యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కోల్కతా నుంచి దేశవ్యాప్త యోగా ఉత్సవాలకు నేతృత్వం వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, సినీ నటుడు శ్రీ అక్షయ్ కుమార్
వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి యోగానూ, ఫిట్నెస్నూ
దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఎంతైనా అవసరం: డాక్టర్ మాండవీయ
వివిధ ఎస్ఏఐ కేంద్రాలు, క్రీడా సంస్థల్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఔత్సాహికులు
प्रविष्टि तिथि:
21 JUN 2026 12:50PM by PIB Hyderabad
పన్నెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్కతాలో ఈ రోజు నిర్వహించిన దేశవ్యాప్త కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ఈ క్రమంలో ‘ఆరోగ్యవంతమైన వార్ధక్యానికి యోగా’ ఇతివృత్తంతో దేశమంతటా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయతో పాటు సినీ నటుడు, ఫిట్నెస్ ఐకన్ శ్రీ అక్షయ్ కుమార్ నాయకత్వం వహించారు.
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమంలో స్టేడియంలో దాదాపు 3,000 మంది పాలుపంచుకున్నారు.
దీంతో పాటే, దేశం నలుమూలలా భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ)కి చెందిన వివిధ కేంద్రాలు, జాతీయ శ్రేష్ఠతా కేంద్రాలు (ఎన్సీఈ), ఎస్ఏఐ శిక్షణ కేంద్రాలు, ఖేలో ఇండియా సంస్థలు, ఇతర క్రీడా సంస్థల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ కార్యక్రమాల్లో లక్షల మంది పౌరులు పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి డాక్టర్ మాండవీయ ప్రసంగిస్తూ, ‘‘భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న కలను సాకారం చేసుకోవాలంటే యోగాతో పాటు ఫిట్నెస్ను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని తీరాలి’’ అన్నారు.
ఉమ్మడి భాగస్వామ్యంతో, ప్రవర్తన శైలిలో మార్పును తీసుకురావడంతో పాటు నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణని ప్రోత్సహించడంలో ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ పోషిస్తున్న పాత్రను మంత్రి ప్రస్తావించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారితో డాక్టర్ మాండవీయ మాటామంతీలో పాల్గొని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు దైనందిన జీవితంలో యోగా, సైకిలింగ్ వంటి శారీరక దృఢత్వానికి తోడ్పడే అభ్యాసాల్ని అనుసరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని స్పష్టం చేశారు.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో యోగాకు ఉన్న ప్రాధాన్యాన్ని శ్రీ అక్షయ్ కుమార్ వివరించారు. శారీరక దృఢత్వాన్ని క్రమం తప్పని అలవాటుగా చేసుకోవాల్సిందిగా ప్రజలను ఆయన ప్రోత్సహించారు.
కార్యక్రమాన్ని సాంస్కృతిక ప్రదర్శనలతో మొదలుపెట్టారు. తరువాత కోల్కతా నుంచి ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారంతో పాటు యోగా, వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ అన్షుకా పర్వానీ నాయకత్వంలో ‘సామాన్య యోగా అభ్యాసక్రమం’ (కామన్ యోగా ప్రోటోకాల్)కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్షుకా పర్వానీని ‘ఫిట్ ఇండియా ఐకన్’గా సత్కరించారు.
శారీరక దృఢత్వాన్నీ, ఆరోగ్యకర జీవనశైలినీ ప్రోత్సహించడంలో తోడ్పాటును అందిస్తున్నందుకు శ్రీ అక్షయ్ కుమార్ను కూడా ‘ఫిట్ ఇండియా ఐకన్’గా సత్కరించారు.
ఈ సందర్భంగా, యోగాసనాల్లో భారత్ విజయాలను కొనియాడారు. అహ్మదాబాద్లో ఇటీవలే నిర్వహించిన యోగాసన క్రీడా ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన క్రీడాకారులను ‘ఫిట్ ఇండియా ఛాంపియన్లు’గా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు, యువజన వ్యవహారాల కార్యదర్శి పల్లవీ జైన్ గోయల్, క్రీడా మంత్రిత్వ శాఖకీ, ఎస్ఏఐకీ చెందిన సీనియర్ అధికారులతో పాటు క్రీడాజగతికి చెందిన వారు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన వారు యోగాతో ముడిపడిన కార్యకలాపాల్లోనూ, నిపుణుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్ కార్యక్రమాల్లోనూ, భారత సాంప్రదాయిక ఫిట్నెస్ పద్ధతుల్ని చాటిచెప్పే ‘మల్లఖంబ్’ ప్రదర్శనలోనూ పాలుపంచుకున్నారు.
దేశమంతటా నిర్వహించిన ఈ కార్యక్రమం.. మెరుగైన జీవన శైలిని ప్రోత్సహించడంలో ‘ఫిట్ ఇండియా’, ‘మై భారత్’, ‘యోగాసన్ భారత్’ వంటి ప్రధాన కార్యక్రమాల మధ్య సమన్వయం రోజు రోజుకూ విస్తరిస్తుండటాన్ని ప్రతిబింబించింది.
యోగా అంతర్జాతీయ స్థాయిలో ‘వెల్నెస్ మూవ్మెంట్’గా నిరంతర ప్రాతిపదికన విస్తరిస్తోందని ఈ కార్యక్రమాలు చాటిచెప్పాయి.
***
(रिलीज़ आईडी: 2276410)
आगंतुक पटल : 15