ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం


నైస్‌ నగరంలోని విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రంలో సంయుక్తంగా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

प्रविष्टि तिथि: 14 JUN 2026 5:11PM by PIB Hyderabad

   ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా  వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాక్రాన్‌ పాల్గొన్నందుకు ప్రధానమంత్రి మోదీ తొలుత ధన్యవాదాలు తెలుపగా, హాజరైన వారినుద్దేశించి వారిద్దరూ ప్రసంగించారు. ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో భారత్, ఫ్రాన్స్ దృఢమైన భాగస్వామ్యంతో కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సౌర కూటమి వంటి ఇండో-ఫ్రెంచ్ కార్యక్రమాలతోపాటు కృత్రిమ మేధ (ఏఐ), ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపు దిశగా సంయుక్త కృషిని శ్రీ మోదీ విశేషంగా వివరించారు. ఈ సందర్భంగా భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల వార్షిక వేడుకలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ప్రపంచ శ్రేయస్సు లక్ష్యంతో ఉమ్మడి కృషి, సంకల్పం దిశగా ‘భారత్ ఇన్నొవేట్స్’ మరో కీలక మలుపని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్‌లో అంకుర విప్లవాన్ని గుర్తుచేస్తూ- ప్రస్తుత ప్రదర్శనలో డీప్-టెక్ పరిష్కారాలు ఆ విజయాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. దేశంలో గ్రామీణాభివృద్ధికి ఏఐ, ఉపగ్రహ సాంకేతికత ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు. అలాగే, సుస్థిర జీవనానికి ఆధునిక తయారీ రంగం, కాలుష్య రహిత అభివృద్ధి కోసం గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ సాంకేతికత దోహదం చేస్తున్న నేపథ్యంలో విద్యుత్‌ రవాణా రంగ పరిణామాత్మక సామర్థ్యం అపారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

నేటి డిజిటల్ యుగంలో కొనసాగుతున్న సాంకేతిక విప్లవం మానవాళికి కొత్త అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ‘భారత్ ఇన్నొవేట్స్’లో పాల్గొంటున్న ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు విశ్వసనీయ-సార్వజనీన, మానవ కేంద్రక సాంకేతికతలకు రూపుదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అంకుర సంస్థలను  కేవలం వాటి మార్కెట్ విలువ పరంగా కాకుండా మానవాళిపై వాటి ప్రభావం ప్రాతిపదికన అంచనా వేయాలని స్పష్టం చేశారు. ‘భారత్ ఇన్నొవేట్స్’ సందేశ సారాంశం ఇదేనంటూ- సరికొత్త ప్రపంచ ఆవిష్కరణల అధ్యాయానికి శ్రీకారం చుట్టే దిశగా భారత్‌తో భుజం కలిపి సాగాల్సిందిగా వారికి ఆహ్వానం పలికారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో కలసి ప్రదర్శనను తిలకించిన అనంతరం క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, ఆధునిక పదార్థ విజ్ఞానం, కాలుష్య రహిత ఇంధనం సహా అత్యాధునిక రంగాల అంకురాలు-ఆవిష్కర్తలతో వారిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు.

‘వికసిత భారత్’ దార్శనికతకు అనుగుణంగా భారత్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల కూడలిగా మార్చాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని, ప్రపంచ సాంకేతిక రంగ ప్రగతికి తోడ్పాటులో భారత్-ఫ్రాన్స్ సహకారం ప్రాధాన్యాన్ని ‘భారత్ ఇన్నొవేట్స్-2026’ స్పష్టం చేస్తోంది.

కింది లింకు ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం అందుబాటులో ఉంది.

***


(रिलीज़ आईडी: 2272784) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Odia , Tamil , Malayalam