వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
విలువను పెంచడం, సుస్థిరత, మార్కెట్ అవకాశాల విస్తృతిపై ప్రధానంగా చర్చ
దశాబ్ద కాలంలో సముద్ర ఉత్పత్తుల్లో 70 శాతం వృద్ధి.. 30 బిలియన్ డాలర్ల సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతి భారత్ లక్ష్యం: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
సముద్ర ఆహారోత్పత్తుల రంగంలో పీఎల్ఐ విధానం, నియంత్రిత శీతల రవాణా మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాలపై వర్క్ షాప్లో ప్రధానంగా చర్చ
प्रविष्टि तिथि:
09 JUN 2026 12:01PM by PIB Hyderabad
మత్స్యశాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంవోఎఫ్పీఐ)ల సహకారంతో.. కేంద్ర వాణిజ్యం - పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాణిజ్య విభాగం 2026 జూన్ 5-6 తేదీల్లో విశాఖపట్నంలో సముద్ర ఆహార ఎగుమతులపై రెండు రోజుల జాతీయ వర్క్షాప్ను నిర్వహించింది. సముద్ర ఆహారోత్పత్తుల విలువను పెంచడం, సుస్థిరత, మార్కెట్ అవకాశాలను విస్తరించుకోవడం, ఆవిష్కరణలు - మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా.. దేశ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతులను మరింత పెంచడంపై విస్తృత చర్చలకు ఈ సదస్సు వేదికగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య- పశుసంవర్ధక - పాడిపరిశ్రమ - పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సదస్సుద్దేశించి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ.. సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో అనుసరిస్తున్న ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని వివరించారు. గత దశాబ్ద కాలంలో భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు 70 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ సముద్ర ఆహార వాణిజ్యంలో భారత్ వాటా దాదాపు 4 శాతంగా ఉందన్నారు. విలువను పెంచే చర్యలు, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం, సుస్థిరత, ఎగుమతి మార్కెట్ల విస్తరణ ద్వారా.. వచ్చే అయిదేళ్లలో సముద్ర ఆహార ఎగుమతులను 30 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా సంబంధిత భాగస్వాములంతా సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
సముద్ర ఆహారోత్పత్తుల విలువను పెంచేలా.. నేరుగా తినేందుకు (రెడీ టు ఈట్), నేరుగా వండుకునేందుకు (రెడీ టు కుక్) వీలుగా ఉండే ఉత్పత్తుల వాటాను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అన్నారు. 38 దేశాలతో భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అత్యంత నాణ్యమైన, పర్యావరణ సుస్థిరత కలిగిన సముద్ర ఆహారోత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా భారత్ను ఒక నమ్మకమైన కేంద్రంగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందనీ, దేశ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతులకు రాష్ట్రం గణనీయమైన సహకారాన్ని అందిస్తోందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్రాండింగ్, భాగస్వాములందరి సమిష్టి కృషితో.. సుస్థిర ఆక్వాకల్చర్, సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
దేశ మత్స్య రంగంలో నమోదైన అసాధారణ వృద్ధిని శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ వివరించారు. దేశంలో చేపల ఉత్పత్తి 2012-13లో 95.8 లక్షల టన్నులుగా ఉండగా.. 2024-25 నాటికి దాదాపు 198 లక్షల టన్నులకు పెరిగిందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ దేశ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతులు దాదాపు రూ. 73,890 కోట్లకు (8.46 బిలియన్ డాలర్లు) చేరాయనీ, దేశీయ ఆహారోరత్పత్తుల ఎగుమతుల్లో ఘనీభవింపజేసిన రొయ్యలు (ఫ్రోజెన్ ష్రింప్) ప్రధాన ఉత్పత్తిగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఎగుమతులకు అనుకూలమైన మత్స్య రంగ మౌలిక సదుపాయాలు, చేపలున్న ప్రదేశాలను గుర్తించడం, సముద్ర ఆహారోత్పత్తుల విలువను పెంచడం, సుస్థిర ఆక్వాకల్చర్ను బలోపేతం చేయడం లక్ష్యంగా పీఎంఎంఎస్వై, పీఎంకేఎస్ఎస్వై 2.0 కింద ప్రభుత్వ కృషిని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
విలువైన సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుల్లో సమర్థమైన వస్తురవాణా, కార్గో మౌలిక సదుపాయాల ప్రాధాన్యాన్ని మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు వివరించారు. కార్గో మౌలిక సదుపాయాల బలోపేతం, వివిధ రకాల రవాణా వ్యవస్థల అనుసంధానాన్ని మెరుగుపరచడం, ఎగుమతుల్లో దేశం మరింత సమర్థంగా పోటీపడేలా తీర్చిదిద్దే దిశగా కార్గో రవాణాను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వ కృషిని ఆయన వివరించారు.
సముద్ర ఆహార రంగంలో ఉత్పత్తుల విలువను పెంచేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని శ్రీ చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రాసెసింగ్, బ్రాండింగ్, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మార్కెట్ విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘పరిమాణం నుంచి విలువ’ దిశగా, ‘ముడి సరుకుల ఉత్పత్తి నుంచి తుది ఉత్పత్తి’ని అందించే దిశగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు. తద్వారా ఆహారోత్పత్తుల నమ్మకమైన అంతర్జాతీయ సరఫరాదారుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయాలన్నారు.
మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష లిఖి మాట్లాడుతూ.. దేశ సముద్ర ఆహారోత్పత్తి వ్యవస్థను బలోపేతం చేసేందుకు భాగస్వామ్య పక్షాలన్నింటి మధ్య సమన్వయంతో కూడిన కృషి అత్యావశ్యకమన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ధ్రువీకరణ, ఆవిష్కరణ, ఉత్పత్తుల విలువను పెంచడం, ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా మార్కెట్ లభ్యతను మెరుగుపరచడం వంటి అంశాలు అత్యంత కీలకమైనవన్నారు.
కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతోపాటు.. ఎంపీఈడీఏ, ఈఐసీ, ఎన్ఎఫ్డీబీ, నాబార్డ్, ఎన్సీడీసీ, ఎన్సీఈఎల్, ఎస్ఎఫ్ఏసీ వంటి కీలక సంస్థల ప్రతినిధులను ఈ సదస్సులో ఒకే వేదికపైకి తెచ్చింది. వీరితోపాటు సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతిదారులు, ప్రాసెసర్లు, పారిశ్రామిక సంఘాలు, అంకుర సంస్థలు, పరిశోధకులు, ఆక్వాకల్చర్ రైతులు, సముద్ర ఆహారోత్పత్తులకు సంబంధించి ప్రతి దశకూ చెందిన ఇతర క్షేత్రస్థాయి భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎంకేఎస్ఎస్వై), కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ), ఇతర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలను కూడా ఈ కార్యక్రమంలో అందించారు.
మత్స్య రంగానికి సంబంధించి ప్రతీదశలో ఎదురవుతున్న పలు కీలక సవాళ్లపై ముఖాముఖిలో భాగంగా చర్చించారు. వ్యాధి నివారణ చర్యలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, చేపల మేత లభ్యత, నాణ్యమైన విత్తనాలు, సంతానోత్పత్తి రకాల లభ్యత, క్వారంటైన్ మౌలిక సదుపాయాలు, రవాణా, నియంత్రిత శీతల రవాణా వ్యవస్థ (కోల్డ్ చైన్) అభివృద్ధి, ధ్రువీకరణ నిబంధనలు, చేపలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించడం, సుస్థిరతా ప్రమాణాల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. వీటితోపాటు ఉత్పత్తుల విలువను పెంచడం, ఎగుమతి మార్కెట్ల విస్తరణ, అంకుర సంస్థలూ, ఎంఎస్ఎంఈలకు చేయూత, సుస్థిర చేపల పెంపకం పద్ధతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రతినిధులు ప్రముఖంగా ప్రస్తావించారు.
చేపలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించే (ట్రేసబిలిటీ) పద్ధతులు, సుస్థిరతా ధ్రువీకరణ, ఉత్పత్తుల విలువను పెంచడం, ఎగుమతులకు ప్రోత్సాహం, డీప్ సీ ఫిషరీస్, ఎగుమతి అవకాశాల విసస్తరణ, సముద్ర ఆహార రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) విధానం అమలుకు అవకాశాలపై వరుసగా సాంకేతిక సదస్సులను ఈ రెండు రోజుల వర్క్షాప్లో భాగంగా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడాన్ని బలోపేతం చేయడం, ప్రాసెసింగ్ - కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంకుర సంస్థలూ, ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వడం, దేశ సముద్ర ఆహారోత్పత్తులకు మార్కెట్ లభ్యతను మెరుగుపరచడం వంటి అంశాలపై నిపుణులు, భాగస్వాములు చర్చించారు.
దేశ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వినియోగించుకోని అగాధ సముద్ర వనరుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై కూడా ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా అండమాన్ - నికోబార్ దీవులు, లక్షద్వీప్లలోని వనరుల వినియోగంతోపాటు.. సముద్ర శైవలాలు, ఆర్నమెంటల్ ఫిషరీస్, కోల్డ్ వాటర్ ఫిషరీస్, జెల్ల చేపల పెంపకం వంటి వర్ధమాన రంగాలపైనా ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.
సముద్ర ఆహారోత్పత్తుల రంగంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ.. పర్యావరణ సుస్థిరత, ఉత్పత్తి మూలాల గుర్తింపు, విలువ పెంపు, ఎగుమతి మౌలిక సదుపాయాలు, మార్కెట్ అవకాశాలను మరింత బలోపేతం చేయాలన్న భాగస్వామ్య పక్షాల సమష్టి సంకల్పంతో ఈ సదస్సు ముగిసింది. సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతిలో అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని మరింత పురోగమింపజేసే దిశగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ఈ చర్చల్లో చేసిన సిఫార్సులు ఎంతగానో దోహదపడతాయి.
***
(रिलीज़ आईडी: 2270962)
आगंतुक पटल : 10