నీతి ఆయోగ్
‘యూత్ కో: ల్యాబ్ నేషనల్ ఇన్నొవేషన్ చాలెంజ్ - 2026’లో యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరు అంకుర సంస్థల విజయం
వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణ హిత పద్ధతిలో తయారు చేసిన వస్త్రాలు, ఆహార వ్యవస్థల్లో ముందున్న ఆవిష్కర్తలకు హైదరాబాద్లోని టి-హబ్లో సత్కారం..
28 రాష్ట్రాల నుంచి వచ్చిన 350కి పైగా దరఖాస్తుదారుల నుంచి ఎంపిక
प्रविष्टि तिथि:
24 JUN 2026 11:21AM by PIB Hyderabad
వ్యర్థాల పునర్వినియోగ ఆవిష్కరణలు, పర్యావరణహిత పద్ధతిలో రూపొందించిన వస్త్రాలు - ఫ్యాషన్ రంగం, సుస్థిర ఆహార వ్యవస్థలు, జల సంరక్షణ ద్వారా.. పర్యావరణ హిత పద్ధతులను ముందుకు తీసుకెళ్లే వినూత్న ఆవిష్కరణల అభివృద్ధికి గాను యువత నేతృత్వంలో నడుస్తున్న దేశంలోని ఆరు అంకుర సంస్థలు ‘యూత్ కో: ల్యాబ్ నేషనల్ ఇన్నొవేషన్ ఛాలెంజ్-2026’ ఎనిమిదో ఎడిషన్ విజేతలుగా నిలిచాయి.
అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం) భాగస్వామ్యంతో.. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ)- భారత్, సిటీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టి-హబ్ ఫౌండేషన్ ఈ ‘యూత్ కో: ల్యాబ్ నేషనల్ ఇన్నొవేషన్ ఛాలెంజ్’ను నిర్వహించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేసే దిశగా.. యువత నేతృత్వంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో దేశంలో ప్రముఖమైన వేదికగా నిలిచింది.
ఈ ఏడాది దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన యువత నేతృత్వంలో నడుస్తున్న అంకుర సంస్థల నుంచి 350కి పైగా దరఖాస్తులు వచ్చాయి. కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం.. అత్యంత ప్రతిభావంతమైన 50 అంకుర సంస్థలను ‘నేషనల్ స్ప్రింగ్బోర్డ్ ప్రోగ్రామ్’కు ఎంపిక చేశారు. సంబంధిత పరిశ్రమకు చెందిన 16 మంది మార్గనిర్దేశకులు, ఆయా రంగాల్లో నిపుణుల పర్యవేక్షణలో వీరికి మూడు నెలల పాటు వర్చువల్ విధానంలో సామర్థ్యాభివృద్ధి శిక్షణను అందించారు.
పోటీలో పాల్గొన్న అంకుర సంస్థలు రంగాల వారీగా మూడు ప్రత్యేక విభాగాల్లో సేవలందించాయి:
2026 జూన్ 4న నిర్వహించిన జాతీయ ఆవిష్కరణ చర్చల్లో.. న్యాయ నిర్ణేతల బృందం ఎదుట ఈ 50 అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. వాటి నిశితంగా మదింపు చేశారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 అగ్రశ్రేణి అంకుర సంస్థలు.. 2026 జూన్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్లోని టి-హబ్లో నిర్వహించిన ప్రాంతీయ ప్రత్యక్షానుభవ బూట్ క్యాంపునకు అర్హత సాధించాయి.
అయిదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. వ్యాపార నమూనాలను బలోపేతం చేయడంతోపాటు, వాటి ప్రభావ పరిధిని విస్తరించడం లక్ష్యంగా నిపుణుల ప్రసంగాలు, మార్గనిర్దేశక సదస్సులు, క్షేత్రస్థాయి సందర్శనలు, పరస్పర అవగాహన కార్యక్రమాల ద్వారా.. అంకుర సంస్థల నిర్వాహకులు, సుస్థిరాభివృద్ధి నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒక్కచోట చేరారు.
2026 జూన్ 18న న్యాయనిర్ణేతల తుది పరిశీలన అనంతరం.. విస్తరణకు అనువైన, అత్యధిక ప్రభావాన్ని చూపే పద్ధతులను రూపొందించిన ఆరు అంకుర సంస్థలు ఎంపికయ్యాయి.
విజేతలుగా నిలిచిన మూడు అంకుర సంస్థలకు రూ.3,50,000 చొప్పున ప్రారంభ మూలధన ఆర్థిక సాయంతోపాటు.. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలనూ, వ్యవస్థాగత అనుసంధానాన్నీ కల్పించారు. అలాగే, రన్నర్లుగా నిలిచిన మరో మూడు సంస్థలకు.. వారి ఆశాజనకమైన కృషికీ, సామర్థ్యానికీ గుర్తింపుగా రూ.2,20,000 చొప్పున అందించారు.
యూఎన్డీపీ, అటల్ ఆవిష్కరణల మిషన్, టి-హబ్, ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణ వ్యవస్థా ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డులను అందించారు.
‘భారత్లో పర్యావరణ హిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం: యువత, పెట్టుబడి, రానున్న ఆవిష్కరణల దశాబ్దం’ అన్న అంశంపై తెలంగాణ ఆవిష్కరణల విభాగం (టీజీఐసీ) సీఈవో మెరాజ్ ఫహీం ప్రత్యేకంగా ప్రసంగించారు. ‘‘మనం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సవాళ్ల పరిష్కారం దిశగా.. ఆవిష్కరణ, సహకారం, యువ నాయకత్వ శక్తిని యూత్ కో:ల్యాబ్ వంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయి. ఈ ప్రయాణంలో భాగమైనందుకు మేం గర్విస్తున్నాం. ఆలోచనలను అర్థవంతమైన ఫలితాలుగా మలచుకునేలా యువ ఆవిష్కర్తలకు తోడ్పడే వ్యవస్థలను పెంపొందించడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మెరాజ్ ఫహీం పేర్కొన్నారు.
భారత్కు స్టార్టప్ల సమస్య లేదు. ఉన్నది విస్తరణ సమస్యే. ముఖ్యంగా పెట్టుబడుల విస్తరణ బెంగళూరు, ఢిల్లీలకే చాలావరకూ పరిమితమైంది. అలాగే మార్గనిర్దేశకత్వం కూడా తృతీయ శ్రేణి నగరాలు, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. ఇక మహిళలు, దివ్యాంగులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వస్తున్న వ్యవస్థాపకులకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే యూత్ కో:ల్యాబ్ వంటి కార్యక్రమాలున్నాయి. ఈ రోజు మనం చూస్తున్న ఫలితాలు ఆ మార్పు మొదలైందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’’ అని నీతి ఆయోగ్ అటల్ ఆవిష్కరణల మిషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రతీక్ దేశ్ముఖ్ వివరించారు.
‘‘భారతదేశపు గొప్ప వనరుల్లో దాని యువశక్తి ఒకటి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసువారే ఉన్నారు. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేలా యువ ఆవిష్కర్తలకు మనం ఎంత సమర్థంగా మద్దతిస్తామన్నదే.. దేశ అభివృద్ధి, వాతావరణ లక్ష్యాల సాధనలో మన సమర్థతకు ప్రాతిపదిక. వ్యర్థాలు, నీటి కొరత, పర్యావరణ అననుకూల ఉత్పత్తి విధానాల వంటి మన కాలపు అత్యంత తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలతో 350కి పైగా అంకుర సంస్థలు ముందుకొచ్చాయి. ఎంపిక చేసిన సంస్థల్లో 40 శాతానికి పైగా మహిళల నేతృత్వంలో నడుస్తున్నవే. ఆవిష్కరణ వ్యవస్థలో వైవిధ్యాన్ని ఇది చాటుతోంది. ఈ వైవిధ్యమే దేశంలో ఆవిష్కరణలకు ఊతమిస్తోంది. మెరుగైన భవితను క్రియాశీలంగా నిర్మిస్తున్న ఇలాంటి తరం కోసం.. మా భాగస్వాముల సహకారంతో పెట్టుబడి పెట్టడం మాకు గర్వకారణం’’ అని యూఎన్డీపీ - భారత్ రెసిడెంట్ ప్రతినిధి డాక్టర్ ఏంజెలా లుసిగి వ్యాఖ్యానించారు.
ఈ ముగింపు వేడుకల్లో భాగంగా.. ‘మౌలిక వసతిగా సమ్మిళితత్వం: అందరికీ ఉపయోగపడేలా ఆవిష్కరణ వ్యవస్థల నిర్మాణం’ అంశంపై నిపుణుల బృందంతో చర్చను కూడా నిర్వహించారు. టీ-హబ్ జీసీసీల స్టార్టప్ విభాగం అధిపతి పంకజ్ వైష్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ చర్చాగోష్టిలో శ్రావ్య కనీతి (అభ్యసనం, సమ్మిళిత్వంలో నిపుణులు), మనబేంద్ర సన్యాల్ (యూత్ ఎయిడ్ ఫౌండేషన్ సీఈవో), వైజయంతీ వసంత మొగ్లి (అభివృద్ధి నిపుణులు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ఆశా మీనన్ సలహా కమిటీ సభ్యురాలు) తదితరులు ప్యానెలిస్టులుగా పాల్గొన్నారు.
‘యువతపై భరోసా: తదుపరి తరం ప్రభావశీల వ్యవస్థాపకుల్లో పెట్టుబడిదారులు, సంస్థలు ఏం ఆశిస్తున్నాయి?’ అనే అంశంపై రెండో చర్చాగోష్టిని నిర్వహించారు. అటల్ ఆవిష్కరణల మిషన్ ఇన్నొవేషన్ లీడ్ వితస్తా తివారీ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. కాగా బ్రహ్మ కమల్ వ్యవస్థాపకులు, ఏంజెల్ ఇన్వెస్టర్ సిద్ధార్థ మొహంతి, అప్సర్జ్ గ్లోబల్ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్ వర్మ, యూఎన్డీపీ- భారత్ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి విభాగం అధిపతి అమిత్ కుమార్, అటల్ ఆవిష్కరణల మిషన్ ప్రోగ్రామ్ లీడ్ ప్రతీక్ దేశ్ముఖ్, అలియాప్ నైపుణ్యాభివృద్ధి విభాగం వైస్ చైర్పర్సన్ పద్మావతీ అన్నపూర్ణ తదితరులు ఈ బృంద చర్చలో పాల్గొన్నారు.
యూత్ కో:ల్యాబ్ గురించి
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ), సిటీ ఫౌండేషన్ సంయుక్తంగా 2017లో యూత్ కో:ల్యాబ్ను నెలకొల్పాయి. యువతను సాధికారులను చేసి, వారిపై పెట్టుబడులు పెట్టే దిశగా.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల కోసం ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం దీని లక్ష్యం. తద్వారా నాయకత్వం, సామాజిక ఆవిష్కరణ, వ్యవస్థాపకత ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలును వారు వేగవంతం చేయగలరు. యూత్ కో:ల్యాబ్ గురించి ఇక్కడ మరింత చదవండి.
అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం) గురించి
స్వయం ఉపాధి - ప్రతిభా సద్వినియోగం (సేతు)తో కూడిన అటల్ ఆవిష్కరణల మిషన్.. దేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. సాంకేతికత ఆధారిత రంగాల్లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రాలు, గ్రాండ్ ఛాలెంజ్లు, అంకుర సంస్థలు, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించే ఒక సమర్థమైన వేదికగా నిలవడం దీని ముఖ్యోద్దేశం.
యూఎన్డీపీ గురించి
పేదరిక నిర్మూలనతోపాటు అసమానతలనూ, సామాజిక వెలివేతనూ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిస్తూ.. 170కి పైగా దేశాలు, ప్రాంతాల్లో యూఎన్డీపీ సేవలందిస్తోంది. భారత్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించడానికీ, ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయడానికి యూఎన్డీపీ కృషిచేస్తోంది. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధినీ, వాతావరణ హిత కార్యాచరణనూ, పటిష్టమైన ఇంధన - పర్యావరణ వ్యవస్థలనూ ఇది ప్రోత్సహిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి కూడా యూఎన్డీపీ సహకారాన్ని అందిస్తోంది. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://www.undp.org/india
సిటి ఫౌండేషన్ గురించి
ప్రపంచవ్యాప్తంగా అల్ప ఆదాయ వర్గాల ఆర్థిక పురోగతిని పెంపొందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సిటీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించేందుకు, యువతకు ఉపాధి అవకాశాలను వేగవంతం చేసేందుకు, ఆర్థికంగా శక్తిమంతమైన సమాజాల నిర్మాణానికి అవసరమైన సరికొత్త విధానాలకు రూపకల్పన చేసే ప్రయత్నాలకు మద్దతిస్తూ పెట్టుబడులు పెడుతుంది. ‘దాతృత్వానికి మాత్రమే పరిమితం కాకుండా...’ అనే విధానాన్ని సిటి ఫౌండేషన్ అనుసరిస్తోంది. లక్ష్య సాధనతోపాటు ఆలోచనాత్మక నాయకత్వాన్నీ, ఆవిష్కరణలనూ ముందుకు నడిపించేలా.. సిటి, దాని ఉద్యోగుల విస్తృత నైపుణ్యాలను ఉపయోగించుకుంటుంది. మరింత సమాచారం కోసం సందర్శించండి: www.citifoundation.com.
టి-హబ్ గురించి
టి-హబ్ ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ హబ్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కొన్ని ఇంక్యుబేషన్, ఆవిష్కరణ కార్యక్రమాలకు కీలక వేదికగా నిలుస్తూ - వివిధ కార్యక్రమాలు, భాగస్వామ్యాలు, అంతర్జాతీయ అవకాశాల ద్వారా.. ఆలోచన దశ నుంచి సంస్థ విస్తరణ వరకు వ్యవస్థాపకులకు పూర్తిస్థాయిలో మద్దతునిస్తోంది.
అంకుర సంస్థలు, కార్పొరేట్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ మార్కెట్లను ఏకతాటిపైకి తెచ్చి.. ఆలోచన దశ నుంచి విస్తరణ వరకు వ్యవస్థాపకులకు అండగా ఉంటుంది. వివిధ రంగాల్లో బృంద ప్రాతిపదికన కార్యక్రమాల ద్వారా.. ప్రముఖ మార్గనిర్దేశకులతో అనుసంధానమవడానికి, వారి సంస్థల వృద్ధి దశకు తగినట్టుగా వ్యవస్థీకృత మద్దతును పొందడానికి వ్యవస్థాపకులకు టి-హబ్ తోడ్పడుతుంది. మరిన్ని వివరాల కోసం సందర్శించండి: www.t-hub.co
***
(रिलीज़ आईडी: 2277679)
आगंतुक पटल : 6