సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశాల కీలక నిర్ణయాలు
నాడు పోస్టు చేయడమైనది:
30 JUL 2026 3:45PM by PIB Hyderabad
భారత్ బ్రిక్స్ అధ్యక్షతన వరుసగా 2026 ఏప్రిల్ 29-30, జూన్ 5-6 తేదీల్లో జరిగిన 1వ, 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశాలు... సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సహకారం, సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో కాపీరైట్, నైతిక ఏఐ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వ్యూహాలు, సాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణ మొదలైన అంశాలపై చర్చించాయి.
మారుతున్న డిజిటల్ వాతావరణంలో సృష్టికర్తలు, కళాకారులు, సాంస్కృతిక నిపుణుల హక్కులు-ప్రయోజనాలను పరిరక్షించడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇందులో కాపీరైట్ రక్షణ, సరైన పారితోషికం, కృత్రిమ మేధను నైతికతతో, బాధ్యతాయుతంగా ఉపయోగించడం, మేధో సంపత్తి విధాన ప్రణాళికల బలోపేతం మొదలైన అంశాలు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చకు వచ్చాయి.
బ్రిక్స్ సభ్య దేశాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణను ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా పరిగణించి చర్చించాయి. నిరంతర చర్చలు, అనుభవాలు-ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం, సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సమన్వయ ప్రయత్నాలు మొదలైన వాటి ద్వారా సహకారాన్ని బలోపేతం చేయడంపైనా ఈ చర్చలు దృష్టి సారించాయి. సభ్య దేశాలు తమ తమ జాతీయ చట్టపరమైన, సంస్థాగతమైన విధానాలకు అనుగుణంగా... సాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణ, పునఃస్థాపనకు సంబంధించిన సమస్యలపై నిరంతర భాగస్వామ్యానికీ మద్దతు తెలిపాయి.
వారణాసిలో జరిగిన 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశ సిఫార్సులు, చర్చల వివరాలను బ్రిక్స్ సభ్య దేశాలతో పంచుకున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2291902)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28