రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ
प्रविष्टि तिथि:
30 JUN 2026 12:51PM by PIB Hyderabad
నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలను అందించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం భారత సైన్యాధిపతి (సీఓఏఎస్) బాధ్యతల నుంచి ఇవాళ పదవీ విరమణ పొందారు. అత్యున్నత స్థాయి కార్యాచరణ సన్నద్ధతను కొనసాగించటం, త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయటం, సైన్యంలో పరివర్తనాత్మక ప్రక్రియను వేగవంతం చేయటం, సాంకేతికతను అందిపుచ్చుకోవటం, సాయుధ దళాల పునర్వ్యవస్థీకరణ, సైనికుల సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వటం వంటివి ఆయన పదవీకాలంలో గుర్తిండిపోయే అంశాలు.
భారత సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్ని రక్షణ రంగాల్లో సైనిక సంసిద్ధతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆయన నాయకత్వంలో ఆపరేషన్ స్నో లెపర్డ్ ద్వారా ఉత్తర సరిహద్దుల్లో పటిష్టమైన, అప్రమత్తమైన వ్యూహాన్ని భారత సైన్యం కొనసాగించింది. పశ్చిమ సరిహద్దులో పట్టుదల, సంయమనం, వృత్తిపరమైన నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తించింది. మారుతున్న భద్రతా వ్యవస్థలో భారత సైన్యం సంసిద్ధతను, ఖచ్చితత్వాన్ని వ్యూహాత్మక స్పందనను ప్రతిబింబిస్తూ ఆపరేషన్ సిందూర్.. ఆయన పదవీకాలంలో కీలక ప్రస్థానంగా నిలిచింది.
భారత సైన్యంలో ప్రస్తుతం సాగుతున్న దశాబ్దపు మార్పుల దిశగా జనరల్ ఉపేంద్ర ద్వివేది బలమైన దిశా నిర్దేశం చేశారు. ఆయన నాయకత్వంలో సైనిక బలగాల పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణ, సాంకేతిక వినియోగం, సమన్వయం, వ్యవస్థాగత సంస్కరణలు, మానవ వనరుల నిర్వహణ వంటి రంగాల్లో భారత సైన్యం సంస్కరణలను చేపట్టింది. ఆధునిక, క్రీయాశీలక, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా భారత సైన్యాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా.. రుద్ర బ్రిగేడ్స్, భైరవ్ బెటాలియన్స్, అశ్ని డ్రోన్ ప్లాటూన్స్, శక్తిబాణ్ రెజిమెంట్స్, దివ్యాస్త్ర బ్యాటరీస్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ బ్రిగేడ్స్, ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ (ఐబీజీలు) వంటి కీలక వినూత్న చర్యలను చేపట్టారు.
త్రివిధ దళాలు పరస్పరానుబంధంగా పనిచేయాలని జనరల్ ఉపేంద్ర ద్వివేది భావించారు. భవిష్యత్తులో జరిగే సంయుక్త, యుద్ధ రంగ ఆధారిత కార్యకలాపాల అవసరాలకు అనుగుణంగా ఆర్మీ, నేవీ, వైమానిక దళాల మధ్య సమగ్రత, ఉమ్మడి కార్యాచరణ ఆలోచన, మెరుగైన సమన్వయాన్ని ఆయన ప్రోత్సహించారు.
సైనిక సిబ్బంది, మాజీ సైనిక ఉద్యోగులు, వీర నారీల సంక్షేమానికి ఆయన పదవీకాలంలో అత్యంత ప్రాధాన్యత లభించింది. వెటరన్స్ అచీవర్స్ అవార్డు వంటి కార్యక్రమాల ద్వారా వారి సహకారానికి గుర్తింపును అందించటంతో పాటు సైనికులు, మాజీ సైనిక ఉద్యోగులతో సైన్యానికున్న బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. సైనికులు, వారి కుటుంబాల పట్ల సైన్యానికున్న బాధ్యత కేవలం విధుల్లో ఉన్నంత వరకే పరిమితం కాదని.. ఆ తర్వాత కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
భారత సైన్యం భవిష్యత్ సన్నద్ధతకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికను అందించేందుకు వికసిత్ భారత్ విజన్-2047, ఆర్మ్డ్ ఫోర్సెస్ విజన్-2047ల స్ఫూర్తితో రూపొందించిన వ్యూహాత్మక భద్రతా మార్గదర్శకాలు-2047 తయారీకి జనరల్ ఉపేంద్ర ద్వివేది దిశా నిర్దేశం చేశారు.
భారత సైన్యానికి జనరల్ ఉపేంద్ర ద్వివేది అందించిన విశేష సేవలకు గానూ ప్రతిష్ఠాత్మక పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ పురస్కారాలను అందుకున్నారు.



***
(रिलीज़ आईडी: 2279350)
आगंतुक पटल : 10