రాష్ట్రపతి సచివాలయం
ఉత్తర మాసిడోనియా... స్కోప్జే నగర మ్యూజియంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి
ప్రపంచం సంఘర్షణ, అసహనం, విభజనలను ఎదుర్కొంటున్న తరుణంలో... గాంధీజీ విశ్వసించే చర్చలు, కరుణ, శాంతియుత సహజీవనం అనుసరణ అత్యంత సముచితం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
22 JUL 2026 6:32PM by PIB Hyderabad
ఉత్తర మాసిడోనియా అధ్యక్షులు గౌరవ గోర్దానా సిల్జనోవ్స్కా-డావ్కోవాతో కలిసి స్కోప్జే నగర మ్యూజియంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ... మహాత్మాగాంధీ భారత్కు చెందినవారైనప్పటికీ, ఆయన సందేశం యావత్ మానవాళికీ చెందుతుందని అన్నారు. సత్యం, అహింస అనేవి బలహీనతకు సంకేతాలు కావనీ... న్యాయం, గౌరవం, స్వేచ్ఛను సాధించే శక్తిమంతమైన సాధనాలని ఆయన జీవితం నిరూపించిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచం సంఘర్షణ, అసహనం, విభజనలను ఎదుర్కొంటున్న తరుణంలో... గాంధీజీ విశ్వసించే చర్చలు, కరుణ, శాంతియుత సహజీవనం… అనుసరించేందుకు అత్యంత సముచితమైనవిగా భారత రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇది ద్వేషాన్ని తిరస్కరించడానికి, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, ధైర్యంతో, సానుభూతితో సమాజానికి సేవ చేయడానికి ప్రజలకు స్ఫూర్తినిస్తుందని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు.
భారత్-ఉత్తర మాసిడోనియాల మధ్య స్నేహానికి... శాంతి, సహనం, మానవత్వం పట్ల మన ఉమ్మడి నిబద్ధతకు ఇక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో స్కోప్జే నగర మేయర్ శ్రీ ఓర్స్ జార్జియెవ్స్కీ, భారత ప్రతినిధి బృంద సభ్యులైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా, పార్లమెంటు సభ్యులు డాక్టర్ దినేష్ శర్మ, శ్రీ విజయ్ బాఘేల్ ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియా అధ్యక్షులు గౌరవ గోర్దానా సిల్జానోవ్స్కా-దావ్కోవాతో కలిసి స్కోప్జేలోని మదర్ థెరిసా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. మదర్ థెరిసా స్కోప్జేలో జన్మించారు. ఆమె 1928 వరకు అక్కడే నివసించారు. భారత్ రావడానికి ముందు ఆమె ఐర్లాండ్లోని సిస్టర్స్ ఆఫ్ లోరెట్టోలో చేరారు. మానవతావాద వ్యాప్తికి కృషి చేయడం సహా, నిస్వార్థ సేవకు గానూ 1980లో ఆమె భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ అందుకున్నారు.
భారత రాష్ట్రపతి తన మూడు దేశాల పర్యటనలో చివరి కార్యక్రమంగా రేపు రొమేనియాలోని బుకారెస్ట్కు బయలుదేరుతారు.
భారత రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 2288005)
आगंतुक पटल : 6