రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల పరివర్తన: వికసిత భారత్ దిశగా దేశ ప్రయాణానికి మరింత శక్తి
నాడు పోస్టు చేయడమైనది:
14 JUN 2026 2:45PM by PIB Hyderabad
రహదారి మౌలిక వసతుల రంగంలో గడచిన పన్నెండేళ్లలో భారత్ అపూర్వమైన మార్పులను చూసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మార్గదర్శకత్వంలో అనుసంధాన రంగంలో నూతన శకానికి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్టీహెచ్) నాయకత్వం వహిస్తోంది. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తోంది. సరకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. లక్షలాది ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తోంది.
జాతీయాభివృద్ధికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులే కీలకమైనవిగా గుర్తించి, రవాణా సదుపాయాలను విస్తరించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రోడ్డు భద్రతను పెంపొందించడం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరివర్తనాత్మక కార్యక్రమాలను చేపట్టింది. వేగవంతమైన జాతీయ రహదారుల విస్తరణ, రికార్డు స్థాయి నిర్మాణ వేగం, ప్రతిష్ఠాత్మకమైన ఎక్స్ప్రెస్ వేల అభివృద్ధి కలసి భారతీయ రవాణా వ్యవస్థను పునర్నిర్మించాయి. ఆధునికమైన, స్వయం సమృద్ధ దేశానికి పునాదులను బలోపేతం చేశాయి.
భారతమాల పరియోజన: సమీకృత జాతీయ అనుసంధానానికి దార్శనికత
దేశవ్యాప్తంగా సరకులు, ప్రయాణీకుల రవాణాను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన భారతమాల పరియోజన, జాతీయ రహదారి రంగంలో అత్యంత పరివర్తనాత్మక కార్యక్రమాల్లో ఒకటిగా ఉంది. సుమారు రూ. 5.35లక్షల కోట్ల అంచనా వ్యయంతో 34,800 కిలోమీటర్ల జాతీయ రహదారి కారిడార్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ కార్యక్రమానికి 2017 అక్టోబర్లో భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆర్థిక కారిడార్లు, అంతర కారిడార్లు, ఫీడర్ మార్గాలు, జాతీయ కారిడార్ల సామర్థ్య పెంపు ప్రాజెక్టులు, సరిహద్దు రహదారులు, తీరప్రాంత రోడ్లు, ఓడరేవుల అనుసంధాన రహదారులు, ఎక్స్ప్రెస్ వేల అభివృద్ధిపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. 2026, మార్చి నాటికి 26,425 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను కేటాయించగా, 22,590 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. రవాణా అనుసంధానాన్ని భారతమాల పరియోజన ప్రాజెక్టు గణనీయంగా పెంపొందించింది. సరకు రవాణా ఖర్చులను తగ్గించింది. మారుమూల, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరిచింది. తద్వారా ఆర్థికాభివృద్ధికి, ప్రాంతీయ సమతుల్యతకు, జాతీయ సమైక్యతకు దోహదపడింది.
జాతీయ రహదారుల వ్యవస్థ విస్తరణ
గత దశాబ్దంలో సాధించిన అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల విజయాల్లో భారతదేశ జాతీయ రహదారుల వ్యవస్థ విస్తరణ ఒకటిగా ఉంది. ఈ వ్యవస్థ 2014లో దాదాపు 91,287 కిలోమీటర్ల నుంచి ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,46,572 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. ఈ వృద్ధి దాదాపు 61 శాతంగా ఉంది.
అద్భుతమైన రీతిలో సాధించిన ఈ వృద్ధి ద్వారా రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య అనుసంధానం పెరిగింది. వేగవంతమైన సరకు, సేవల రవాణాను సులభతరం చేసింది. మార్కెట్లకు రవాణా మార్గాలను విస్తరించింది. దేశ ఆర్థిక వెన్నెముకను బలోపేతం చేసింది. మారుమూల, వెనకబడిన ప్రాంతాలను వృద్ధి కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలతో అనుసంధానించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూడ్చేందుకు విస్తరించిన ఈ నెట్వర్కు సహకరిస్తోంది.
హైవేల నిర్మాణంలో రికార్డు స్థాయి వృద్ధి
జాతీయ రహదారుల నిర్మాణం వేగంలో కూడా భారత దేశం గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. 2013-14లో రోజుకి సుమారుగా 11.6 కి.మీ. నుంచి 2025 సంవత్సరంలో రోజుకి దాదాపు 34 కి.మీ.కు సగటు నిర్మాణ వేగం పెరిగింది.
కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, మెరుగైన ప్రాజెక్టు అమలు, క్రమబద్ధీకరించిన అనుమతుల యంత్రాంగాలు, సాంకేతికపరమైన ఆవిష్కరణ, విస్తరించిన సంస్థాగత సామర్థ్యాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుంది. నిర్మాణ వేగం పెరగడం వల్ల కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా రవాణా సదుపాయం బలోపేతమైంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (ఐఐఎంబీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల కర్మాగారాలకు అనుసంధానం మెరుగుపడి.. సగటు సరకు రవాణా వ్యయం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఫ్యాక్టరీకీ, సరఫరాదారుడికీ మధ్య, ఫ్యాక్టరీకీ, వినియోగదారునికీ మధ్య రవాణా ఖర్చులు తగ్గాయి.
ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వే: దూరప్రాంత అనుసంధానానికి సరికొత్త నిర్వచనం
భారత్ చేపడుతున్నఅత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వే ఒకటి. రూ. 1 లక్ష కోట్ల వరకు అంచనా వ్యయంతో సుమారుగా 1,386 కి.మీ. పొడవుతో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దేశంలోనే అత్యంత పొడవైన ప్రవేశ నియంత్రణ ఉన్న ఎక్స్ప్రెస్ మార్గంగా నిలవనుంది.
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలను ఈ ఎక్స్ప్రెస్ మార్గం అనుసంధానిస్తుంది. ఇది దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. 2023 ఫిబ్రవరి 12న ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వేలో మొదటిగా నిర్మాణం పూర్తి చేసుకున్న 246 కి.మీ. పొడవైన ఢిల్లీ-దౌసా-లాల్సౌట్ భాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. రాజస్థాన్లో విస్తరించిన ఈ భాగాన్ని రూ. 12,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. దీని తర్వాత 2024 ఫిబ్రవరి 22న గుజరాత్లో 87కి.మీ. పొడవుతో నిర్మించిన వడోదర-భరూచ్ భాగాన్ని ప్రారంభించారు. అనంతరం, గుజరాత్లోనే మరో రెండు అదనపు భాగాలైన 36 కి.మీ.ల కిమ్-ఈనా, 27.5 కి.మీ.ల పొడవైన గాందేవ-ఈనా సెక్షన్లను కూడా 2026 జూన్ 5న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందనీ, సరకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, ఈ కారిడార్లో పారిశ్రామిక వృద్ధినీ, పెట్టుబడులనూ, ఉద్యోగావకాశాలనూ పెంపొందిస్తుందనీ అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ మార్గం: ప్రాంతీయ అనుసంధాన పరివర్తన
ఢిల్లీ, మీరట్ మధ్య వేగవంతమైన, సురక్షితమైన, మరింత సమర్థమైన ప్రయాణాన్ని అందించడం ద్వారా జాతీయ రాజధాని ప్రాంతంలో రవాణా అనుసంధాన రూపురేఖలను ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే మార్చివేసింది. దాదాపు 82 కి.మీ. పొడవున్న ఈ రహదారిని రూ. 8,346 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రయాణీకులకూ, వ్యాపారులకూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని దశల వారీగా పూర్తి చేశారు. దీనిలోని వివిధ విభాగాలను 2018, 2021 మధ్య కాలంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రహదారి పశ్చిమ ఉత్తరప్రదేశ్, జాతీయ రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేస్తూ, రద్దీని తగ్గిస్తూ, ప్రాంతీయాభివృద్ధికి సహకరిస్తూ.. భారత దేశంలోనే అత్యంత విజయవంతమైన పట్టణ-ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంది.
ద్వారక ఎక్స్ప్రెస్ వే: పట్టణ ప్రాంత రవాణాలో సరికొత్త ప్రమాణం
జాతీయ రాజధాని ప్రాంతంలో పట్టణ రవాణా మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకమైన విజయంగా ద్వారక ఎక్స్ప్రెస్ వే నిలుస్తుంది. సుమారు రూ.9,000 కోట్ల వ్యయంతో దాదాపు 29 కి.మీ.ల మేర విస్తరించిన ఈ రహదారి ఢిల్లీ, గురుగ్రామ్ మధ్య అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.
ఈ ఎక్స్ప్రెస్ మార్గానికి సంబంధించిన హర్యానా విభాగాన్ని 2024 మార్చిలోనూ, ఢిల్లీ విభాగాన్ని 2025 ఆగస్టులోనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో కీలకమైన పట్టణ ప్రాంత రవాణా కారిడార్ పూర్తయింది. అధునాతన ఇంజినీరింగ్ పరిష్కారాలు, బహుళ స్థాయుల్లో ఇంటర్ ఛేంజ్లు, ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ ఎక్స్ప్రెస్ వే రద్దీని తగ్గిస్తుందనీ, ప్రయాణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందనీ, ఈ ప్రాంతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు.
బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్ వే: దక్షిణ భారతంలో వృద్ధి వేగం
దక్షిణ భారత దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రధానమైనదిగా బెంగళూరు-మైసూరు ప్రాజెక్టు ఆవిర్భవించింది. 118 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టును సుమారుగా రూ. 8,480 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని 2023 మార్చి 12న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపుగా మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించి రాకపోకలను, రహదారి భద్రతను, ప్రయాణ సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, పర్యాటకాన్ని పెంపొందించడం, కొత్త అవకాశాలను కల్పించడం ద్వారా దేశంలోనే అత్యంత నాణ్యమైన రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి నమూనాగా నిలుస్తోంది.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్: అనుసంధానం, సుస్థిరత, ప్రాంతీయ వృద్ధిలో పరివర్తన
అత్యంత వేగవంతమైన, సమర్థమైన, పర్యావరణం పట్ల బాధ్యతతో కూడిన జాతీయ రహదారుల వ్యవస్థను నిర్మించడంపై భారత్ సారిస్తున్న దృష్టిని ఇంజినీరింగ్ అద్భుతమైన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ప్రతిబింబిస్తుంది. రూ. 12,000 కోట్ల వ్యయంతో ఈ 213 కి.మీ.ల పొడవైన రహదారిని నిర్మించారు. ఆరు లేన్లతో కూడిన ఈ ప్రవేశ నియంత్రిత కారిడార్ను 2026 ఏప్రిల్ 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటల నుంచి 2.5 గంటల వరకు తగ్గించింది. ప్రయాణ దూరాన్ని 235 కి.మీ.ల నుచి 213 కి.మీ.లకు తగ్గించింది. తద్వారా ప్రయాణాలను వేగవంతంగా, ఇంధన వినియోగాన్ని తగ్గించి, సజావుగా సాగేలా చేసింది.
సుస్థిరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్కున్న ప్రధాన ఆకర్షణ. గణేష్పూర్, డెహ్రాడూన్ మధ్య ఉన్న 20 కి.మీ.ల మార్గం రాజాజీ నేషనల్ పార్కు, శివాలిక్ రిజర్వ్ అటవీ ప్రాంతం మధ్య ఉన్న పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల మీదుగా వెళుతుంది. ఈ జీవావరణ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆసియాలోనే అత్యంత పొడవైన ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్లలో ఒకటైన 12 కి.మీ. మార్గాన్ని, 'దాత్-కాళి' ఆలయం సమీపంలో 370 మీటర్ల సొరంగాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. అధునాతన ఇంజనీరింగ్ను పర్యావరణ సున్నితత్వంతో మేళవించి అనుసంధానాన్ని పునర్నిర్వచించడమే కాకుండా, సుస్థిర జాతీయ రహదారి అభివృద్ధికి నమూనాగా కూడా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది.
వికసిత్ భారత్ దార్శనికతను ముందుకు నడిపించడం
గత పన్నెండేళ్లుగా రోడ్డు, జాతీయ రహదారుల రంగంలో చోటు చేసుకున్న మార్పులు “ పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం” అనే స్ఫూర్తికి నిదర్శనం. కొనసాగుతున్న పెట్టుబడులు, విధానపరమైన సంస్కరణలు, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రవాణా అనుసంధానాన్ని భారత్ బలోపేతం చేసింది. ఆర్థిక అవకాశాలను విస్తరించి, లక్షలాది పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచింది.
భారత్మాల పరియోజన అమలు, జాతీయ రహదారుల విస్తరణ నుంచి రికార్డు స్థాయిలో నిర్మాణ వేగం, ప్రతిష్ఠాత్మక ఎక్స్ప్రెస్వేల అభివృద్ధి వరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు... మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధి, దేశ నిర్మాణం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా భారత్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు తరాలకు వృద్ధినీ, సంక్షేమాన్నీ, సమ్మిళిత వృద్ధినీ అందించే శక్తిమంతమైన ఇంజిన్గా ఆధునికమైన, సమర్థవంతమైన, పటిష్ఠమైన జాతీయ రహదారుల వ్యవస్థ కొనసాగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2272787)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5