రైల్వే మంత్రిత్వ శాఖ
బెంగళూరు-తుంకూరు సెక్షన్లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వ్యవస్థ ఆధునికీకరణకు ఆమోదం తెలిపిన భారతీయ రైల్వే
प्रविष्टि तिथि:
08 JUN 2026 6:13PM by PIB Hyderabad
కర్ణాటకలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే కారిడార్లలో ఒకటైన బెంగళూరు-తుంకూరు మార్గంలో రైళ్ల నిర్వహణ సామర్థ్యం, వేగాన్ని మరింత పెంచేందుకు భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నైరుతి రైల్వే పరిధిలోని ఈ సెక్షన్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ ఆధునికీకరణకు రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న 1x25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను అత్యాధునిక 2x25 కేవీ వ్యవస్థగా మార్చనున్నారు. మొత్తం 120 ట్రాక్ కిలోమీటర్ల మేర ఈ ఆధునికీకరణ పనులు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ రూ. 162.57 కోట్ల నిధులను కేటాయించింది.
వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన 'హైలీ యుటిలైజ్డ్ నెట్వర్క్ (హెచ్యూఎన్) రూట్-10'లో బెంగళూరు-తుంకూరు సెక్షన్ ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఈ మార్గం పుణే-హుబ్బళ్ళి-చిక్కజాజూరు-బీరూర్-తుంకూరు-బెంగళూరు-సేలం-కన్యాకుమారి కారిడార్ వెంబడి ఉన్న ప్రధాన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలను అనుసంధానిస్తుంది.
ఇక్కడ 2x25 కేవీ ట్రాక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల రైళ్ల రాకపోకలకు సంబంధించిన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు మరింత పటిష్ఠం అవుతాయి. దీనివల్ల ఈ మార్గంలో భారీ రైళ్ల రద్దీని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ ఆధునికీకరించిన వ్యవస్థ ద్వారా భారీ గూడ్స్ రైళ్లను, ఎక్కువ కోచ్లు కలిగిన ప్రయాణికుల రైళ్లను సులభంగా నడపవచ్చని భావిస్తున్నారు. విద్యుత్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాల విశ్వసనీయత కూడా దీనితో మరింత మెరుగుపడుతుంది.
బెంగళూరు మహానగర ప్రాంతంతో పాటు దాని పరిసర జిల్లాలకు సేవలందిస్తున్న ఒక ముఖ్యమైన రైల్వే మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. దీనితో పాటు కర్ణాటక, దక్షిణ భారతదేశం అంతటా ప్రయాణికుల, గూడ్స్ రైళ్ల రాకపోకలు మరింత సాఫీగా సాగడానికి ఇది తోడ్పడుతుంది. అత్యధిక రద్దీ ఉండే కారిడార్లలో విద్యుత్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం, రైళ్ల నిర్వహణ పనితీరును మెరుగుపరచడం కోసం భారతీయ రైల్వే నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగానే ఈ పనులు చేపడుతున్నారు.
***
(रिलीज़ आईडी: 2270594)
आगंतुक पटल : 16