ప్రధాన మంత్రి కార్యాలయం
మెరుగైన పాలన, పౌరులకు సాధికారతతోపాటు వికసిత్ భారత్కు బలమైన పునాదిని అందించిన డిజిటల్ ఇండియా: ప్రధాని నరేంద్ర మోదీ
11 ఏళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం
प्रविष्टि तिथि:
01 JUL 2026 12:04PM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దేశంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చివేసిందని, ప్రజా సేవల్ని మెరుగుపరిచి పౌరుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా సర్వతోముఖాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు.. పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పౌరుల అవసరాలకు అనుగుణంగా మార్చడం ద్వారా పాలనా వ్యవస్థకే సరికొత్త నిర్వచనం ఇచ్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. సులభతరమైన డిజిటల్ చెల్లింపుల నుంచి అత్యంత పారదర్శకమైన ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విస్తరణ వరకూ ఈ వినూత్న కార్యక్రమం మానవ జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని అన్నారు. సాంకేతికతను ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించే ఒక శక్తిమంతమైన సాధనంగా డిజిటల్ ఇండియా మార్చిందని ప్రధాని పేర్కొన్నారు.
వంద కోట్ల మందికి పైగా భారతీయులు సాంకేతికతను విస్తృతంగా అంగీకరించి, రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం దేశంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకువచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మార్పు అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి డిజిటల్ ఇండియాను ఒక బలమైన పునాదిగా మర్చిందని మోదీ స్పష్టం చేశారు. ఈ నూతన ఆవిష్కరణల జోరును దేశంలోని ప్రతి మూలకు.. ముఖ్యంగా గ్రామాలకూ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విజయవంతంగా తీసుకెళ్లిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, సరికొత్త ఆవిష్కర్తలు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి అభినందించారు. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం.. విద్యా, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవ వంటి కీలక రంగాలను మరింత బలోపేతం చేసిందని, తద్వారా ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చి, పారదర్శకతతోపాటు పనితీరులో వేగాన్నీ పెంచిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత రంగాల్లో అంతర్జాతీయంగా భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో దేశం సాధిస్తున్న ప్రగతి... భవిష్యత్తులో సరికొత్త వృద్ధి మార్గాలను, అపారమైన అవకాశాలను అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికత కేవలం యంత్రాలకే పరిమితం కాకుండా, మానవాళికి సేవ చేసేలా, ప్రతి పౌరుడికి అపారమైన సాధికారతను చేకూర్చేలా, స్థిరమైన అభివృద్ధిని నడిపించే భవిష్యత్తును నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘డిజిటల్ ఇండియా ప్రారంభమై నేటికి విజయవంతంగా 11 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దేశంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రజా సేవలను అందించడంలో పౌరులకు సాధికారతను చేకూర్చింది. దేశవ్యాప్తంగా అందరి అభివృద్ధినీ వేగవంతం చేసిన ఈ కార్యక్రమం నేడు మానవ జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించింది. సులభతరమైన డిజిటల్ చెల్లింపుల నుంచి పారదర్శకమైన ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వరకు సాంకేతికతను ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించే ఒక శక్తిమంతమైన సాధనంగా డిజిటల్ ఇండియా మార్చింది.
ఈ కార్యక్రమం ఆవిష్కరణల వెల్లువను దేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలకూ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ సైతం విజయవంతంగా తీసుకెళ్లింది. ప్రస్తుతం దేశంలోని నలుమూలల నుంచి యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, సరికొత్త ఆవిష్కర్తలు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలను సృష్టిస్తున్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజా సేవ వంటి కీలక రంగాలను డిజిటల్ ఇండియా మరింత బలోపేతం చేసిందని, తద్వారా ప్రభుత్వ పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్రజలకు సులభంగా అందుబాటులోకి తెచ్చింది.
డిజిటల్ ప్రపంచంలో మనం వేస్తున్న అడుగులు.. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోయేలా చేశాయి. ఈ ప్రగతి భవిష్యత్తులో సరికొత్త వృద్ధి మార్గాలను, అపారమైన అవకాశాలను అందిస్తుంది. సాంకేతికత మానవాళికి సేవ చేసేలా, ప్రతి పౌరుడికి సాధికారతను చేకూర్చేలా, స్థిరమైన ప్రగతి పథంలో నడిపించేలా భవిష్యత్తును నిర్మించడంపైనే మా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది.
వంద కోట్లకు పైగా భారతీయులు సాంకేతికతను పెద్ద ఎత్తున అంగీకరించి, రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నప్పుడు.. దాని ప్రభావం ఇంతే విప్లవాత్మకంగా ఉంటుంది’’.
***
(रिलीज़ आईडी: 2279877)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam