ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

సార్థక్-పీడీఎస్ అనే ప్రధాన పథకం కింద ఉన్న రెండు ఉప పథకాలు.. (i) ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద అంతర్గత ఆహార ధాన్యాల రవాణా- ఎఫ్‌పీఎస్ డీలర్ల మార్జిన్ కోసం రాష్ట్ర సంస్థలకు సహాయం’ (ii) ‘ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునికీకరణ- సంస్కరణల పథకాలను (స్మార్ట్ పీడీఎస్)’ విలీనం చేసి కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్


సార్థక్ పీడీఎస్ కోసం రాబోయే 5 సంవత్సరాలలో రూ. 25,530 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం

ఎఫ్‌పీఎస్ డీలర్లకు అధిక కమీషన్‌తో పాటు ఆహార ధాన్యాలు చిట్టచివరి లబ్ధిదారునికి చేరటాన్ని నిర్ధారించడానికి ఈ పథకాలను కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం

పీడీఎస్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత, సుస్థిరతను పెంపొందించడానికి అధునాతన సాంకేతికతల ద్వారా పీడీఎస్ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తోన్న ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 2:53PM by PIB Hyderabad

‘సార్థక్ పీడీఎస్‍’ను (స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్-ఇన్‌కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్) ఒక ప్రధాన పథకంగా (అంబ్రెల్లా స్కీమ్) కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం అవార్డు కాలంలో రూ. 25,530 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతర్గత (ఇంట్రా-స్టేట్) ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, ఎఫ్‌పీఎస్ డీలర్ల మార్జిన్ కోసం అయ్యే ఖర్చులను భరించడానికి కేంద్ర సహాయక నిబంధనలను సవరించాలని, కేంద్ర సహాయం విషయంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. 

జాతీయ ఆహార భద్రతా చట్టం- 2013 (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలును మరింతగా మెరుగుపరిచేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న రెండు పథకాలైన (i) ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద అంతర్గతఆహార ధాన్యాల రవాణా, ఎఫ్‌పీఎస్ డీలర్ల మార్జిన్ విషయంలో రాష్ట్ర సంస్థలకు సహాయం’ (ii) ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునికీకరణ, సంస్కరణల పథకం (స్మార్ట్ పీడీఎస్)’లను విలీనం చేస్తూ ఈ ప్రధాన పథకాన్ని రూపొందించారు. 

సార్థక్-పీడీఎస్ పథకం ఈ లక్ష్యాలతో పని చేస్తుంది... (ఎ) అంతర్గత (ఇంట్రా-స్టేట్) రేషన్ రవాణా- నిర్వహణ, ఎఫ్‌పీఎస్ డీలర్ల మార్జిన్ విషయంలో తప్పనిసరి ఆర్థిక సహాయం, (బి) ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఆహార భద్రత పట్ల దేశ నిబద్ధతను బలోపేతం చేస్తూ లీకేజీలను తగ్గించి చివరి లబ్ధిదారునికి సేవలు అందేలా చూసే ఒక ఏకీకృత, పౌర-కేంద్రీకృత, ఇంటెలిజెంట్, పరస్పర అనుసంధాన (ఇంటర్‌ఆపరబుల్) పీడీఎస్ వ్యవస్థను తయారు చేయాలనేవి ఆ లక్ష్యాలు. ఈ పథకం 31.03.2031 వరకు అమలులో ఉంటుంది. 

పీడీఎస్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత, సుస్థిరత ఉండేలా చూసుకునేందుకు కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ), బ్లాక్‌చైన్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా పీడీఎస్ వ్యవస్థను ఆధునికీకరించడానికి, సమగ్రంగా మార్చేందుకు, మెరుగ్గా చేసేందుకు సార్థక్-పీడీఎస్ పథకం పనిచేస్తుంది. ఇందులో భాగంగా నిజసమయ పర్యవేక్షణ కోసం ప్రామాణికమైన ఆర్కిటెక్చర్, ఏకీకృత డేటాబేస్‌ల సృష్టి, ఏఐ ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం, విశ్లేషణా వ్యవస్థలు, డేటా ఆధారిత పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఐఎస్ఓ ధ్రువీకృత ప్రక్రియ ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటు చేయనున్నారు.

తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించటం ద్వారా ఆహార, పోషకాహార భద్రతను నిర్ధారిస్తూ దేశ ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేలా చూసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సామాజిక, చట్టపరమైన బాధ్యత ఉంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఉన్న 81.35 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుంది. చట్టబద్ధమైన, విధానపరమైన ఫ్రేమ్‌వర్క్‌ ఆధారంగా రూపొందించిన సార్థక్-పీడీఎస్.. ఆర్థిక సహాయక విభాగాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే దానిని ఆధునిక- సాంకేతిక ఆధారిత పీడీఎస్ వ్యవస్థతో అనుసంధానిస్తుంది.

టీపీడీఎస్‌ను అన్ని రకాలుగా (ఎండ్-టు-ఎండ్) కంప్యూటరైజేషన్ చేయటం, ఐఎం- పీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పీడీఎస్), స్మార్ట్ పీడీఎస్ వంటి బహుళ డిజిటలైజేషన్ కార్యక్రమాలను ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో అమలు చేసింది. వీటితో పాటు మేరా రేషన్, అన్న మిత్ర, రైట్‌ఫుల్ టార్గెటింగ్ డ్యాష్‌బోర్డ్, అన్న సహాయత వంటి పౌర-కేంద్రీకృత అప్లికేషన్లను తీసుకొచ్చింది. 2023 ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్ పీడీఎస్ పథకం సాంకేతికత ఆధారిత సంస్కరణలకు పునాదిగా నిలిచింది. ఇది 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం (సీడింగ్), ఈ-పోస్ ద్వారా ఎఫ్‌పీఎస్ ఆటోమేషన్, ఆన్‌లైన్ కేటాయింపులు, కంప్యూటరీకరించిన సరఫరా గొలుసు నిర్వహణను సుసాధ్యం చేసింది.

***


(రిలీజ్ ఐడి: 2265869) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam