లోక్సభ సచివాలయం
పశ్చిమ బెంగాల్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం అవగాహన సదస్సును ప్రారంభించనున్న లోక్సభ స్పీకర్
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఇతర ప్రముఖులు
కొత్త ఎమ్మెల్యేలకు సభ పద్దతులు, సంప్రదాయాలు, సభ్యుల ప్రవర్తనా నియమావళి, విశేషాధికారాలు, ఇతర పార్లమెంటరీ పద్ధతులు, శాసనసభ నిబంధనలు, ప్రక్రియలు సుపరిపాలన వంటి కీలక అంశాలపై రెండు రోజులపాటు సాంకేతిక సమావేశాలు
శనివారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ ప్రసంగంతో ముగియనున్న అవగాహన కార్యక్రమం
प्रविष्टि तिथि:
02 JUL 2026 2:22PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం ఉద్దేశించిన రెండు రోజుల ప్రత్యేక అవగాహన సదస్సును లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించనున్నారు. కోల్కతా నగరంలో 2026 జూలై 3వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ ప్రారంభోత్సవ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రితబ్రత బెనర్జీతో పాటు ఇతర ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ రతీంద్ర బోస్ స్వాగతోపన్యాసం చేయనుండగా, పశ్చిమ బెంగాల్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శంకర్ ఘోష్ వందన సమర్పణ చేస్తారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ అవగాహన కార్యక్రమంలో నూతన ఎమ్మెల్యేలకు శాసనసభ పనితీరుపై పూర్తి అవగాహన కల్పించేందుకు పలు సాంకేతిక సమావేశాలను రూపొందించారు. ఇందులో భాగంగా ‘సమర్థవంతమైన శాసనసభ్యుడిగా ఎలా ఉండాలి; సభ సంప్రదాయాలు, ఆచారాలు, ప్రవర్తనా నియమావళి’, ‘శాసనసభలో ప్రశ్నోత్తరాలు, ఇతర సభ విధానాల ద్వారా ప్రభుత్వ జవాబుదారీతనంగా వ్యవహరించడం; ‘భారత పార్లమెంటులోని కమిటీల వ్యవస్థ’; ‘ప్రైవేటు సభ్యుల బిల్లులతో కూడిన శాసననిర్మాణ ప్రక్రియ’; ‘పార్లమెంటులో ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ’; ‘పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలు, నైతిక విలువలు; ‘జాతీయ ఈ-విధాన అప్లికేషన్’ వంటి కీలక అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యాంగ నిపుణులు, సీనియర్ పార్లమెంటరీ అధికారులు కొత్త సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకోవడానికి, ఉత్తమ పద్ధతులను తెలుసుకోవడానికి వీలవుతుందని, శాసనపరమైన విధానాలు పార్లమెంటరీ వ్యవస్థలు, ప్రజాస్వామ్య పాలనపై వారి అవగాహన మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ అవగాహన కార్యక్రమం 2026 జూలై 4వ తేదీన (శనివారం) పశ్చిమ బెంగాల్ శాసనసభలోని చారిత్రాత్మక చాంబర్లో గవర్నర్ శ్రీ ఆర్ ఎన్ రవి ప్రసంగంతో ముగియనుంది. ఈ సమావేశంలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ రతీంద్ర బోస్, ఇతర ప్రముఖులు ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్ శాసనసభ సహకారంతో లోక్సభ సచివాలయానికి చెందిన పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ (ప్రైడ్) సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పార్లమెంటరీ, శాసనసభ పనితీరులోని వివిధ అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా కమిటీల వ్యవస్థ, ఆర్థిక పర్యవేక్షణ, పార్లమెంటరీ ప్రత్యేక హక్కులు, శాసనసభల్లో అమల్లోకి వస్తున్న సరికొత్త డిజిటల్ విధానాల గురించి సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సు శాసనసభ్యులు, అసెంబ్లీ స్పీకర్లు, పార్లమెంటరీ నిపుణులు పరస్పరం సంభాషించేందుకు, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికగా నిలవనుంది.
***
(रिलीज़ आईडी: 2280420)
आगंतुक पटल : 8