ఆర్థిక మంత్రిత్వ శాఖ
మే 2026కుగాను ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్, ఇండెక్స్ (జీఆర్ఏఐ)’ గ్రూప్-ఏ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన డీఎఫ్ఎస్ బీమా విబాగం
‘జీఆర్ఏఐ గ్రూప్ ఏ’ విభాగంలో ఆరో స్థానం దక్కించుకున్న డీఎఎఫ్ఎస్లోని బ్యాంకింగ్ డివిజన్
प्रविष्टि तिथि:
09 JUL 2026 3:05PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక సేవల శాఖ పరిధిలోని బ్యాంకింగ్, బీమా విభాగాలు ఏటా 2.50 లక్షలకు పైగా ఫిర్యాదులను విజయవంతంగా పరిష్కరిస్తోంది. దీని ఫలితంగా నవంబర్ 2025 నుంచి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రీవెన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్, ఇండెక్స్ (ఫిర్యాదుల పరిష్కార అంచనా, సూచీక-జీఆర్ఏఐ) ర్యాంకింగ్లలో తొలి 10 మంత్రిత్వ శాఖల్లో ఒకటిగా డీఎఫ్ఎస్ నిలుస్తోంది. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ తాజాగా విడుదల చేసిన మే 2026 జీఆర్ఏఐ ర్యాంకింగ్లలో డీఎఫ్ఎస్ అద్భుత ప్రతిభ చాటింది. 500 లేదా అంతకంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యే గ్రూప్-ఏ విభాగంలో బీమా విభాగం 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో బ్యాంకింగ్ డివిజన్ 6వ స్థానాన్ని దక్కించుకుంది.
ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను పెంచేందుకు 7 జనవరి 2024 నుంచి ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి సంబంధిత ఆర్థిక సంస్థల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు, ఉన్నతాధికారులు, ఫిర్యాదుదారులు నేరుగా పాల్గొని ప్రతి నెల యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 20 ఫిర్యాదులను స్వయంగా సమీక్షిస్తున్నారు. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు, సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడింది.
ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి ‘సమర్థవంతమైన ఫిర్యాదు పరిష్కార విధానం’పై కేంద్ర ఆర్థిక సేవల శాఖ ప్రత్యేక వర్క్షాపులను నిర్వహించింది. ఫిర్యాదుల మూలకారణాలను గుర్తించడంతోపాటు పరిష్కార నాణ్యతను పెంచడంపై ఈ సదస్సుల్లో దృష్టి సారించారు. వినియోగదారుల సమస్యలను వృత్తి నైపుణ్యంతో, పారదర్శకతతో, మానవతా దృక్పథంతో పరిష్కరించాల్సిందిగా అన్ని ఆర్థిక సంస్థలను ఈ వర్క్షాప్ల ద్వారా ప్రోత్సహించారు. దీని వల్ల ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పెరగడమే కాకుండా సేవల నాణ్యత మెరుగవుతోంది. పరిపాలనను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2282859)
आगंतुक पटल : 17