అంతరిక్ష విభాగం
గగన్ యాన్ … సాధించిన లక్ష్యాలను రాజ్యసభకు వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్
త్వరలో నెరవేరనున్న భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర లక్ష్యం
ఇప్పటికే కొన్ని ప్రమాణాలను అందుకున్నట్లు వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో వ్యోమమిత్రను తీసుకెళ్లే తొలి మానవరహిత గగన్యాన్ మిషన్ ప్రయోగం
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా పురోగతి
प्रविष्टि तिथि:
06 AUG 2026 5:00PM by PIB Hyderabad
భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర - గగన్యాన్- లక్ష్యానికి సంబంధించి... మానవ ప్రయాణానికి అవసరమైన కీలక భద్రతా ప్రమాణాల అభివృద్ధి, ధ్రువీకరణలో ప్రధానమైన అంచెలను విజయవంతంగా చేరుకున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భూ విజ్ఞాన శాఖ స్వతంత్ర హోదా, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రాజ్యసభకు తెలిపారు. ఈ పురోగతితో దేశం చేపట్టనున్న తొలి స్వదేశీ మానవ సహిత అంతరిక్ష యాత్ర- గగన్యాన్ సాకారం దిశగా ప్రధానమైన ముందడుగు పడినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతరిక్షంలోకి మానవ ప్రయాణానికి అనువుగా రూపొందించిన హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ (హెచ్ఎల్వీఎం–3) కు సంబంధించిన అన్ని చోదక (ప్రొపల్షన్) దశలు, నిర్మాణ వ్యవస్థల అభివృద్ధి, భూమిపై నిర్వహించే పరీక్షలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూళ్లకు సంబంధించిన ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేసి, విజయవంతంగా పరీక్షించి అర్హత నిర్ధారణలను కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. పర్యావరణ నియంత్రణ, జీవన సహాయక వ్యవస్థ (ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ - ఈసీఎల్ఎస్ఎస్) ఇంజినీరింగ్ నమూనా, థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, డీసెలరేషన్ సిస్టమ్, క్రూ మాడ్యూల్ అప్రైటింగ్ సిస్టమ్, ఎండ్-టు-ఎండ్ ఏవియానిక్స్ వ్యవస్థలను కూడా విజయవంతంగా అభివృద్ధి చేసి పరీక్షించినట్లు శ్రీ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
వ్యోమగాముల భద్రతకు సంబంధించి కూడా గణనీయమైన పురోగతిని సాధించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కోసం అవసరమైన అయిదు రకాల మోటార్లను అభివృద్ధి చేసి విజయవంతంగా స్టాటిక్ పరీక్షలు నిర్వహించామని, వాటికి సంబంధించిన అన్ని నిర్మాణ వ్యవస్థల అర్హత నిర్ధారణ కూడా పూర్తిచేశామని చెప్పారు. రానున్న గగన్యాన్ మిషన్లకు అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వీటిలో ఆర్బిటల్ మాడ్యూల్ ప్రిపరేషన్ ఫెసిలిటీ, గగన్యాన్ కంట్రోల్ సెంటర్, వ్యోమగాముల శిక్షణ కేంద్రంతో పాటు రెండో ప్రయోగ వేదికలో అవసరమైన మార్పులు పూర్తయ్యాయని తెలిపారు.
క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును అంతరిక్ష ప్రయాణ పరిస్థితుల్లో పరీక్షించేందుకు చేపట్టిన టెస్ట్ వెహికల్–డి1 (టీవీ–డి1) మిషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. క్రూ మాడ్యూల్ నమూనా (సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్) ను ఉపయోగించి నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్–01, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్–02 ద్వారా డీసెలరేషన్ సిస్టమ్ పనితీరును విజయవంతంగా ధ్రువీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తదుపరి టెస్ట్ వెహికల్ మిషన్–డి2 (టీవీ–డి2)కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
భూమిపై కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఖరారు చేశామని, ఐడీఆర్ఎస్ఎస్ - 1 కు సంబంధించిన ఫీడర్ స్టేషన్లు, భూతల కమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పాటు చేశామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు అవసరమైన వనరులను గుర్తించి, క్రూ రికవరీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో కొత్తగా అభివృద్ధి చేసిన వివిధ వ్యవస్థలకు సంబంధించి భూమిపై అర్హత నిర్ధారణ పరీక్షలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మిషన్ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, ఈ కార్యక్రమం కింద తొలిసారిగా అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలను ధ్రువీకరించడానికి వ్యోమమిత్ర రోబోతో కూడిన మొదటి మానవ రహిత ప్రయోగాత్మక గగన్యాన్ మిషన్ను 2026 నాలుగో త్రైమాసికంలో లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. భారత మొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ముందు, మొదటి మానవ సహిత ఫ్లైట్ నిర్మాణ ఆకృతిలోనే మరో రెండు అదనపు మానవ రహిత మిషన్లను 2027 నాటికి నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
మానవ అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన భారత దీర్ఘకాలిక ప్రణాళికను వివరిస్తూ, 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)ను కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ అంతరిక్ష కేంద్రాన్ని అయిదు మాడ్యూళ్లతో ఏర్పాటు చేసే సమగ్ర నమూనాను ఇస్రో రూపొందించిందని, ఇందులో తొలి మాడ్యూల్ బీఏఎస్–01 అభివృద్ధి, ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. బీఏఎస్–01 మాడ్యూల్కు సంబంధించిన సమగ్ర వ్యవస్థ రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి పనులు ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాలూ, విభాగాల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం కింద చేపట్టనున్న ఎనిమిది మిషన్ల అమలు కోసం రూ.20,193 కోట్ల నిధులను 2024 సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
గగన్యాన్ కార్యక్రమం కోసం ప్రముఖ అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో ఇస్రో కీలక భాగస్వామ్యాలు ఏర్పరుచుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నెట్వర్క్ కార్యకలాపాల కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), వ్యోమగాములు, క్రూ మాడ్యూల్ రికవరీ కోసం ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ (ఏఎస్ఏ), ఫ్లైట్ సర్జన్లు, గ్రౌండ్ సపోర్ట్ బృందాలకు ప్రత్యేక శిక్షణ కోసం ఫ్రాన్స్కు చెందిన సీఎన్ఈఎస్, వ్యోమగాముల శిక్షణ, మానవ అంతరిక్ష యాత్రకు అవసరమైన కీలక వ్యవస్థల కొనుగోలు కోసం రష్యా అంతరిక్ష సంస్థ- రస్ కాస్మోస్ లతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు.
గగన్యాన్ మిషన్లో సాధించిన పురోగతితో పాటు భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక…. స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక పునాదులను నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.




***
(रिलीज़ आईडी: 2295760)
आगंतुक पटल : 8