ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌర హక్కుల రక్షణకు కట్టుబడ్డామని పునరుద్ఘాటిస్తూ
సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 JUN 2026 10:53AM by PIB Hyderabad

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను రక్షించిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాలలో  ఎమర్జెన్సీ ఒకటి అని ఆయన అన్నారు. ఆ సమయం...  మౌనంగా ఉండిపోకుండా, రాజ్యాంగంలోని ఆదర్శాలను నిలబెట్టిన  అసంఖ్యాక పౌరుల అసాధారణ ధైర్య, సాహసాలను, ధీరత్వాన్ని చాటిందని కూడా ఆయన అన్నారు.
రాజ్యాంగ విలువల పట్ల దేశ ప్రజల నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘రాజ్యాంగం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు, హక్కులకు, కర్తవ్యాలకు ప్రతీక. ఈ భావనను మార్గదర్శకంగా స్వీకరించి, భారత్ ప్రజాస్వామిక పునాదులను నిరంతరం పటిష్టం చేస్తుండటంతో పాటు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఆదర్శాలకు కట్టుబడి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌర హక్కులను రక్షిస్తామనే నిబద్ధతను శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ, ‘‘స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి స్వాతంత్య్రాల్లభతే పరమ్ స్వాతంత్య్రాన్నివృత్తిం గచ్ఛేత్ స్వాతంత్య్రాత్ పరమం పదమ్’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు:
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాల్లో ఒకటైన అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను దృఢంగా రక్షించిన వారందరికీ మనం ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.
అత్యవసర స్థితి మన రాజ్యాంగంపై నేరుగా చేసిన దాడి. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా తొలగించారు. అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉన్న స్వతంత్రాన్ని అణచివేశారు. రాజకీయ నాయకులను, పత్రికా రచయితలను, సంఘ సేవకులను అరెస్టు చేయడమే కాకుండా, మన ప్రజాస్వామ్యానికి మూలాధారంగా ఉన్న సంస్థలపై దాడి చేశారు.
అదే కాలంలో ఎంతో మంది పౌరులు మనకెందుకులే అని ఊరుకోకుండా అసాధారణ ధైర్య సాహసాలను కనబరిచి మన రాజ్యంగంలో పొందుపరిచిన ఆదర్శాలను నిలబెట్టారు.
మన అందరి దృష్టిలో, మన రాజ్యాంగం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, కర్తవ్యాలకు ప్రతీక. రాజ్యాంగ విలువలను కాపాడతామన్న మన ఉమ్మడి నిబద్ధతను మనం మరోసారి స్పష్టం చేస్తున్నాం. మన రాజ్యాంగ భావన నుంచి మార్గదర్శకత్వాన్ని అందుకొని న్యాయానికి, స్వేచ్ఛకి, సమానత్వానికి, సోదరభావానికి ఎప్పటికీ కట్టుబడి ఉండే భారత్‌ను ఆవిష్కరించుకుందాం.’’
‘సంవిధాన్ హత్యా దివస్’ మనకు భారతీయ ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా అణచివేసిన అత్యంత నిరాశామయ కాలాన్ని గుర్తుకు తీసుకు వస్తోంది. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌర హక్కుల రక్షణకు మనం ఎప్పటికీ కట్టుబడి ఉండాలనే స్ఫూర్తిని మనకు అందిస్తోంది. అత్యవసర స్థితికి ఎదురొడ్డి నిలిచిన వారందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను
స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి స్వాతంత్య్రాల్లభతే పరమ్
స్వాతంత్య్రాన్నివృత్తిం గచ్ఛేత్ స్వాతంత్య్రాత్ పరమం పదమ్’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2277670) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil , Kannada