భారతదేశ చేనేత వారసత్వాన్ని వేడుకగా జరుపుకునేందుకు, దేశ సాంస్కృతిక, ఆర్థికాభివృద్ధికి చేనేత కార్మిక వర్గం అందించిన తోడ్పాటును గుర్తించేందుకు ఆగస్టు 7, 2026న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ (ఆర్బీసీసీ)లో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఈ వేడుకలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కేంద్ర జౌళి శాఖ రాష్ట్ర మంత్రి శ్రీ పవిత్ర మార్గెరిటా, కార్యదర్శి (జౌళి శాఖ) శ్రీమతి నీలం షామీ రావు, అభివృద్ధి కమిషనర్ (చేనేత) డాక్టర్ ఎం. బీనా పాల్గొంటారు.
ఈ వేడుకల్లో సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డు గ్రహీతలు, జాతీయ చేనేత అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు, అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులు, చేనేత రంగానికి చెందిన ప్రముఖులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, మీడియా ప్రతినిధులు, ఇతర విశిష్ట అతిథులు పాల్గొంటారు.
ఈ వేడుకల్లో భాగంగా 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించటంలో అద్భుతమైన నైపుణ్యం, ఆవిష్కరణలు, కృషికి గుర్తింపుగా 03 సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 అవార్డులను ప్రతిభావంతులైన చేనేత కార్మికులకు అందజేస్తారు.
ఈ వేడుకలో భారత సుసంపన్న, వైవిధ్యభరిత చేనేత వస్త్ర పరిశ్రమను గౌరవిస్తూ నాలుగు స్మారక పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేస్తారు.
ఈ కార్యక్రమంలో రెండు ప్రచురణలు..."ఎర్త్. రూట్. థ్రెడ్ - ఆల్ డైడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా", హ్యాండ్లూమ్ అవార్డ్స్ బుక్-2025ని ఆవిష్కరిస్తారు.
ఈ కార్యక్రమంలో అవార్డు గెలుచుకున్న చేనేత ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతారు. సంప్రదాయ కనీ నేత, వాల్ హ్యాంగింగ్ నేతలను సందర్శకులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంటుంది. ఇది భారతదేశ చేనేత సంప్రదాయాల వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని కళ్లకు కడుతుంది.
ఆగస్టు 7, 2026న జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలు, కాన్క్లేవ్లు (డిజైనర్, ఐఐహెచ్టీ) మొదలైన ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి.
దేశంలో అత్యధిక గ్రామీణ ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగాల్లో భారత చేనేత రంగం ఒకటిగా కొనసాగుతోంది. ఇది 35 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలకు అండగా నిలుస్తోంది. అందులో 70 శాతానికి పైగా మహిళా శ్రామికులున్నారు. ఆర్థిక ప్రాముఖ్యతతో పాటు భారతదేశ గొప్ప వస్త్ర సంప్రదాయాలను సంరక్షిస్తూ, పర్యావరణపరంగా స్థిరమైన ఉత్పాదక విధానాలకు ఈ రంగం కీలక తోడ్పాటునందిస్తుంది.
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 7న నిర్వహిస్తారు. ఆగస్టు 7, 1905న ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం జ్ఞాపకార్థంగా ఈ రోజును జరుపుకుంటారు. ఈ ఉద్యమం దేశీయ పరిశ్రమలకు, భారతదేశ చేనేత రంగానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. దేశ సాంస్కృతిక వారసత్వానికి, సామాజిక-ఆర్థికాభివృద్ధికి చేనేత కార్మికులు అందిస్తున్న అమూల్యమైన సేవలను ఈ దినోత్సవం గుర్తిస్తుంది.
2015లో ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశ చేనేత కార్మికుల కళాత్మక నైపుణ్యాన్ని, ప్రతిభను, అంకితభావాన్ని వేడుకగా జరుపుకునేందుకు జాతీయ చేనేత దినోత్సవం వేదికగా నిలుస్తోంది. చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు, సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.