సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌ టాక్సీ

प्रविष्टि तिथि: 04 AUG 2026 5:07PM by PIB Hyderabad

   దేశంలో సహకార ప్రాతిపదికన ‘రైడ్-హెయిలింగ్’ వేదిక ‘భారత్ టాక్సీ’ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సేవలు “సహకార్ టాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్” (ఎస్‌టీసీఎల్‌)  నిర్వహణలో కొనసాగుతాయి. ప్రస్తుత ప్రైవేట్ యాప్-ఆధారిత టాక్సీ సేవాప్రదాతల స్థానాన్ని భర్తీ చేయడం దీని లక్ష్యం కాదు. వినియోగదారులకు సురక్షిత, విశ్వసనీయ, చౌక రవాణా సేవలు అందిస్తూనే, డ్రైవర్ల ఆర్థిక-సామాజిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. వారిని సభ్యులుగా, భాగస్వాములుగా చేర్చుకునే సహకార విధానంలో డ్రైవర్-ప్రాధాన్య, ప్రజాకేంద్రక ప్రత్యామ్నాయ రవాణా వేదికను సమకూర్చడమే దీని ధ్యేయం.

పారదర్శక, విశ్వసనీయ, చౌక రవాణా సేవల ప్రదానంతోపాటు సారథులకు (డ్రైవర్లు) ఉపాధి-స్వయం ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక సంక్షేమ బలోపేతం, సహకారాధారిత, సాంకేతికత-ప్రధాన రవాణా వ్యవస్థను రూపుదిద్దడం ‘భారత్ టాక్సీ’ ప్రధాన లక్ష్యాలు.

భారత్ టాక్సీని ‘మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్-2002 (ఎంఎస్‌సీఎస్‌)’ కింద “బహుళ రాష్ట్ర సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్” (ఎస్‌టీసీఎల్‌) నిర్వహిస్తుంది. దీని నమోదిత ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ సొసైటీ పరిపాలన-నిర్వహణ యంత్రాంగంలో చైర్మన్, వైస్-చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ), విభాగాల అధిపతులు, ప్రాంతీయ కార్యాలయాలు, నగర స్థాయి కార్యాచరణ బృందాలు అంతర్భాగంగా ఉంటాయి. వేదిక విధానాల అమలు, కార్యాచరణ, నిర్వహణ, సేవల ప్రదానం తదితరాలను ఈ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.

ఎంఎస్‌సీఎస్‌, దాని నమోదిత కేంద్ర విధానాలకు అనుగుణంగా ఈ సొసైటీని నిర్వహిస్తారు.  ఈ వేదికకు 8 ప్రముఖ జాతీయ సహకార సంస్థలు- “ఎన్‌సీడీనీ, ఇఫ్కో, అమూల్‌ ‘(జీసీఎంఎంఎఫ్‌), క్రిభ్‌కో, ఎన్‌డీడీబీ, నాఫెడ్‌, నాబార్డ్‌, ఎన్‌సీఈఎల్‌” మద్దతిస్తున్నాయి. సంస్థాగత సహకారం, విస్తృత ప్రచారం, సభ్యుల సమీకరణ ద్వారా ఈ సహకార నమూనా అమలుకు ఇవన్నీ చేయూతనిస్తాయి.

ఈ సొసైటీ పరిధిలో 28.07.2026 నాటికి వివిధ వాహనాల డ్రైవర్లు 27 లక్షల మంది నమోదు చేసుకోగా, రాష్ట్రాలవారీగా వారి సంఖ్య కిందివిధంగా ఉంది:

రాష్ట్రం

క్యాబ్‌

ఆటో

బైక్‌

మొత్తం

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌

1,35,554

37,850

87,641

2,61,045

గుజరాత్‌

32,192

49,764

22,207

1,04,163

ఉత్తరప్రదేశ్‌

7,687

6,181

7,753

21,621

చండీగఢ్‌

7,810

982

1,903

10,695

మహారాష్ట్ర

53,139

23,329

7,864

84,332

రాజస్థాన్‌

7,749

5,265

7,585

20,599

‘భారత్ టాక్సీ’ వేదిక ఏర్పాటు లేదా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం, ఈక్విటీ మద్దతు లేదా ప్రోత్సాహకం ప్రకటించలేదు. ఈ వేదిక నిర్వహణ బాధ్యతలను సహకార చట్రం పరిధిలో ‘ఎస్‌టీసీఎల్‌’ నిర్వర్తిస్తుంది.

అవసరాలు, ఆచరణాత్మక ఆమోదాలు-అనుమతులకు లోబడి దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాల్లో ‘భారత్ టాక్సీ’ సేవల విస్తరణ వ్యవహారాలను ‘ఎస్‌టీసీఎల్‌’ పర్యవేక్షిస్తుంది. కార్యాచరణ సంసిద్ధత, డ్రైవర్ల లభ్యత, చట్టబద్ధ నిబంధనల అనుసరణ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార సంస్థలు, ఇతర భాగస్వాములతో సమన్వయం వంటి అంశాల ప్రాతిపదికన విస్తరణ కార్యకలాపాలు చేపడతారు. ఈ వ్యూహంలో భాగంగా సంబంధిత అధికార యంత్రాంగాలతో తగిన ఒడంబడికల ద్వారా చివరి అంచెదాకా అనుసంధాన సౌలభ్యం కల్పిస్తారు. ఈ మేరకు వీలైన మేరకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో, తదితర ప్రజా రవాణా సౌకర్యాలతో భాగస్వామ్యాలను ‘ఎస్‌టీసీఎల్‌’ ఏర్పరచుకుంటుంది.

ప్రయాణికులు ఎక్కే ముందే డ్రైవర్ల, వాహనాల ధ్రువీకరణ సహా ట్రిప్ రికార్డుల నిర్వహణ, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులతో సమన్వయం ద్వారా ప్రయాణిక భద్రతకు తోడ్పాటు లభిస్తుంది. ఈ వేదికపై ‘ఎస్‌ఓఎస్‌’ వంటి భద్రత సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రయాణికులు తమ మార్గం వివరాలను కుటుంబ సభ్యులు లేదా ఇతర విశ్వసనీయ పరిచయస్తులతో పంచుకునే వీలుంటుంది. ప్రయాణి భద్రత పటిష్టం దిశగా అత్యవసర పరిస్థితుల్లో సమన్వయ సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలతో సంస్థాగత ఏర్పాట్లు కూడా చేశారు. వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం-2023, సమాచార సాంకేతిక చట్టం-2000 నిబంధనల మేరకు వినియోగదారుల సమాచారాన్ని రహస్య సంకేతం రూపంలో భద్రం చేస్తారు. సంబంధిత రాష్ట్ర రవాణా అధికారులు, డ్రైవర్ల ప్రతినిధులు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రూపొందించే పారదర్శక చట్రం ప్రకారం ప్రయాణ ఛార్జీలను నిర్ధారిస్తారు. ప్రయాణ చార్జీల సవరణ దిశగా నిర్వహణ వ్యయంతో పాటు స్థానిక రవాణా పరిస్థితులు-భాగస్వాముల సంప్రదింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చర్యలు చేపడతారు. తద్వారా చార్జీల నిర్ధారణ ప్రక్రియలో డ్రైవర్లకూ సముచిత ప్రాతినిధ్యం లభిస్తుంది.

నిర్దిష్ట విధానాల మేరకు ప్రయాణిక-డ్రైవర్ల ఫిర్యాదుల స్వీకణ-పరిష్కారం కోసం ఒక కాల్ సెంటర్, వినియోగదారు సేవా బృందం, ఫిర్యాదుల పరిష్కార బృందం తదితరాలతో కూడిన వ్యవస్థీకృత ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం కూడా ఏర్పాటైంది.

కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2294529) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी