కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యాక్షన్ లైన్ సీ6-ఎనేబ్లింగ్ ఎన్విరాన్మెంట్ విభాగంలో డబ్ల్యూఎస్ఐఎస్ 2026 బహుమతిని గెలుచుకున్న టెలికమ్యూనికేషన్ల శాఖ... ‘సమృద్ధి గ్రామ్’
భారత్నెట్ ఆధారిత సమీకృత ఫిజిటల్ సేవల పంపిణీ నమూనాకు ప్రపంచ గుర్తింపు
సుదూర, గ్రామీణ ప్రాంతాలకు సమీకృత డిజిటల్ సేవలు అందించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా కార్యక్రమ రూపకల్పన
సమ్మిళిత డిజిటల్ ఇండియాపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు: కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
प्रविष्टि तिथि:
09 JUL 2026 3:52PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘‘సమృద్ధి గ్రామ్:భారత్నెట్ ఆధారిత సమీకృత ఫిజిటల్ సేవా పంపిణీ నమూనా’’ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ’ (సమాచార వ్యవస్థపై ప్రపంచ సదస్సు-డబ్ల్యూఎస్ఐఎస్) ప్రైజెస్ 2026కు సంబంధించి యాక్షన్ లైన్ సీ6-ఎనేబ్లింగ్ ఎన్విరాన్మెంట్ విభాగంలో భారత్కు తొలి బహుమతి లభించింది. దేశంలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు సమీకృత డిజిటల్ సేవలను అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సమ్మిళిత గ్రామీణాభివృద్ధి కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, టెలికాం అనుసంధానాన్ని భారత్ వినియోగించిన వినూత్న విధానాన్ని గుర్తిస్తూ.. జెనీవాలో జరిగిన డబ్ల్యూఎస్ఐఎస్ వేదిక 2026 సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు.

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంఘం (ఐటీయూ) నేతృత్వంలోని సమాచార వ్యవస్థపై ప్రపంచ సదస్సు ప్రక్రియలో భాగంగా ఈ అవార్డులను నెలకొల్పారు. ప్రపంచంలోనే సమాచార, సాంకేతిక రంగాల (ఐసీటీ) ద్వారా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే ప్రాజెక్టులకు ఇస్తున్న అత్యున్నత పురస్కారాలుగా ఇవి గుర్తింపు పొందాయి. అంతర్జాతీయ వేదికల వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, పరిశ్రమలు, విద్యావేత్తలు, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ప్రజల అవసరాలే కేంద్రంగా, అందరికీ ప్రయోజనం చేకూరేలా, అభివృద్ధి వైపు సాగే డిజిటల్ మార్పును ఈ వేదిక ప్రోత్సహిస్తుంది.

కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈ ఘనతను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపును ‘‘అంతర్జాతీయ వేదికపై భారతదేశ కీర్తి కిరీటంలో చేరిన మరో గౌరవం’’గా ఆయన అభివర్ణించారు. సాంకేతిక ఫలాలు మారుమూల గ్రామాల్లోని ప్రతి పౌరుడికీ అందాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమ్మిళిత డిజిటల్ ఇండియా ఆశయానికి దక్కిన ప్రపంచవ్యాప్త గుర్తింపుగా దీనిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను కేంద్రమంత్రి ప్రస్తావించారు. భారత్నెట్ సహకారంతో నడిచే సమృద్ధి గ్రామ్.. గ్రామ స్థాయిలోని సమృద్ధి కేంద్రాల ద్వారా వైద్యం, విద్య, డిజిటల్ బ్యాంకింగ్, జీవనోపాధి సేవలను నేరుగా అందిస్తూ, అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ విజయం మరోసారి చాటి చెప్పిందని వివరించారు. దేశ ప్రత్యేక అవసరాల కోసం రూపొందించిన పరిష్కారాలు, ప్రపంచవ్యాప్తంగా అమలు చేయదగ్గ అత్యుత్తమ నమూనాలుగా ఎలా నిలవగలవో ఇది నిరూపించిందన్నారు. ఈ ప్రాజెక్టుతో ముడిపడున్న భాగస్వాములందరినీ అభినందిస్తూ, దేశ డిజిటల్ పురోగతి ప్రయాణంలో ఇదొక గర్వించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు.

కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ భారత్నెట్ మౌలిక సదుపాయాల ఆధారంగా చేపట్టిన సమీకృత గ్రామీణ డిజిటల్ పరివర్తన కార్యక్రమమే ఈ సమృద్ధి గ్రామ్. గ్రామ స్థాయిలో ఏర్పాటవుతున్న సమృద్ధి కేంద్రాలే ఈ కార్యక్రమానికి అత్యంత కీలకం. నమ్మకమైన టెలికాం అనుసంధానం, డిజిటల్ వేదికలు, ప్రత్యక్ష సహాయ సేవలను అనుసంధానిస్తూ గ్రామాల్లోనే అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కేంద్రాలుగా ఇవి పనిచేస్తున్నాయి.

ప్రజల అవసరాల కోసం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక సేవలు, నైపుణ్యాభివృద్ధి, ఈ-పరిపాలన, ఈ-కామర్స్ వంటి అనేక రంగాలకు చెందిన సేవలను ఈ సమృద్ధి కేంద్రాలు ఒకే వేదిక కిందికి తీసుకువస్తాయి. దూరప్రాంతాల వైద్యులతో సంప్రదింపులు, ఆరోగ్య ఏటీఎంల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పీఎం జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మందుల పంపిణీని సమృద్ధ్ గ్రామ్ కేంద్రాలు చేపడతాయి. వీటితోపాటు డిజిటల్ తరగతి గదులు, ఏఆర్/వీఆర్ సాంకేతికత ఆధారంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.. ఐఓటీ ఆధారిత మట్టి పరీక్షలు, డ్రోన్ల సాయంతో ఎరువులు, పురుగుల మందుల పిచికారీ, మొబైల్ యాప్ల ద్వారా పనిచేసే డిజిటల్ నీటిపారుదల సౌకర్యాలు.. సీఎస్సీ ద్వారా ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా గ్రామాల్లోనే బ్యాంకింగ్ లావాదేవీలు.. స్థానిక ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఈ-కామర్స్ మద్దతు.. ప్రతి ఇంటికీ ఫైబర్ ఎఫ్టీటీహెచ్, పీఎం వాణి ద్వారా పబ్లిక్ వైఫై అనుసంధానం.. సీసీటీవీ కెమెరాల ద్వారా గ్రామాల పర్యవేక్షణ.. గ్రామీణ స్థాయిలో డిజిటల్ సదుపాయాలు కల్పించడం ద్వారా నిత్యావసర సేవలకు నిరంతర అందుబాటును కల్పించడం.. సమ్మిళిత, సాంకేతికతతో కూడిన గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి సమగ్ర సేవలను అందిస్తాయి.
భారత్నెట్, టెలికాం మౌలిక సదుపాయాలు కేవలం ఇంటర్నెట్ అనుసంధానాన్ని అందించడానికే పరిమితం కాకుండా.. గ్రామీణ ప్రజల జీవితాల్లో స్పష్టమైన సామాజిక, ఆర్థిక మార్పులను ఎలా తీసుకురాగలవో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా నిరూపిస్తోంది. స్థానిక సౌకర్యాలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఈ సమీకృత సేవా పంపిణీ నమూనా గ్రామీణ ప్రజల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతోంది.

పటిష్టమైన టెలికాం మౌలిక సదుపాయాలను, ప్రజల అవసరాలకు అనుగుణమైన సేవా పంపిణీతో అనుసంధానించడం ద్వారా డిజిటల్ సమ్మిళితత్వాన్ని సాధించడంలో భారత్ సాధించిన విజయానికి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఒక నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కార్యక్రమాల్లో ఒకటైన భారత్నెట్ విప్లవాత్మక సామర్థ్యాన్ని కూడా ఇది చాటిచెప్పింది. ఇప్పటికే 2.17 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను పూర్తి డిజిటల్ సేవలకు సిద్ధం చేస్తూ ఆన్లైన్లోకి తీసుకువచ్చిన భారత్నెట్.. గ్రామీణ భారత్ అంతటా సరికొత్త డిజిటల్ అవకాశాలను, విస్తృత అందుబాటును కల్పిస్తోంది.
ప్రాజెక్టు సమర్పణ, అంతర్జాతీయ పరిశీలన, ప్రపంచవ్యాప్త ఆన్లైన్ ఓటింగ్, ఆయా విభాగాల్లోని తొలి 5 ఛాంపియన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఎంపిక అవ్వడం, డబ్ల్యూఎస్ఐఎస్ నిపుణుల కమిటీ తుది తీర్పు వంటి అత్యంత కఠినమైన బహుళ దశల మూల్యాంకన ప్రక్రియను దాటుకుని ప్రపంచ స్థాయి విజేతగా సమృద్ధి గ్రామ్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నామినేట్ అయిన అన్ని ప్రాజెక్టుల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్ దశలో ఏకంగా 22 లక్షల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
డబ్ల్యూఎస్ఐఎస్ 2026 కింద ఉన్న మొత్తం పద్దెనిమిది అవార్డుల విభాగాల్లో భారత్ నుంచి కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే ఛాంపియన్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. వాటిలో నుంచి సమృద్ధి గ్రామ్ ప్రాజెక్టు యాక్షన్ లైన్ సీ6-ఎనేబ్లింగ్ ఎన్విరాన్మెంట్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచింది. ఇది గ్రామీణ డిజిటల్ పురోగతి కోసం భారత్ అవలంబిస్తున్న, ప్రపంచవ్యాప్తంగా అమలు చేయదగ్గ ప్రజా కేంద్రీకృత విధానానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రాజెక్టు వైద్య సేవలు, నాణ్యమైన విద్య, ఆర్థిక సమ్మిళితత్వం, ఉపాధి అవకాశాలు, ఆవిష్కరణలు, అసమానతల తగ్గింపు, డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడం వంటి బహుళ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఎంతగానో తోడ్పడుతోంది. సమ్మిళిత డిజిటల్ ప్రగతికి అనుకూలమైన విధానాలను, అమలు వాతావరణాన్ని కల్పిస్తూ డబ్ల్యూఎస్ఐఎస్ యాక్షన్ లైన్ సీ6 ఆశయాలకు పూర్తి మద్దతు ఇస్తోంది.
సమృద్ధి గ్రామ్ ప్రాజెక్టుకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాన్ని తగ్గించడంతో దేశ నాయకత్వాన్ని చాటిచెప్పింది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్ రంగాలను ఉపయోగించుకుంటూ స్పష్టమైన సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడంలో దేశం సాధిస్తున్న విజయాలకు ఇది అద్దం పడుతోంది. వినూత్నమైన, విస్తరించదగిన, ప్రజా భాగస్వామ్య సేవా నమూనాల ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించే డిజిటల్ సాధికారత సమాజ నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ విజయం ప్రదర్శిస్తుంది.
మరిన్ని వివరాల కోసం టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి.
ఎక్స్- https://x.com/DoT_India
ఇన్స్టాగ్రామ్-https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఫేస్బుక్- https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్- https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
***
(रिलीज़ आईडी: 2283088)
आगंतुक पटल : 18