మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఎక్సలెన్స్ కేంద్రాలు
प्रविष्टि तिथि:
05 AUG 2026 5:53PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రకటనకు అనుగుణంగా ‘భారత్లో ఏఐ తయారీ, భారత అభివృద్ధి కోసం ఏఐ వినియోగం’ అనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వ్యవసాయం, సుస్థిర నగరాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో మూడు కృత్రిమ మేధ ఎక్సలెన్స్ కేంద్రాలను (ఏఐ-సీఓఈ) ఏర్పాటు చేసింది. వీటికి ఐఐటీ రోపార్, ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సీ బెంగళూరు నాయకత్వం వహిస్తున్నాయి. ఈ మూడు కేంద్రాల మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ. 990 కోట్లు.
ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర బడ్జెట్ 2025-26లో రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో విద్యా రంగానికి ప్రత్యేకంగా మరో కృత్రిమ మేధ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ప్రకటించారు. దీనిని ఐఐటీ మద్రాస్లో ఏర్పాటు చేశారు.
ఈ కృత్రిమ మేధ ఎక్సలెన్స్ కేంద్రాల (ఏఐ-సీఓఈ) కార్యక్రమం కింద విడుదల చేసిన ఆర్థిక సాయం వివరాలు: పోటీ విధానంలో సంస్థలను ఎంపిక చేసే పైలట్ దశలో భాగంగా 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ సంస్థల సమాఖ్యలకు రూ. 27.00 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటివరకు 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాల్లో ఐఐటీ కాన్పూర్కు రూ. 74.39 కోట్లు, ఐఐటీ రోపార్కు రూ. 62.64 కోట్లు, ఐఐఎస్సీ బెంగళూరుకు రూ. 69.07 కోట్లు, ఐఐటీ మద్రాస్కు రూ. 43.00 కోట్లు విడుదలయ్యాయి.
ఈ నాలుగు ఎక్సలెన్స్ కేంద్రాలు విద్యా, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సుస్థిర నగరాల రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో పరిశోధన పత్రాలను ప్రచురించడంతో పాటు ఏఐ మోడళ్లను అభివృద్ధి చేశాయి.
విద్యారంగానికి చెందిన ఏఐ ఎక్సలెన్స్ కేంద్రం (ఏఐ-సీఓఈ) భారతీయ భాషలకు మద్దతు ఇచ్చేలా ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ (ఏఎస్ఆర్), ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్), మెషిన్ ట్రాన్స్లేషన్ (ఎంటీ), టెక్స్ట్-టు-స్పీచ్ (టీటీఎస్) కోసం మెషిన్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేసింది. వ్యవసాయ రంగానికి చెందిన ఏఐ ఎక్సలెన్స్ కేంద్రం పంట రకాలు, తెగుళ్లు, వ్యాధులను గుర్తించే మోడళ్లను అభివృద్ధి చేయగా.. సుస్థిర నగరాల విభాగంలోని ఏఐ ఎక్సలెన్స్ కేంద్రం వాయు కాలుష్య కారకాలను గుర్తించడం, పట్టణ వరదల ముందస్తు అంచనా కోసం నాణ్యమైన మోడళ్లను రూపొందించింది.
పరిశ్రమల ప్రముఖులు, సీనియర్ అధికారులతో కూడిన 'అపెక్స్ కమిటీ' సమీక్షలతో సహా బహుళ అంచెల పాలనా వ్యవస్థ, ఆర్థిక పర్యవేక్షణ విధానాల ద్వారా ఈ ఏఐ ఎక్సలెన్స్ కేంద్రాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వ్యక్తిగత ప్రాజెక్ట్ల పురోగతిని తెలుసుకోవడానికి ఏఐ ఎక్సలెన్స్ కేంద్రాల కోసం ఒక స్వతంత్ర ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ రివ్యూ కమిటీ (పీఎంఆర్సీ) ఏర్పాటైంది. సెంట్రల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (సీపీఎంయూ) బాహ్య రంగానికి చెందిన నిపుణులతో క్రమానుగత సమీక్షలను నిర్వహించింది. ఈ సమీక్షలలో ఆమోదించిన లక్ష్యాలకు అనుగుణంగా సాంకేతిక అభివృద్ధి పురోగతి, నిధుల వినియోగాన్ని అంచనా వేశారు.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2295293)
आगंतुक पटल : 9