వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఎల్ నినో ముప్పు నేపథ్యంలో కేంద్రం సన్నద్ధత ముమ్మరం... పరిస్థితిపై ప్రతీ వారం సమీక్షలు
పుంజుకున్న రుతుపవనాలతో ఊరట... ఖరీఫ్ సాగుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ముందస్తు ప్రణాళిక... తక్షణ చర్యలు: వర్షభావ పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు కేంద్రం కసరత్తు
ఖరీఫ్కు పక్కా ప్రణాళిక: విత్తనాల నిల్వలు, పంటల సలహాలు, బీమా రక్షణతో సిద్ధమైన కేంద్రం
రుతుపవనాల సవాళ్ల నుంచి అన్నదాతకు అండగా కేంద్ర ప్రభుత్వ బహుముఖ వ్యూహం
ఖరీఫ్ సవాళ్లపై కేంద్రం ముందస్తు అప్రమత్తత... ప్రధాని శ్రీ మోదీ పర్యవేక్షణలో పక్కా ప్రణాళికలు
प्रविष्टि तिथि:
08 JUL 2026 3:20PM by PIB Hyderabad
ఎల్ నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల విషయంలో నెలకొన్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతతో అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమగ్ర ప్రణాళిక, స్పష్టమైన వ్యూహం, క్షేత్రస్థాయి చర్యలతో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ, ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా ముందుగానే అప్రమత్తమై చురుగ్గా పనిచేస్తోంది.
జూన్ నెలలో దేశంలో 33 శాతం మేర వర్షపాత లోటు నమోదైందని, జులై నాటికి పరిస్థితి మెరుగుపడి ఈ లోటు 24 శాతానికి తగ్గిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇటీవలి రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురిశాయని, దీనివల్ల వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పరిస్థితులను కేంద్రం నిరంతరం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. జులై నెలలో వర్షాలు మరింత పుంజుకుంటాయనే నమ్మకం ఉందని, తద్వారా ఖరీఫ్ సాగు వేగవంతం కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ఇప్పటివరకు 350.85 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు పూర్తయిందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది సుమారు 91.95 లక్షల హెక్టార్లు తక్కువ అని చెప్పారు. రుతుపవనాలు ఆలస్యం కావడం వల్ల ముఖ్యంగా సోయాబీన్, పత్తి సాగుపై ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. వర్షాలు ఆలస్యం కావడం వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించుకోవడానికి స్వల్పకాలిక, తక్కువ నీటి వినియోగం గల పంటలైన మొక్కజొన్న, సజ్జలు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఈ వర్షభావ సవాలును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచే సన్నద్ధతను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సహకారంతో వర్షపాతం తక్కువగా ఉండే జిల్లాల కోసం ప్రత్యేక అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసి, ముందే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు చెప్పారు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా 1.24 లక్షలకు పైగా అవగాహన సదస్సులు నిర్వహించగా.. వీటి ద్వారా సుమారు 80 లక్షల మందికి పైగా రైతులకు నేరుగా అవసరమైన సలహాలు, సూచనలు అందించినట్లు పేర్కొన్నారు.
రైతుల సాగు పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం సుమారు 1.75 లక్షల క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వలను సిద్ధంగా ఉంచిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విత్తనాల కొరత రాకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో పాటు రైతులకు ఆర్థిక ఊతం ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశామన్నారు. జూన్ 30 నాటికి అందిన 1.14 లక్షల దరఖాస్తులలో ఇప్పటికే 94,000 కి పైగా దరఖాస్తులను ఆమోదించి రైతులకు కార్డులు అందజేసినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఎల్ నినో ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందని కేంద్రమంత్రి శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. రుతుపవనాల గమనం, పంటల సాగు విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితి, మార్కెట్ ధోరణులను నిరంతరం గమనించడానికి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా ఎల్ నినో పర్యవేక్షణ విభాగం, పంట వాతావరణ పర్యవేక్షణ బృందం, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూంలతో పాటు ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
మారుతున్న పరిస్థితులను కేవలం గమనించడమే కాకుండా.. స్పష్టమైన విధానాలు, సరిపడా వనరులు, సరైన సమయంలో తీసుకునే తక్షణ చర్యల ద్వారా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2282510)
आगंतुक पटल : 12