రైల్వే మంత్రిత్వ శాఖ
గుజరాత్లోని అహ్మదాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో రూ.140 కోట్ల కవచ్ ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం
प्रविष्टि तिथि:
15 JUN 2026 2:25PM by PIB Hyderabad
రైలు ప్రయాణ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ రైల్వే పరిధిలోని గుజరాత్ అహ్మదాబాద్ డివిజన్ పరిధిలో 48 బ్లాక్ సెక్షన్లలో 598 కిలోమీటర్ల మేర ‘కవచ్ వెర్షన్ 4.0’ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 140 కోట్ల నిధులను మంజూరు చేశారు. భారతీయ రైల్వేలోని మిగిలిన అన్ని మార్గాల్లో ఎల్టీఈ ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్తో కూడిన కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసే సమగ్ర పథకంలో భాగంగా ఈ పనులకు అనుమతి లభించింది.
అహ్మదాబాద్ డివిజన్లో సుమారు 702 కిలోమీటర్ల మేర కవచ్ పనులకు ఇప్పటికే అనుమతులు లభించాయి. తాజాగా మంజూరైన ప్రాజెక్టుతో ఈ డివిజన్లోని మిగిలిన అన్ని విభాగాలు కూడా పూర్తిగా కవచ్ పరిధిలోకి రానున్నాయి. దీంతో స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ రైలు రక్షణ వ్యవస్థను డివిజన్ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి మార్గం సుగమమైంది.
రైళ్ల నిర్వహణ భద్రతను పెంపొందించేందుకు స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థే ఈ కవచ్. ఇది రైళ్లు ప్రమాదవశాత్తూ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లకుండా నిరోధించడంతోపాటు ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు స్వయంచాలితంగా బ్రేకులు వేస్తుంది. అత్యంత కీలక సమయాల్లో రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదాలను పూర్తిగా నివారించడానికి ఈ కవచ్ వ్యవస్థ ఎంతగానో సహాయపడుతుంది.
రైల్వే భద్రతను పటిష్టం చేయడానికి, రైళ్ల కార్యకలాపాలను ఆధునీకరించడానికి భారతీయ రైల్వే చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ కవచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2273079)
आगंतुक पटल : 22