ఆయుష్
సాంప్రదాయిక చికిత్స పద్ధతుల్లో కృత్రిమ మేధ… ముందుకు వచ్చిన ఆయుష్ శాఖ, ఇండియాఏఐ
ఆయుష్ రంగంలో ఏఐ ఆధారిత నూతన ఆవిష్కరణల వేగాన్ని పెంచడం, పరిశోధనలనూ, డిజిటల్ హెల్త్నూ బలోపేతం చేయడంతో పాటు సామర్థ్యాల పెంపునకు తోడ్పడే ఓ అవగాహన ఒప్పందం
అవసరమైన ఆరోగ్య పరిశోధన సమాచారాన్ని పంచుకునేందుకు ఏఐకోశ్ వేదికతో కలిసి పనిచేయనున్న ఆయుష్
प्रविष्टि तिथि:
31 JUL 2026 10:31AM by PIB Hyderabad
ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికి ఆయుష్ శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతశాఖ (ఎమ్ఈఐటీవై)కి చెందిన ఇండియాఏఐ ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) కుదుర్చుకున్నాయి. ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడానికి సరికొత్త సాంకేతికతలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
అవగాహన ఒప్పందంపై ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు డాక్టర్ కవితా జైన్, ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శి, ఇండియాఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు శ్రీ సుదీప్ శ్రీవాస్తవ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ, ఇండియాఏఐల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థలో పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఏఐకి ఉన్న శక్తిసామర్థ్యాలను గురించి డాక్టర్ కవితా జైన్ ప్రస్తావించారు. ఆయుష్లో ఏఐ ఏకీకరణ వల్ల ఫలితాల ఆధారిత పరిశోధనలకీ, జ్ఞాన నిర్వహణకీ, నూతన ఆవిష్కరణలకీ కొత్త అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారు. పరిశోధన, ఔషధ మొక్కలు, చికిత్సా విధానంలో సహాయం, సామర్థ్యాల పెంపుదల వంటి రంగాల్లో ఆధునిక ఏఐని వినియోగించుకోవడానికి ఇండియాఏఐతో సహకారం తోడ్పడుతుందనీ, దీంతో ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థ మరింత ఎక్కువ స్థాయిలో సాంకేతికత ఆధారితంగానూ, రాబోయే కాలం అవసరాలను తీర్చడానికి సన్నద్ధమైందిగానూ మారుతుందనీ డాక్టర్ కవితా జైన్ అన్నారు.
భారత సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థలతో ఆధునిక సాంకేతికతలను ఏకీకరించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శి, ఇండియాఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు శ్రీ సుదీప్ శ్రీవాస్తవ వివరించారు. ఆయుష్ శాఖ, ఇండియాఏఐ మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో సాంప్రదాయిక ఆరోగ్యసంరక్షణకు సంబంధించిన డేటాసెట్లతో ఏఐకోశ్ను సుసంపన్నం చేసే దిశగా ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు అయిందని ఆయన వర్ణించారు. సాంప్రదాయిక వైద్య విజ్ఞాన శాస్త్ర పరిశోధకులకు, వైద్యులకు ఏఐ ఆధారిత నూతన ఆవిష్కరణలు మరింతగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ఆయుష్ గ్రిడ్ ఓఎస్డీ శ్రీ నమన్ గోయల్ మాట్లాడుతూ, ఆయుష్ గ్రిడ్ తన సరికొత్త సాంకేతికతలతో ఆయుష్ రంగంలో డిజిటల్ మార్పులకు ఊతాన్ని అందించడానికి ఏఐ ఆధారిత వేదికల్ని రూపొందిస్తోందన్నారు. ప్రస్తుత ఎమ్ఓయూ.. ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థలో ఏఐని ముందుకు తీసుకుపోవడంలో ఓ కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ సహకారం.. సాంకేతికత ఆధారిత ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్ఠపరిచే దిశగా ఒక ప్రధాన ఘట్టం. ఇది సాంప్రదాయిక జ్ఞానాన్నీ, ఏఐ సామర్థ్యాలనీ జోడిస్తుంది. పరిశోధనలు, సామర్థ్యాల పెంపుదల, ఔషధ మొక్కలు, చికిత్సా విధానంలో సహాయం వంటి ఆయుష్ కీలక రంగాల్లో ఏఐ సేవలను విరివిగా ఉపయోగించుకోవడంపై ఈ భాగస్వామ్యంలో దృష్టిని కేంద్రీకరిస్తారు.
ఈ సహకారంలో భాగంగా, ఏఐకోశ్ వేదికతో ఆయుష్ శాఖ జతపడుతుంది. ఫలితంగా డేటాసెట్లు, మెటాడేటా, ఏఐ మోడళ్లు, టూల్కిట్లు, వాటిని ఉపయోగించే సందర్భాలు సహా యోగ్యమైన ఆరోగ్య పరిశోధన సామాగ్రిని పంచుకొనేందుకు అవకాశం కలుగుతుంది. ఆయుష్ రంగానికి ఉపయోగపడే బాధ్యతాయుత ఏఐ సేవల్ని అభివృద్ధిపరచడానికీ, నూతన ఆవిష్కరణలకీ ఈ ఏకీకరణ మరింత ఎక్కువ స్థాయిలో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
నిర్దిష్ట సేవల ఒప్పందాలకు లోబడి, ఇండియాఏఐ కార్యక్రమం ఆధ్వర్యంలో తక్కువ ధరలకు జీపీయూ ఆధారిత, ఉన్నత స్థాయి పనితీరు కనబరిచే కంప్యూటింగ్ పద్ధతుల్ని రూపొందించడానికి ఈ ఎమ్ఓయూ దోహదపడుతుంది. ఉన్నత స్థాయి కంప్యూటింగ్ పద్ధతులు అందుబాటులోకి రావడంతో కీలక మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడమే కాకుండా ఆరోగ్యసంరక్షణ సేవలు, సాంప్రదాయిక చికిత్సలో అత్యాధునిక ఏఐ పరిశోధనలతోపాటు సేవలను విస్తరించడానికి కూడా తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం భారత సుసంపన్న సాంప్రదాయిక వైద్య పద్ధతుల్ని అత్యాధునిక డిజిటల్, ఏఐ సాంకేతికతతో జోడించే దిశలో ఒక ముఖ్య ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇది మరింత వినూత్న, ఫలితాలపై ఆధారపడే, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగే ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థను తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2292317)
आगंतुक पटल : 10