లోక్సభ సచివాలయం
వికసిత్ భారత్ 2047కు ప్రజా భాగస్వామ్యం, ఔత్సాహిక పారిశ్రామికరంగం, ఆవిష్కరణే ప్రధానం: లోక్సభ స్పీకర్
అభివృద్ధి చెందిన దేశం దిశగా భారత్ను ముందుకు నడిపించాలని యువతకు పిలుపునిచ్చిన లోక్సభ స్పీకర్
మహేశ్వరి సమాజానికున్న సేవాభావం, నైతిక విలువలు, వ్యాపార స్ఫూర్తి దేశ నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి: లోక్సభ స్పీకర్
ఔత్సాహిక పారిశ్రామిక రంగం, జాతి నిర్మాణం కలసికట్టుగా అభివృద్ధి చెందాలని స్పష్టం చేసిన స్పీకర్
‘‘మహేశ్వరీస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ వికసిత్ భారత్ 2047’’ కార్యక్రమంలో ప్రసంగించిన లోక్సభ స్పీకర్
प्रविष्टि तिथि:
07 JUN 2026 9:33PM by PIB Hyderabad
ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, సమష్టి సంకల్పంతోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం ప్రకాశ్ బిర్లా ఈ రోజు స్పష్టం చేశారు. ‘మహేశ్వరీస్ అండ్ మేకింగ్ ఆఫ్ వికసిత్ భారత్ 2047’ పేరుతో న్యూఢిల్లీలోని మహేశ్వరి సమాజం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగం, జాతి నిర్మాణం కలసి పురోగతి సాధించాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ చేస్తున్న ప్రయాణం సమ్మిళిత వృద్ధి, సామాజిక బాధ్యత, క్రియాశీల పౌర భాగస్వామ్యం ద్వారా సాగాలని చెప్పారు.
భారత ఆర్థిక, సామాజిక రంగంలో ఓ చైతన్యవంతమైన శక్తిగా మహేశ్వరి సమాజాన్ని శ్రీ బిర్లా వర్ణించారు. సేవ, నైతిక విలువలతో కూడిన వ్యాపార పద్ధతులు, దాతృత్వం, సామాజిక బాధ్యత ద్వారా దేశ నిర్మాణానికి వారు చేసిన అమూల్యమైన కృషిని ప్రశంసించారు. విద్య, వైద్యం, ప్రజాసేవ కోసం వివిధ ప్రాంతాల్లో సంస్థలను స్థాపించడం, వాటిని నిర్వహించడం ద్వారా సామాజిక సంక్షేమం కోసం ఈ సమాజం నిరంతరం ప్రయత్నిస్తోందని ఆయన తెలియజేశారు.
పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వాన్ని, వ్యాపార దక్షతను మహేశ్వరి సమాజం ప్రదర్శిస్తూ.. ప్రాంతీయ ఆర్థిక పరివర్తనలను ముందుకు నడిపించిందని లోక్ సభ స్పీకర్ అన్నారు. మెట్రోపాలిటన్ కేంద్రాలైనా, ఈశాన్య ప్రాంతమైనా లేదా దక్షిణ భారతమైనా.. ఈ సమాజానికి చెందిన వారు అవకాశాలను సృష్టించారు. ఉపాధిని కల్పించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశారు. నిజాయతీ, నైతిక విలువలు, సామాజిక సామరస్యం పట్ల ఉన్న నిబద్ధతతో ఈ సమాజం.. వ్యాపార ప్రపంచంలో మార్గదర్శక ప్రమాణాలను నెలకొల్పింది.
సంపదను సృష్టించడం ఒక్కటే విజయానికి నిజమైన కొలమానం కాదనీ, విలువ, సానుకూల సామాజిక మార్పును తీసుకురావడమేనని శ్రీ బిర్లా చెప్పారు. శ్రీ ఆనంద్ రాఠీ సాధించిన పారిశ్రామిక విజయాలను ప్రశంసించారు. ఆయన మార్గదర్శక ప్రయాణం అనేక తరాల పాటు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలియజేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి చేసిన సేవలను కూడా ఆయన ప్రశంసించారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ, న్యాయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలోనూ ఆయన చేసిన కృషి.. కీలక పాత్రను పోషించిందని తెలియజేశారు. ఇలాంటి విశిష్ట వ్యక్తులు సమాజంలోని ఉత్కృష్టత, నాయకత్వం, ప్రజాసేవ అనే గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తారని వివరించారు.
భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పోషించే పాత్రను శ్రీ బిర్లా వివరించారు. వికసిత్ భారత్ - 2047 లక్ష్యానికి విద్యావంతులైన, నైపుణ్యాలున్న, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతే అతి పెద్ద బలం అని ఆయన అన్నారు. ప్రపంచ అగ్రగామిగా భారత్ను నిలబెట్టేందుకు ఆవిష్కరణలనూ, కృత్రిమ మేధనూ, నూతనంగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలనూ యువత స్వీకరించాలని ఆయన కోరారు. రాబోయే యుగం విజ్ఞానం, ఆవిష్కరణలతోనే ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. ఉద్యోగాలను అన్వేషించేవారిగా కాకుండా.. ఉద్యోగాలను కల్పించేవారిగా యువత మారాలని పిలుపునిచ్చారు.
గత దశాబ్దంలో భారత్ సాధించిన పురోగతి దేశ స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సమష్టి సంకల్పాన్ని ప్రదర్శించిందనీ స్పీకర్ చెప్పారు. హక్కులను బాధ్యతలతో సమతుల్యం చేసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని కొనసాగించడానికి బాధ్యతాయుతమైన పౌరసత్వం, వ్యవస్థల పట్ల గౌరవం, ప్రజాజీవితంలో చురుకైన భాగస్వామ్యం అవసరమని స్పీకర్ స్పష్టం చేశారు. పార్లమెంటు, ప్రజాస్వామ్య సంస్థల ద్వారా చేపట్టిన శాసన సంస్కరణలు పారదర్శకతను గణనీయమైన రీతిలో పెంచాయనీ, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచాయనీ ఆయన తెలియజేశారు.
ఐక్యతా స్ఫూర్తి, సేవ, వ్యాపారం, ‘దేశమే ముందు’ అనే సూత్రం ద్వారా వికసిత్ భారత్ - 2047 లక్ష్యాన్ని దేశం సాధించగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శ్రీ బిర్లా తన ప్రసంగాన్ని ముగించారు. ఆవిష్కరణలు, నైతిక విలువలతో కూడిన నాయకత్వం, సామాజిక నిబద్ధత ద్వారా దేశాభివృద్ధికి దోహదపడాలని మహేశ్వరి సమాజానికి ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ప్రగతిలో ప్రతి పౌరుడూ చురుగ్గా పాల్గొన్నప్పుడే, సామాజిక బాధ్యత, సామూహిక సంక్షేమంతో కలసి ఆర్థిక వృద్ధి కలసి నడిచినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ నిర్మితమవుతుందని శ్రీ బిర్లా స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2270207)
आगंतुक पटल : 33