రక్షణ మంత్రిత్వ శాఖ
కసౌలి అడవుల్లో కార్చిచ్చు... రేయింబవళ్లు శ్రమించి మంటలను అదుపు చేసిన భారత వైమానిక దళం
నాడు పోస్టు చేయడమైనది:
30 MAY 2026 1:27PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్లోని కసౌలి సమీప అడవిలో భారీ స్థాయిలో మంటలు చెలరేగినట్లు మే 26న భారత వైమానిక దళానికి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఆ దళం, పరిస్థితిని అంచనా వేసేందుకు ముందుగా చీతా హెలికాప్టర్ను పంపింది. ఆ తర్వాత సివిల్ అధికారుల సహాయక వ్యవస్థ కింద కసౌలి ప్రాంతంలోని మంటలను అదుపు చేయడానికి మధ్యస్థాయి ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లను విజయవంతంగా మోహరించింది.
సోలన్ జిల్లాలోని కసౌలి బీట్ పరిధిలో దాదాపు 10 హెక్టార్ల పరిధిలో ఈ భీకరమైన మంటలు వ్యాపించాయి. ఇవి అక్కడి నివాస ప్రాంతాలకు, కీలకమైన పౌర మౌలిక సదుపాయాలకు, సైనిక స్థావరాలకు తీవ్ర ముప్పుగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ, భారత సైన్యం, స్థానిక అధికారులతో కలిసి వైమానిక దళం పూర్తి సమన్వయంతో పనిచేసింది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు ఏఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా నిరంతరాయంగా బాంబి బకెట్ ఆపరేషన్లను నిర్వహించాయి. ఇందుకోసం చండీగఢ్లోని సుఖ్నా సరస్సు నుంచి నీటిని సేకరించారు. ప్రతీసారి హెలికాప్టర్ వెళ్లినప్పుడు సుమారు 2,000 నుంచి 2,500 లీటర్ల నీటిని మోసుకెళ్లి మంటలపై చల్లింది.
ఈ ఆపరేషన్ ద్వారా రాత్రి, పగలు తేడా లేకుండా అవిశ్రాంతంగా వైమానిక అగ్నిప్రమాద ప్రయత్నాలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతంపై మొత్తం 93,000 లీటర్లకు పైగా నీటిని మంటలపై కురిపించి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. వైమానిక దళం అత్యంత వేగంగా స్పందించి, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ సాగించిన ఈ పోరాటం వల్ల అడవి మంటలు మరింతగా వ్యాపించకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషించింది.
భారత వైమానిక దళ చరిత్రలోనే అత్యంత మొదటిసారిగా నైట్ విజన్ గాగుల్స్ (చీకట్లో వినియోగించే ప్రత్యేక కళ్లజోళ్లు) సహాయంతో రాత్రి వేళల్లో కూడా ఈ బాంబి బకెట్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతాలలో, సరిగా దారి కనిపించని క్లిష్ట పరిస్థితుల్లో సాగిన ఈ రాత్రి మిషన్లకు పైలట్ల అసాధారణ విమానయాన నైపుణ్యం, కచ్చితత్వం, కార్యాచరణ నైపుణ్యం ఎంతో తోడ్పడ్డాయి. రాత్రి వేళల్లో మంటలను ఆర్పడంలో అనేక ప్రమాదాలు, సవాళ్లు ఉన్నప్పటికీ.. విమాన సిబ్బంది వృత్తిపరమైన నిబద్ధత, అచంచలమైన ధైర్యం, అంకితభావం కారణంగా ఈ మిషన్లు ఎంతో సురక్షితంగా, సమర్థవంతంగా ముగిశాయి.
ఆకాశంలో సాగుతున్న ఈ ఆపరేషన్లకు సమాంతరంగా.. కింద భూమిపై ఉన్న గ్రౌండ్ సిబ్బంది కూడా అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ అలసిపోకుండా శ్రమించారు. హెలికాప్టర్లు ల్యాండ్ అయిన వెంటనే వాటికి వేగంగా సర్వీసింగ్ చేయడం, ఇంధనం నింపడం వంటి పనులను క్షణాల మీద పూర్తి చేశారు. తద్వారా 24 గంటలూ ఎటువంటి ఆటంకం లేకుండా ఈ అగ్నిమాపక ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగడంలో కీలక పాత్ర పోషించారు.
***
(రిలీజ్ ఐడి: 2267170)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15