బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు తవ్వకం: స్వయం-సమృద్ధ భారత్ దిశగా భారత ప్రయాణానికి ఊతం
प्रविष्टि तिथि:
02 AUG 2026 2:33PM by PIB Hyderabad
భారత ఇంధన అవసరాల్లో అధిక భాగాన్ని బొగ్గు తీరుస్తోంది. దేశ ప్రాథమిక ఇంధన అవసరాల్లో ఇది దాదాపు 55 శాతం వాటాను కలిగి ఉంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 70 శాతానికి పైగా బొగ్గు ద్వారానే జరుగుతోంది. సుమారు 4,00,715 మిలియన్ టన్నుల (ఎమ్టీ) నిల్వలతో, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద బొగ్గు నిల్వలను భారత్ కలిగి ఉంది. బొగ్గు ఉత్పత్తి, వినియోగంలో రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. 350కి పైగా గనుల్లో సుమారు ఐదు లక్షల మంది గని కార్మికులు ఈ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొగ్గు ఉత్పత్తి 609.18 మెట్రిక్ టన్నులుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 1047.52 మెట్రిక్ టన్నులకు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1040.08 మెట్రిక్ టన్నులకు పెరిగింది. వరుసగా రెండు సంవత్సరాలు బిలియన్ టన్నులను దాటింది. ఈ వృద్ధిలో గణనీయ భాగం క్యాప్టివ్, వాణిజ్య బ్లాక్లదే. జాతీయ ఉత్పత్తిలో వీటి వాటా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10.9 శాతంగా ఉంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20.2 శాతానికి పెరిగింది.
స్థిరమైన, నిష్పాక్షికమైన ప్రమాణాలు లేనందున ఈ ప్రక్రియ ఏకపక్షంగా ఉందని పేర్కొంటూ... 1993-2012 మధ్య కేటాయించిన 218 బ్లాకుల్లో 204 బ్లాకులను భారత సుప్రీంకోర్టు 2014లో రద్దు చేసింది. పారదర్శకమైన, వేలం ఆధారిత విధానం ఆవశ్యకతనూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దీనికి ప్రతిస్పందనగా, బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం-2015 గనులను తిరిగి కేటాయించడం కోసం పటిష్ఠమైన, చట్టబద్ధమైన ఆధారాన్ని కల్పించింది. మొదటి విడత వేలం ప్రక్రియను డిసెంబర్ 2014లో ప్రారంభించారు. 2015-2020 మధ్య కాలంలో పది విడతల్లో వేలం నిర్వహించి, తొమ్మిది కేటాయింపులు చేయడం ద్వారా 76 బొగ్గు గనులను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, స్వయం-సమృద్ధ భారత్ మిషన్ ఆధ్వర్యంలో... 18 జూన్ 2020న వాణిజ్య బొగ్గు తవ్వకం లాంఛనంగా ప్రారంభమైంది. ఇది పోటీ ప్రాతిపదికన బొగ్గు అమ్మకానికి అనుమతినిస్తూ, ప్రభుత్వ రంగానికే పరిమితం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యాన్నీ విస్తరించింది. విజయవంతమైన బిడ్డర్ ఇప్పుడు ఏ రంగంలోని ఏ వినియోగదారులకైనా మార్కెట్ నిర్ణయించిన ధరలకు బొగ్గును అమ్మవచ్చు. ఈ విషయంలో సొంత వినియోగంపై గానీ, బొగ్గును ఎలా వినియోగించాలనే దానిపై గానీ ఎలాంటి ఆంక్షలూ లేవు.
గతంలో ప్రతి టన్నుకు లెక్కించే స్థిర రుసుము స్థానంలో... ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాబడిలో కొంత శాతాన్ని బిడ్డర్ కోట్ చేసే రాబడి-భాగస్వామ్య నమూనాను ప్రవేశపెట్టారు. ఆ వాటాను జాతీయ బొగ్గు సూచీకి అనుసంధానిస్తారు. తద్వారా బొగ్గు వాస్తవ విలువతో పాటే దేశానికి వచ్చే రాబడీ పెరుగుతుంది. అర్హతా నిబంధనలనూ గణనీయంగా విస్తరించారు. ఇకపై మునుపటి మైనింగ్ అనుభవం అవసరం లేదు. జాయింట్ వెంచర్లూ, కన్సార్టియంలూ దీనిలో పాల్గొనవచ్చు. ఆటోమేటిక్ మార్గం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ అనుమతిస్తారు.
జూన్ 2020 నుంచి, 14 విడతల్లో 141 బొగ్గు గనులను వాణిజ్యపరంగా వేలం వేశారు. వీటి మొత్తం గరిష్ట వార్షిక సామర్థ్యం 366.35 మెట్రిక్ టన్నులు. సగటు రాబడి వాటా 24.17 శాతం. ఇది 4 శాతం కనిష్ట స్థాయి కంటే ఆరు రెట్లు ఎక్కువ. వీటిలో, 123 గనులు ప్రైవేట్ సంస్థలకు దక్కగా, విజయం సాధించిన బిడ్డర్లలో 44 సంస్థలు గతంలో ఎప్పుడూ బొగ్గు తవ్వకం జరపనివే.
2025-26 ఆర్థిక సంవత్సరంలో క్యాప్టివ్, వాణిజ్య బ్లాక్లు కలిసి సుమారు 210.46 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించి, తొలిసారిగా 200 మిలియన్ టన్నుల మార్కును దాటాయి. ఒక దశాబ్దం కిందట ఈ సంఖ్య 28.83 మిలియన్ టన్నులుగా ఉండేది. ఇది ఆ కాలంలో సుమారు 22 శాతం కౌంపౌండ్ వార్షిక వృద్ధి (సీఏజీఆర్)ని సూచిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య గనులు సుమారు 26.12 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అందించాయి. వీటిలో 23 గనులు (గని ప్రారంభ అనుమతిని పొందినవి) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగినప్పుడు... ఇప్పటివరకు వేలం వేసిన బ్లాక్లు సుమారు రూ. 47,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని, సుమారు రూ. 48,756 కోట్ల మూలధన వ్యయాన్ని ఆర్జించడం సహా సుమారు 4,75,000 మందికి ఉపాధిని కల్పిస్తాయని అంచనా.
ఖజానాకు వచ్చే రాబడులూ అదే స్థాయిలో పెరిగాయి. ప్రీమియం జనరేషన్ ద్వారా వచ్చే ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 461 కోట్లుగా ఉంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,553 కోట్లకు పెరిగింది. ఇది సుమారు 26 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధిని (సీఏజీఆర్) నమోదు చేసింది. ఖజానాకు, ఉత్పత్తి చేసే రాష్ట్రాలకూ ఈ ఆదాయం సమకూరింది.
వేలం వేసిన ప్రతి గనిని ఉత్పత్తిలోకి తీసుకురావడంపై ప్రస్తుతం దృష్టి సారించారు. వ్యాపార సౌలభ్యం కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా, బ్లాక్ల కార్యాచరణకు అవసరమైన అనుమతుల భారాన్ని తగ్గించారు. ఈ వ్యవస్థను మరింత సరళీకరించారు. తద్వారా నిర్దేశిత కార్యాచరణ కాలపరిమితులు గణనీయంగా తగ్గాయి. పూర్తిగా అన్వేషించిన బ్లాక్ల కోసం 51 నెలల నుంచి 40 నెలలకు, పాక్షికంగా అన్వేషించిన వాటికి 66 నెలల నుంచి 52 నెలలకు కాలపరిమితులు తగ్గాయి. (ప్రస్తుతం కొనసాగుతున్న 15వ విడత నుంచి ఇది అమలులోకి వస్తుంది).
జూన్ 2020 నుంచి ప్రతి వాణిజ్య బొగ్గు బ్లాక్ను బహిరంగ వేలం ద్వారానే కేటాయిస్తున్నారు. ఈ సంస్కరణలు పారదర్శకత, పోటీ, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య సమాన అవకాశాల కల్పనపై ఆధారపడి ఉన్నాయి. ఇవి దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తాయి. విద్యుత్, ఉక్కు పరిశ్రమలకు మద్దతునిస్తాయి. స్వయం-సమృద్ధ భారత్ లక్ష్యం దిశగా దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయి.
***
(रिलीज़ आईडी: 2293536)
आगंतुक पटल : 8