నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పర్యావరణ హిత నౌకా రీసైక్లింగ్పై భారత్ - ఈయూ మధ్య బలోపేతమైన సహకారం… ఈయూ గుర్తింపునకు సిద్ధంగా మూడు భారతీయ షిప్ యార్డులు
పర్యావరణ హిత నౌకా పునర్వినియోగంలో 35.4% మార్కెట్ వాటాతో అంతర్జాతీయ నేతృత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న భారత్: సర్బానంద సోనోవాల్
నౌకా నిర్మాణ, రీసైక్లింగ్ వ్యవస్థ బలోపేతం కోసం 8 బిలియన్ డాలర్లను కేటాయించిన భారత్... సంయుక్త కార్యవర్గం ద్వారా సన్నిహిత నియంత్రణాపరమైన సహకారంపై దృష్టి సారించిన ఈయూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నౌకా నిర్మాణం, పునర్వినియోగంలో 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 16,000 నౌకల పునర్వినియోగాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న భారత్: సర్బానంద సోనోవాల్
प्रविष्टि तिथि:
01 JUL 2026 8:18PM by PIB Hyderabad
పర్యావరణహిత నౌకల రీసైక్లింగ్ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్, ఐరోపా యూనియన్ పునరుద్ఘాటించాయి. భారతీయ నౌకా రీసైక్లింగ్ కేంద్రాలను.. ఐరోపా యూనియన్ నౌకా రీసైక్లింగ్ నిబంధనల (ఈయూఎస్ఆర్ఆర్) పరిధిలోకి తెచ్చే ప్రక్రియలో పురోగతి పట్ల ఇరుపక్షాలూ ధీమా వ్యక్తం చేశాయి.
కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ - ఐరోపా పర్యావరణ, జలవనరుల సుస్థిరత, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ కమిషనర్ జెస్సికా రోజ్వాల్ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈయూ నియంత్రణ నిబంధనల పరిధిలో గుర్తింపును పొందాలని భావిస్తున్న భారతీయ నౌకా రీసైక్లింగ్ కేంద్రాల్లో ప్రస్తుత ఆడిట్, నిబంధనల అమలు ప్రక్రియను ఇరుపక్షాలూ సమీక్షించాయి.
30కి పైగా భారతీయ నౌకా రీసైక్లింగ్ యార్డులు ఈయూ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయనీ, వాటిలో ఆరు యార్డుల అనుమతులు, ఆమోద ప్రక్రియలు కొనసాగుతున్నాయనీ కేంద్ర మంత్రి అన్నారు. మరో మూడు నౌకా రీసైక్లింగ్ కేంద్రాలు అవసరమైన అన్ని నిబంధనల ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి, ఈయూ నౌకా రీసైక్లింగ్ నియంత్రణ నిబంధనల పరిధిలో చేరేందుకు అర్హత పొందాయని ఆయన వివరించారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రియాశీల నాయకత్వంలో ప్రపంచంలో అగ్రగామి నౌకా పునర్వినియోగ దేశంగా భారత్ అవతరించింది. సురక్షిత, పర్యావరణ సుస్థిర, బాధ్యతాయుత నౌకా పునర్వినియోగంలో అంతర్జాతీయ కేంద్రంగా తన స్థానాన్ని క్రమంగా బలోపేతం చేసుకుంటోంది’’ అని సర్బానంద సోనోవాల్ అన్నారు.
ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు (యూఎన్సీటీఏడీ) తాజా అంచనాల ప్రకారం.. అంతర్జాతీయంగా నౌకల పునర్వినియోగంలో భారత్ వాటా 2024లో 30.1 శాతంగా ఉండగా, 2025లో అది 35.4 శాతానికి పెరిగింది. 2025లో స్థూలంగా 2.99 మిలియన్ టన్నుల (గ్రాస్ టన్నులు) నౌకా రీసైక్లింగ్ ప్రక్రియ భారత్లో జరిగింది. 2024లో స్థూలంగా రీసైకిల్ చేసిన 1.86 మిలియన్ టన్నులతో పోలిస్తే దాదాపు 60 శాతం వృద్ధి నమోదైంది.
ఆడిట్లు, తనిఖీలు, నిబంధనల అమలు వంటి పారదర్శక ప్రక్రియల ద్వారా భారతీయ నౌకా రీసైక్లింగ్ కేంద్రాల జాబితాను రూపొందించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులను, నిర్వహణ పద్ధతులను ఆధునికీకరించేందుకు భారతీయ కేంద్రాలు భారీగా పెట్టుబడులు పెట్టాయని ఆయన పేర్కొన్నారు. సుస్థిర నౌకావాణిజ్య అభివృద్ధికీ, బాధ్యతాయుతమైన పునర్వినియోగానికీ భారత్ కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు.
వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాలు, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నడిచే మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య కేంద్రాలు, కార్మికుల కోసం ప్రత్యేక వసతి గృహాల వంటి పటిష్టమైన పర్యావరణ మౌలిక వసతులు, కార్మిక సంక్షేమ చర్యలను భారతీయ నౌకా రీసైక్లింగ్ కేంద్రాల్లో చేపడుతున్నట్టు సోనోవాల్ తెలిపారు. పర్యావరణ నిబంధనల అమలు, కార్మికుల భద్రత, పారదర్శకతల్లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగేలా చూసేందుకు.. ప్రభుత్వం క్రమానుగత, ఆకస్మిక తనిఖీలను కూడా నిర్వహిస్తోందని వెల్లడించారు.
భారత్ దీర్ఘకాలిక సంకల్పాన్ని ఈ సందర్భంగా సోనోవాల్ వివరించారు. వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 16,000 నౌకల పునర్వినియోగాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకుందన్న ఆయన.. నౌకా నిర్మాణం, పునర్వినియోగ రంగాల వృద్ధికి తోడ్పడేలా 8 బిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్ని ప్రకటించినట్టు తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ పునర్వినియోగ కేంద్రాల సంఖ్య పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు లభించడం, నౌకావాణిజ్య సుస్థిరతలతోపాటు... పర్యావరణ హిత రీసైక్లింగ్ పద్ధతులకు ప్రోత్సాహం ద్వారా తద్వారా అంతర్జాతీయ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థకు అవెంతగానో తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు సాధించిన పురోగతిని కమిషనర్ రోస్వాల్ స్వాగతించారు. సమర్థమైన సమన్వయంతోపాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడేలా.. పర్యావరణ మంత్రిత్వ శాఖ, సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలు, సంస్థల ప్రతినిధులతో ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
నిబంధనల అమలులో అత్యున్నత స్థాయి ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని కొనసాగించడంలో ఆకస్మిక తనిఖీల ప్రాధాన్యాన్ని కమిషనర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈయూ సభ్య దేశాలతో వచ్చే శరత్కాల (ఆటమ్) సమావేశాల్లో దీనిపై చర్చించిన తర్వాతే ఎలాంటి తుది నిర్ణయమైనా తీసుకుంటామని పేర్కొన్నారు.
సంప్రదింపులు, అంచనా ప్రక్రియ పూర్తయిన అనంతరం భారత నౌకా పునర్వినియోగ కేంద్రాలను సందర్శించడానికి కూడా రోస్వాల్ సుముఖత వ్యక్తం చేశారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల ఫలితాలకూ, నౌకల సురక్షిత - పర్యావరణహిత పునర్వినియోగం కోసం హాంగ్కాంగ్ అంతర్జాతీయ ఒడంబడిక నిబంధనలకు అనుగుణంగానే ఐరోపా యూనియన్ విధానం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
సుస్థిర నౌకావాణిజ్య పద్ధతులను పెంపొందించడంలో భారత్, ఐరోపా యూనియన్ల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాధాన్యాన్ని ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి. ఈయూ నిబంధనల పరిధిలోకి భారతీయ నౌకా రీసైక్లింగ్ కేంద్రాలకు గుర్తింపు లభిస్తే... అంతర్జాతీయ పునర్వినియోగ సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. అలాగే అత్యున్నత పర్యావరణ, భద్రతా ప్రమాణాలను ప్రోత్సహిస్తూ.. నౌకల పనికాల ముగింపు దశను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి, పటిష్టమైన అంతర్జాతీయ నౌకావాణిజ్య సరఫరా వ్యవస్థల నిర్మాణానికి మరింత తోడ్పాటును అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2280296)
आगंतुक पटल : 7