హోం మంత్రిత్వ శాఖ
‘2027 జన గణన’ ఒకటో దశ
తమిళనాడు, త్రిపురలో స్వీయ గణన ఆరంభం
కేరళ, నాగాలాండ్లో చురుగ్గా ఇళ్ల జాబితా, గృహ గణన
29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్ల జాబితాతో పాటు గృహ గణన పూర్తి
మొదటిసారి డిజిటల్ పరికరాలతో ‘2027 జనగణన’
ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ..
ఇంటింటికీ వెళ్లి లెక్కించే సంప్రదాయ ప్రక్రియ కూడా యథాతథం
సెన్సస్ చట్టం-1948 కింద సేకరించిన సమాచారం గోప్యం..
గణాంక ప్రక్రియకూ, అభివృద్ధి పథకాల రూపకల్పనకూ మాత్రమే ఆ సమాచార వినియోగం
प्रविष्टि तिथि:
17 JUL 2026 3:17PM by PIB Hyderabad
ఇళ్ల జాబితా, గృహ గణనకు (హౌస్లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్.. హెచ్ఎల్ఓ) ఉద్దేశించిన స్వీయ గణన (ఎస్ఈ) ప్రక్రియను నేడు తమిళనాడు, త్రిపురలో మొదలుపెట్టారు. ఇది ‘2027 జనగణన’ మొదటి దశలో ఒక భాగం. 2026 జులై 31 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీని తరువాత 2026 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 మధ్య ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి, క్షేత్ర సంబంధిత గణన పనులను చేపడతారు.
తమిళనాడు, త్రిపురల ప్రజలు అధికారిక స్వీయ గణన వెబ్సైట్ ( se.census.gov.in )లో స్వీయ గణనను పూర్తి చేయవచ్చు. స్వీయ గణనను పూర్తి చేసిన కుటుంబ సభ్యులు స్వీయ గణన ఐడీ (ఎస్ఈ ఐడీ)ని సిద్ధంగా ఉంచుకుని, ఎన్యూమరేటరు క్షేత్ర పర్యటనకు వచ్చిన సమయంలో అందజేయాలి. అలా అందిస్తే, హెచ్ఎల్ఓ ప్రక్రియ సాఫీగా పూర్తి అవుతుంది.
కేరళ, నాగాలాండ్లో ప్రస్తుతం ఇళ్ల జాబితాతో పాటు గృహ గణనకు సంబంధించిన క్షేత్ర స్థాయి కార్యకలాపాలు పురోగమిస్తున్నాయి. ఈ పనులను 2026 జులై 30 వరకూ కొనసాగిస్తారు. స్వీయ గణనకు మొగ్గు చూపని కుటుంబాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లేటప్పుడు వివరాలు అడిగి నమోదు చేసుకుంటారు.
ఇంతవరకు 2027 జన గణనను 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తి చేశారు. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, లద్దాఖ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
‘2027 జనగణన’లో మొదటి సారి డిజిటల్ పరికరాలను విస్తృత స్థాయిలో ఉపయోగిస్తున్నారు. సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సమగ్ర, ఖచ్చిత కవరేజీని నిర్ధారించడం కోసం ఇంటింటికి వెళ్లి జనాభా లెక్కలను సేకరించే సాంప్రదాయిక పద్ధతిని కూడా పాటిస్తున్నారు. ఈ దశలో నోటిఫై చేసిన 33 ప్రశ్నలతో కూడిన పత్రాల సాయంతో.. ఇంటి స్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.
‘సెన్సస్ చట్టం-1948’లో భాగంగా సేకరించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. ఆ సమాచారాన్ని గణాంక ప్రక్రియలకీ, అభివృద్ధి పథకాల రూపకల్పనకీ మాత్రమే ఉపయోగిస్తారు. నోటిఫై చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు జన గణన ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలనీ, ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వారు అడిగిన సమాచారాన్ని ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరించాలనీ హోం శాఖ సూచిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2285783)
आगंतुक पटल : 7