్గదర్శకాల అమలు
రక్తహీనత నివారణ చర్యలను వేగవంతం చేసేందుకు 7×7×7 విధానాన్ని ప్రకటించిన అనీమియా ముక్త్ భారత్ అభియాన్
పరీక్ష, చికిత్స, ట్రాకింగ్, విభిన్న పోషకాహార అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్న కొత్త మార్గదర్శకాలు
प्रविष्टि तिथि:
11 AUG 2026 1:36PM by PIB Hyderabad
జూన్ 29, 2026న జరిగిన కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో అనీమియా ముక్త్ భారత్ అభియాన్ నూతన కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ద్వారా రక్తహీనత సమస్యను నివారించేందుకు గతంలో అమలులో ఉన్న 6x6x6 వ్యూహం స్థానంలో మరింత సమర్థవంతమైన 7x7x7 వ్యూహాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
అనీమియా ముక్త్ భారత్ అభియాన్లోని అంశాలు
1. లబ్ధిదారుల వర్గానికి అనుగుణంగా డిజిటల్ ఇన్వేసివ్ హీమోగ్లోబినో మీటర్లను ఉపయోగించి హిమోగ్లోబిన్ పరీక్షలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.
2. గుర్తించిన రక్తహీనత తీవ్రత/రకాన్ని బట్టి ముందస్తు నివారణ చర్యలు, అవసరమైన చికిత్స అందించడం.
3. రక్తహీనతకు కారణం పోషకాహార లోపమా లేదా ఇతర కారణాల వల్ల వచ్చే రక్తహీనతను గుర్తించి, దానికి అనుగుణంగా వ్యక్తిగత చికిత్స అందించడం.
4. రక్తహీనత సేవలను పర్యవేక్షించడానికి పటిష్టమైన డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం.. పాత టీ3 విధానం (టెస్ట్, ట్రీట్, టాక్) నుంచి కొత్త టీ4 విధానం (టెస్ట్, ట్రీట్, టాక్, ట్రాక్) వైపు మళ్లడం.
5 “ఈట్ రైట్ అప్రోచ్” విధానం ద్వారా విభిన్న పోషకాహార అలవాట్లను పెంపొందిస్తూ, ప్రతిరోజూ స్థానికంగా లభించే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకునేలా ప్రోత్సహించడం.
6. అనీమియా తగ్గించడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి పనిచేసే విధానాన్ని, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని అమలు చేయడం
7. రక్తహీనతను సాధారణంగా సమస్యగా చూసే పాత ఆలోచనా ధోరణి నుంచి, పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకోవడం, అవగాహన పొందడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో ప్రజల చురుకైన భాగస్వామ్యం కోసం ప్రచార వ్యూహాన్ని రూపొందించడం.
అనీమియా ముక్త్ భారత్ అభియాన్ కింద కొత్తగా ప్రవేశపెట్టిన 7X7X7 విధానం పూర్తి వివరాలు
ఏడు వర్గాల లబ్ధిదారులు
1. 6 నుంచి 59 నెలల పిల్లలు
2. 5 నుంచి 9 సంవత్సరాల పిల్లలు
3. 10 నుంచి19 సంవత్సరాల కౌమారదశలోని బాలబాలికలు
4. గర్భిణీలు
5. బాలింతలు
6. సంతానోత్పత్తి వయస్సులో ఉన్న మహిళలు (20 నుంచి 49 సంవత్సరాలు)
7. తక్కువ బరుతో పుట్టిన శిశువులు (0 నుంచి 6 నెలల శిశువులు)
ఏడు రకాల వ్యూహాత్మక చర్యలు
1. ఐరన్ ఫోలిక్ యాసిడ్ (ఐఎఫ్ఏ) సప్లిమెంటేషన్ అందించడం
2. రక్తహీనత నిర్ధారణ పరీక్షలు
3. రక్తహీనత గుర్తించిన వారికి అవసరమైన చికిత్స
4. నులిపురుగుల నివారణ, ప్రసవ సమయంలో ఆలస్యంగా బొడ్డుతాడు కత్తిరించడం
5. జన భాగస్వామ్యం: రక్తహీనతను ఒక సాధారణ సమస్యగా భావించే పాత ఆలోచనా విధానాన్ని మార్చడం, ఐఎఫ్ఏ మాత్రల వాడకాన్ని పెంచేలా చర్యలు
6. పోషకాహార లోపం కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చే రక్తహీనత సమస్యలను పరిష్కరించడం
7. రోజువారీ ఆహారంలో విభిన్న పోషకాలను పెంచడం, స్థానికంగా లభించే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను ప్రోత్సహించడం
ఏడు సంస్థాగత వ్యవస్థలు
1. అంతర్గత మంత్రిత్వ శాఖల సమన్వయం
2. రక్తహీనతపై జాతీయ ఎక్సలెన్స్ సెంటర్, అధునాతన పరిశోధనా కేంద్రం
3. జాతీయ ఏఎంబీ అభియాన్ యూనిట్
4. సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం
5. ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం
6. అనీమియా ముక్త్ భారత్ అభియాన్ వేదిక
7. టీ4 విధానం ద్వారా తక్షణ డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ
టీ4 విధానంలో రక్తహీనత పరీక్షలు, చికిత్స చేయడం, ప్రజల భాగస్వామ్యం ద్వారా అవగాహన కల్పించడం, చికిత్స పొందుతున్న వారిని డిజిటల్గా ట్రాక్ చేయడం, అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయడం, వారి ఆరోగ్యాన్ని నిరంతరం ఫాలో అప్ చేయడం వంటివి ఉంటాయి. దేశంలో రక్తహీనత నివారణ సేవలను బలోపేతం చేసేందుకు, నిరంతరం పర్యవేక్షించడానికి, డిజిటల్ ట్రాకింగ్ కోసం అనీమియా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రత్యేకంగా ఓ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ ప్రభుత్వ డిజిటల్ వేదికల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారికి రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జనని వేదికలో నమోదైన గర్భిణీలు, బాలింతలకు, ఆర్బీఎస్కే వేదికలో నమోదైన పాఠశాల విద్యార్థులకు, యు-విన్ వేదికల ద్వారా టీకాలు తీసుకునే చిన్న పిల్లలకు రక్తహీనత పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ఆధారంగా రక్తహీనత తీవ్రతను తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైనదిగా వర్గీకరిస్తారు. అనంతరం ప్రభుత్వ వైద్య నిబంధనల ప్రకారం వారికి తగిన మందులను అందజేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు.
ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ అందించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2297753)
आगंतुक पटल : 24