బహుళ రాష్ట్రాల సహకార సంఘమైన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న, సహకార రంగ నేతృత్వంలోని డిజిటల్ యాప్ మొబిలిటీ వేదిక 'భారత్ టాక్సీ'... ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని పలు నగరాల్లో అధికారికంగా ప్రారంభమైంది. 2026, జూలై 19 నాటికి దేశవ్యాప్తంగా దీనిలో చేరిన డ్రైవర్-భాగస్వాముల (సారథిల) మొత్తం సంఖ్య 7.97 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం నుంచి 2.55 లక్షల మంది, గుజరాత్ నుంచి 1.01 లక్షల మంది, మహారాష్ట్ర నుంచి 71,095 మంది సారథిలుగా ఇందులో భాగమయ్యారు.
సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తున్న భారత్ టాక్సీ సేవలను ఇతర నగరాలు, రాష్ట్రాల్లో విస్తరించడం... కార్యాచరణ అవసరాలు, అవసరమైన ఆమోదాలకు లోబడి ఉంటుంది. కార్యాచరణ సంసిద్ధత, సారథిల లభ్యత, చట్టబద్ధమైన అవసరాలను పూర్తి చేయడం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార సంస్థలు, ఇతర భాగస్వాములతో సమన్వయం వంటి అంశాల ఆధారంగా విస్తరణ చేపడతారు.
భారత్ టాక్సీ సున్నా-కమీషన్ విధానంపై పనిచేస్తుంది. దీని ప్రకారం వేదిక ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణాలకు సారథి సంపాదించే ఛార్జీ నుంచి ఎటువంటి కమీషన్ మినహాయించరు. వేదిక సాంకేతికత, అప్లికేషన్ నిర్వహణ, విస్తరణకు అయ్యే ఖర్చులను భరించడం కోసం సారథిల నుంచి నామమాత్రపు రైడ్ సబ్స్క్రిప్షన్/వేదిక వినియోగ రుసుమును విడిగా వసూలు చేస్తారు. ఈ కారణంగా సారథికి చెల్లించాల్సిన ఛార్జీపై ఎటువంటి ప్రభావం ఉండదు.
సహకార్ టాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్లో సభ్యులుగా నమోదు చేసుకున్న సారధులు... దాని ఉప-నిబంధనలు, బహుళ-రాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002లోని నిబంధనల ప్రకారం సహకార సంఘ సభ్యులకు లభించే ప్రయోజనాలకు అర్హులు అవుతారు.
సహకార సంఘం దాని సభ్యుల కోసం సంక్షేమం, ఆర్థిక సహాయాన్నీ సులభతరం చేస్తుంది. రాయితీ రేట్లతో ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమాను అందుబాటులో ఉంచడం... ఎస్బీఐ ముద్రా రుణాలు సహా సంస్థాగత క్రెడిట్... బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వాహన ఫైనాన్సింగ్ అందించడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. దీనికి అదనంగా, సారధులకు డిజిటల్ వేదిక వినియోగం, కస్టమర్ సేవ, రహదారి భద్రత, ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించడానికి ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.