శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బీహార్లోని ముంగేర్లో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు
प्रविष्टि तिथि:
03 JUL 2026 3:43PM by PIB Hyderabad
బీహార్లోని ముంగేర్లో దాదాపు 700 సంవత్సరాల నాటి పురాతన మర్రిచెట్టును శాస్త్రవేత్తలు గుర్తించారు. రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఖచ్చితమైన వయసును నిర్ధారించిన అత్యంత పురాతన మర్రిచెట్టు (ఫైకస్ బెంగాలెన్సిస్)గా ఇది రికార్డు సృష్టించింది. కేవలం స్థానిక కథలు, చారిత్రక రికార్డులపై ఆధారపడకుండా, పక్కా శాస్త్రీయ ఆధారాలపై మాత్రమే దీని వయసు లెక్కించడం విశేషం.
మర్రిచెట్లు ఊడలు, కొమ్మలతో పక్షులు, కీటకాలు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు సహజ సిద్ధమైన ఆవాసాలను కల్పిస్తాయి. శతాబ్దాలుగా దేశ సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి ప్రాచీన వృక్షాల వయసును అంచనా వేయడానికి జానపద కథలు, స్థానిక కథనాల, పాత రికార్డులను ఉపయోగించేవారు. కానీ ఇవి చాలా వరకు ఖచ్చితంగా ఉండవు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఇటువంటి వృక్షాలకు గతంలో స్పష్టమైన నిబంధనలు లేపోవడం వల్ల శాస్త్రీయంగా వయసు నిర్ధారణ జరగలేదు. క్షేత్రస్థాయి నమూనాలు, ప్రయోగశాల విశ్లేషణల ద్వారా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వెడల్పాటి ఆకులు గల వృక్షాల్లో వయసును తెలిపే వార్షిక వలయాలు స్పష్టంగా ఉండవు. దీనివల్ల సంప్రదాయ డెండ్రోక్రోనలాజికల్ (వృక్ష కాలగణన పద్ధతులు) ఇక్కడ పని చేయలేదు. అందుకే దీనిని రేడియో కార్బన్ డేటింగ్ వంటి ప్రత్యామ్నాయ, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సరికొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది.
బీహార్ అటవీ శాఖ ఆహ్వానం మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్టీ) పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ త్రినా బోస్ ఈ పరిశోధనను ప్రారంభించారు. ఉష్ణమండల ప్రాంతాల్లోని వెడల్పాటి ఆకులు గల వృక్షాల వయసును నిర్ధారించడానికి సంప్రదాయ పద్ధతులు సరిపోవని గుర్తించి సరికొత్త శాస్త్రీయ విధానానికి ఆమె శ్రీకారం చుట్టారు. డాక్టర్ త్రినా బోస్ నేతృత్వంలో డాక్టర్ మయాంక్ శేఖర్, డాక్టర్ అఖిలేష్ కే యాదవ్లతో కూడిన పరిశోధనా బృందం సంయుక్తంగా ఈ వినూత్న పద్ధతిని అభివృద్ధి చేసి, మర్రిచెట్టును వయసును విజయవంతంగా నిర్ధారించారు.
డాక్టర్ బోస్ నేతృత్వంలోని డాక్టర్ శేఖర్, డాక్టర్ యాదవ్లతో కూడిన శాస్త్రవేత్తల బృందం.. ఈ మర్రిచెట్టు ద్వితీయ కాండం, ఒక పురాతన ప్రాథమిక కొమ్మ లోపలి భాగం నుంచి చెక్క నమూనాలను సేకరించింది. వృక్షం పెరిగే ప్రాథమిక దశలో ఏర్పడే మొదటి భాగం కాబట్టి ఈ లోపలి భాగం పరిశోధనకు అత్యంత కీలకం. ఈ నమూనాల నుంచి మొక్కల కణ గోడల్లో ఉండే అత్యంత స్థిరమైన ప్రాథమిక భాగమైన ఆల్ఫా-సెల్యులోజ్ను వారు వేరు చేశారు. ఈ సెల్యులోజ్ నమూనాలకు యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ సాంకేతికతను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ ఫలితాలను కొత్త ఇంట్ కాల్ 20 కాలిబ్రేషన్ కర్వ్, ఆక్స్ కాల్ సాఫ్ట్వేర్లతో సరిపోల్చడం ద్వారా ఈ మర్రిచెట్టు వయసుకు సంబంధించిన అత్యంత విశ్వసనీయమైన, పక్కా అంచనాపై శాస్త్రవేత్తల బృందం నిర్ధారణకు వచ్చింది.
ఈ కొత్త పరిశోధన ముంగేర్ మర్రిచెట్టుకు సంబంధించి గతంలో ఉన్న అంచనాలను పూర్తిగా తొలగించేసింది. ఇక్కడి చారిత్రక ‘బుర్రా బంగ్లా నిర్మాణం..మొఘల్ పాలన చివరి దశ లేదా బ్రిటీష్ పాలన ప్రారంభ కాలానికి ( సుమారు 300 నుంచి 350 సంవత్సరాల క్రితం) చెందినదని దాని నిర్మాణ శైలిని బట్టి తెలుస్తోంది. దీంతో అప్పట్లో పాలకులు- ప్రజల మధ్య చర్చలు, గ్రామ సభలు, మతపరమైన ఆచారాలు, సాంస్కృతిక మార్పిడిల కోసం ఈ బంగ్లా ముందే ఈ మర్రిచెట్టును నాటారని అంతా భావించేవారు. కానీ ఈ చెట్టు వయసు 700 ఏళ్లుగా తేలడంతో.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న సహజ సిద్ధమైన అడవికి చెందిన సజీవ సాక్ష్యంగా ఈ మర్రిచెట్టు మిగిలిందని, దాని నీడలోనే ఈ బుర్రా బంగ్లా నిర్మాణం జరిగిందని స్పష్టమైంది. ఈ విశ్లేషణ ఈ ప్రాంతపు చారిత్రక సంఘటనల క్రమాన్ని పునర్నిర్వచిస్తుంది.
క్వాటర్నరీ రీసెర్చ్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వారసత్వ వృక్షాల ఖచ్చితమైన వయసును నిర్ధారించడానికి ఒక ప్రామాణిక శాస్త్రీయ పద్ధతిని అందించింది. ఇది ప్రభుత్వాలు, అటవీ శాఖలు, సంరక్షణా సంస్థలకు సాంస్కృతిక, పర్యావరణ ప్రాధాన్యత కలిగిన వృక్షాలను గుర్తించి, కాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఊహాజనిత అంచనాల స్థానంలో నమ్మకమైన శాస్త్రీయ ఆధారాలను తీసుకురావడం ద్వారా సహజ, సాంస్కృతిక వారసత్వ సంరక్షణను ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ వినూత్న పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాచీన ఉష్ణమండల వృక్షాలకు కూడా వర్తింపజేయవచ్చు. ఇది జీవవైవిధ్య సంరక్షణ, వారసత్వ నిర్వహణ, పర్యావరణ విద్య, గతకాలపు వాతావరణం, చారిత్రక భూభాగాలపై జరిగే పరిశోధనలకు ఎంతగానో సహాయపడుతుంది.
ఫోటో క్యాప్షన్: బీహార్ రాష్ట్రం ముంగేర్లోని ఐటీసీ క్యాంపస్లో ఉన్న పురాతన మర్రిచెట్టు
(ఎ) చెట్టు సముదాయం. చిత్రంలో పసుపు రంగు గుర్తు ద్వారా నమూనాలను సేకరించిన ద్వితీయ కాండం, కొమ్మను సూచిస్తుంది.
(బి) ద్వితీయ కాండం నుంచి టీబీ-ఎంయూఎన్-01గా పేర్కొన్న నమూనాను సేకరించారు.
(సి) అత్యంత పురాతనమైన కొమ్మ నుంచి టీబీ-ఎంయూఎన్-02గా పేర్కొన్న నమూనాను సేకరించారు.
ఈ పరిశోధన, ఉష్ణమండల ప్రాంతాలలోని పురాతన వృక్షాల, ముఖ్యంగా మర్రిచెట్టు వంటి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వాటి శాస్త్రీయ కాల నిర్ధారణలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. ఇది అటువంటి చెట్ల వయస్సును మరింత కచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడటమే కాకుండా, దక్షిణాసియా మరియు ఇతర ప్రాంతాలలో సహజ, చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నాలకు కూడా మద్దతు ఇస్తుంది.
ఉష్ణమండల ప్రాంతాలలోని ప్రాచీన వృక్షాలకు, ముఖ్యంగా దేశ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మర్రిచెట్టు వంటి చారిత్రక చెట్లకు శాస్త్రీయంగా వయసు నిర్ధారించే ప్రక్రియలో ఈ పరిశోధన అత్యంత కీలకంగా నిలుస్తుంది. ఈ సరికొత్త పద్ధతి ఇటువంటి వృక్షాల వయసును మరింత ఖచ్చితంగా లెక్కించడానికే కాకుండా.. భారత్తో పాటు యావత్ దక్షిణాసియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజ, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ ప్రయత్నాలకు ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను కింద పేర్కొన్న లింక్ ద్వారా చదవవచ్చు.
https://doi.org/10.1017/qua.2026.10086
(रिलीज़ आईडी: 2280944)
आगंतुक पटल : 8