కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , సైన్స్ ఆవిష్కరణలు- అభివృద్ధి సంస్థతో టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం ఒప్పందం
టెలికాం రంగంలో స్వదేశీ పరిశోధన, అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయనున్న సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అధునాతన కమ్యూనికేషన్ సాంకేతికతల్లో అధిక ప్రభావం కలిగిన పరిశోధన, అభివృద్ధికి ప్రత్యేక కేంద్రంగా నిలవనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
టెలికాం రంగంలో స్వావలంబన, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు విద్యా సంస్థలు, పరిశ్రమల సంయుక్త భాగస్వామ్యానికి ఊతం
प्रविष्टि तिथि:
30 JUL 2026 1:46PM by PIB Hyderabad
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగానికి చెందిన ప్రముఖ టెలికాం పరిశోధన, అభివృద్ధి కేంద్రమైన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ-సీ డాట్), బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), సైన్స్ ఆవిష్కరణలు-అభివృద్ధి సంస్థతో (ఎఫ్ఎస్ఐడీ) త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఉమ్మడి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి ద్వారా దేశీయ టెలికాం ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఐఐఎస్సీ బెంగళూరులోని ఎఫ్ఎస్ఐడీ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సీ డాట్ ఏర్పాటు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి స్వదేశీ పరిశోధనలు, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపు, వాణిజ్యీకరణను వినియోగాన్ని వేగవంతం చేయడమే ఈ ఎక్సలెన్స్ కేంద్రం ప్రధాన లక్ష్యం. విద్యా రంగానికి, పారిశ్రామిక రంగానికి మధ్య ఒక ఉమ్మడి భాగస్వామ్య వేదికగా ఇది వ్యవహరిస్తుంది. దేశ డిజిటల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలు, నూతన సాంకేతికతల అభివృద్ధి, ప్రతిభావంతులైన మానవ వనరుల తయారీకి ఎంతగానో తోడ్పడుతుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థలో పరిశోధనలు, ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. వీటితో పాటు 5జీ అడ్వాన్స్డ్/6జీ సాంకేతికతలు, భారీ స్థాయి మిమో వ్యవస్థలు, ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్, ఏఐ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, పరికరాలు, క్వాంటమ్, పోస్ట్ క్వాంటమ్ సాంకేతికతలు వంటి వినూత్న రంగాలలో అధునాతన పరిశోధనలు చేపడుతుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన విద్యా నైపుణ్యాలను, టెలికాం పరిశోధనలో సీ డాట్కు ఉన్న విస్తృత అనుభవాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గ సమాచార సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడం, మేధో సంపత్తిని సృష్టించడం, డీప్ టెక్ అంకుర సంస్థలకు చేయూతనందించడం దీని లక్ష్యం. ఉమ్మడి పరిశోధనలు, వర్క్షాప్లు, శిక్షణ కార్యక్రమాలు, విద్యా-పారిశ్రామిక భాగస్వామ్యాల ద్వారా అనుభవాలు, ఆలోచనలును పంచుకునేందుకు తోడ్పడుతుంది.
నేటి కార్యక్రమంతో సీ డాట్ ఇప్పటి వరకు మొత్తం అయిదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ప్రారంభించింది. గతంలో ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ రూర్కీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వరుసలో ఐఐఎస్సీ బెంగళూరు చేరింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల విస్తరణ దేశీయ ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడంలో సీ డాట్ నిరంతర కృషికి అద్దం పడుతోంది. ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడం, స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను పెంచడం ద్వారా తదుపరి తరం టెలికాం రంగంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ఇది దోహదపడుతుంది.
సీ డాట్ సీఈఓ డాక్టర్ రాజ్కుమార్ ఉపాధ్యాయ్, ఎఫ్ఎస్ఐడీ సీఈఓ శ్రీ ఓంప్రకాశ్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఐఎస్సీ అధ్యాపకులు, సీ డాట్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంతకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉమ్మడి అత్యున్నత పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా సమాచార సాంకేతికతలను ముందుకు తీసుకెళ్లేందుకు కేటాయించిన సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ‘‘వికసిత్ భారత్ నిర్మాణంలో సురక్షిత స్వదేశీ సమాచార సాంకేతికతల పాత్ర- సీ డాట్ భాగస్వామ్యం’’ అనే అంశంపై ఐఐఎస్సీ ప్రాంగణంలో డాక్టర్ రాజ్కుమార్ ఉపాధ్యాయ్ ప్రసంగించారు. భారత్లో వేగవంతమైన డిజిటల్, టెలికాం పరిణామాలు, నమ్మకమైన స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు. తదుపరి తరం టెలికాం నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థలు, క్వాంటమ్ సురక్షిత సమాచార ప్రసార రంగాల్లో సీ డాట్ అందిస్తున్న మార్గదర్శక సేవలను ప్రస్తావించారు. 6జీ సాంకేతికతలకు ఉన్న విప్లవాత్మక సామర్థ్యాన్ని, ప్రపంచ టెలికాం రంగ భవిష్యత్తు రూపకల్పనలో భారత్ సాధిస్తున్న ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని ఈ సమావేశంలో చర్చించారు.
ఈ భాగస్వామ్య ప్రాధాన్యతను వివరిస్తూ సీ డాట్ సీఈఓ డాక్టర్ రాజ్కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడారు. ‘‘ఐఐఎస్సీ బెంగళూరులో సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం దేశ భవిష్యత్తు టెలికాం ఆవిష్కరణల వ్యవస్థలో ఒక వ్యూహాత్మక పెట్టుబడి. ఐఐఎస్సీకి ఉన్న ప్రపంచ స్థాయి పరిశోధనా సామర్థ్యాలను, స్వదేశీ టెలికాం సాంకేతికతల్లో సీ డాట్కు ఉన్న విస్తృత అనుభవాన్ని ఈ కేంద్రం ఒకే తాటిపైకి తెస్తుంది. 5జీ అడ్వాన్స్డ్, 6జీ, కృత్రిమ మేధ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఇతర నూతన సాంకేతికతల్లో విప్లవాత్మక పరిశోధనలను వేగవంతం చేసేందుకు ఇదొక గొప్ప వేదికగా మారుతుంది. కమ్యూనికేషన్ల రంగంలో దేశ స్వయం సమృద్ధిని పెంచడమే కాకుండా, తదుపరి తరం ఆవిష్కర్తలు, పరిశోధకులు, మేధో సంపత్తి, డీప్ టెక్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ దార్శనికతకు ఎంతో దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి ఐఐఎస్సీ బెంగళూరులోని ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగాధిపతి ప్రొఫెసర్ నీలేష్ బీ మెహతా మాట్లాడుతూ.. అధునాతన పరిశోధనలు చేస్తున్న ఐఐఎస్సీ అధ్యాపకులు, విద్యార్థులకు.. సీ డాట్ నిపుణులు, ఇంజనీర్లకు మధ్య ఈ భాగస్వామ్యం సుదీర్ఘకాలం నిలిచేలా దోహదపడుతుందని తెలిపారు. అధునాతన కమ్యూనికేషన్ సాంకేతికతల్లో ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయడానికి ఈ సంబంధాలు తోడ్పడతాయని ఆయన వెల్లడించారు.
ఎఫ్ఎస్ఐడీ సీఈఓ శ్రీ ఓంప్రకాశ్ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘సీ డాట్తో కలిసి ఈ కీలక స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఐఐఎస్సీకి చెందిన పరిశోధకులు, ఆవిష్కర్తలతో కలిసి గొప్ప ఫలితాలనిచ్చే ప్రాజెక్టులను, పరిశోధనలను ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. విద్యా, పారిశ్రామిక రంగాన్ని అనుసంధానించడానికి ఎఫ్ఎస్ఐడీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. దేశ శాస్త్రీయ వ్యవస్థను, సాంకేతిక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి ఆవిష్కరణలు అత్యంత కీలకమని మేం నమ్ముతున్నాం. ఈ భాగస్వామ్యం దేశానికి ఎంతో ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుందనే నమ్మకం మాకుంది’’ అని తెలిపారు
***
(रिलीज़ आईडी: 2291909)
आगंतुक पटल : 8