విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు లభ్యత

प्रविष्टि तिथि: 20 JUL 2026 3:44PM by PIB Hyderabad

దేశంలో బొగ్గు (లిగ్నైట్‌తో కలిపి) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 230.8 జీడబ్ల్యూ. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో మొత్తం విద్యుత్ సరఫరాలో దీని వాటా 69.54 శాతం ఉంది. అంతేకాక సౌర విద్యుత్ అందుబాటులో లేని సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచి అత్యధికంగా దాదాపు 188.8 జీడబ్ల్యూ (మొత్తం ఉత్పత్తి అయిన 251.4 జీడబ్ల్యూలో ఇది సుమారు 75 శాతానికి సమానం) విద్యుత్ ఉత్పత్తి అయింది.

12.07.2026 నాటికి థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 42.8 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇది 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వద్ద 14 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజువారీ అవసరాలను తీర్చేందుకు తగినంత బొగ్గు సరఫరా అవుతోంది.

వివిధ నెలల్లో ఉండే విద్యుత్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని థర్మల్ యూనిట్ల ముందస్తు నిర్వహణ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే నెలల్లో ఈ ముందస్తు నిర్వహణ పనులను సాధ్యమైనంత వరకు తగ్గించటం ప్రామాణిక పద్ధతి. ఒకవేళ విద్యుత్ డిమాండ్ పెరిగి, అత్యవసర పరిస్థితి ఏర్పడితే... ప్లాంటు సాంకేతిక పరిస్థితులను బట్టి మరమ్మత్తు పనులను కొంతకాలం వాయిదా వేసేందుకు సీఈఏ అనుమతి ఇస్తుంది.

పునరుత్పాదక ఇంధనాన్ని విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం చేసేందుకు "సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (ఫ్లెక్సిబుల్ ఆపరేషన్ ఆఫ్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ జనరేటింగ్ యూనిట్స్) రెగ్యులేషన్స్-2023" ని 30.01.2023న ప్రకటించారు. దీని ప్రకారం.. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పాదక యూనిట్లన్నీ కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) ఎప్పటికప్పుడు నిర్దేశించే దశలవారీ ప్రణాళికకు అనుగుణంగా కనీస సాంకేతిక సామర్థ్య స్థాయిని 40 శాతానికి తగ్గించుకుని పనిచేసేలా మార్పులు చేసుకోవటం తప్పనిసరి.

గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూసేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు:

      I.   2025-26 ఆర్థిక సంవత్సరంలో 9,470 ఎండబ్ల్యూ థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 2,260 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. థర్మల్ పవర్ ప్లాంట్లకు జరిగే బొగ్గు సరఫరాను విద్యుత్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖల ఉమ్మడి కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

   II.   విద్యుత్ కేంద్రాలకు బొగ్గు వ్యాగన్లు, బొగ్గు రవాణా సరఫరాకు కూడా ప్రాధాన్యతనిచ్చారు.

III.   నిరంతరం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను సమీక్షించేందుకు రైల్వే బోర్డు ఛైర్మన్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న వివిధ మంత్రిత్వ శాఖల కమిటీ (ఐఎంసీ) క్రమం తప్పకుండా సమావేశమవుతోంది.

IV.   సూర్యరశ్మి లేని సమయాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుకు అదనపు సాయంగా… ఇప్పటివరకు దేశంలో సుమారు 2,669 ఎండబ్ల్యూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు (బీఈఎస్ఎస్), 7,426 ఎండబ్ల్యూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (పీఎస్‌పీలు) అందుబాటులోకి (కమిషన్) వచ్చాయి. పగటిపూట సోలార్ ద్వారా ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్‌ను నిల్వ చేసుకుని, సూర్యరశ్మి లేని సమయాల్లో నిల్వ ఉన్న విద్యుత్‌ను ఈ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు (బీఈఎస్ఎస్, పీఎస్‌పీ) వినియోగిస్తాయి.

రాజ్యసభలో ఇవాళ విద్యుత్ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద నాయక్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు.

***


(रिलीज़ आईडी: 2286713) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Tamil