రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్రంలో చిక్కిన ఆరుగురు మత్స్యకారులను రక్షించిన ఐసీజీ
प्रविष्टि तिथि:
30 JUN 2026 2:02PM by PIB Hyderabad
మంగళూరు తీరంలో మునిగిపోతున్న భారత మత్స్యకార పడవ (ఐఎఫ్బీ) మంజుమాతలోని ఆరుగురు మత్స్యకారులను భారత తీర రక్షక దళం కాపాడింది. కఠినమైన పరిస్థితుల్లో గాలింపు, రక్షణ (ఎస్ఏఆర్) చర్యలు చేపట్టింది. సూరత్కల్ తీర ప్రాంతానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పడవ నుంచి సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో అత్యవసర సాయాన్ని కోరుతూ ఐసీజీ నౌక సచేత్కు వీహెచ్ఎఫ్ ఆర్టీ కాల్ వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల పడవ లోపలికి నీరు చేరుతోందనీ, దీనివల్ల పడవలోని ఆరుగురి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం అందింది. తక్షణమే స్పందించిన ఐసీజీ, సహాయం అందించడం కోసం నౌకను మళ్లించి, ప్రమాదంలో ఉన్నవారిని చేరుకుంది.

అల్లకల్లోలమైన సముద్రం, బలమైన గాలులు, వెలుతురు తక్కువగా ఉండటం లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఐసీజీఎస్ సచేత్ సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. మత్స్యకారులను చేరుకోవడానికి ప్రతికూల సముద్ర పరిస్థితులలో ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రిమోట్-ఆపరేటెడ్ లైఫ్బాయ్లను ఉపయోగించి వారిని రక్షించారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి పడవలో చిక్కుకున్న ఆరుగురినీ కాపాడారు. వారితో
సహా ఐఎన్ఎస్ సచేత్ న్యూమంగుళూరు దిశగా తిరుగు ప్రయాణంలో ఉంది.
సముద్రంలో ప్రమాదాలకు గురైన వారిని కాపాడటంలో భారత తీరరక్షక దళానికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ఆపరేషన్ నిదర్శనంగా నిలుస్తుంది. సముద్రాల్లో ఏర్పడిన సంక్లిష్టమైన అత్యవసర పరిస్థితులను అధిగమించేలా తీర రక్షక దళ సిబ్బంది ధైర్యం, శిక్షణ, వృత్తి నైపుణ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానాన్ని ఇది తెలియజేస్తుంది.

***
(रिलीज़ आईडी: 2279380)
आगंतुक पटल : 8