వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆసియా ఉత్పాదకత సంస్థ పాలక మండలి 68వ సమావేశం న్యూఢిల్లీలో ముగింపు
విజన్-2030 కార్యాచరణ ప్రణాళిక, సంస్థాగత పనితీరు కొలమానాలను సమీక్షించిన ఏపీఓ పాలక మండలి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAY 2026 12:02PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత మండపంలో మే 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు సాగిన ఆసియా ఉత్పాదక సంస్థ (ఏపీఓ) పాలక మండలి 68వ సమావేశం ముగిసింది. విస్తృత చర్చలు, వ్యూహాత్మక ఆలోచనలు, ఉన్నత స్థాయి సమావేశాలతో విజయవంతంగా పూర్తయింది.
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో జాతీయ ఉత్పాదకత మండలి (ఎన్పీసీ) ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్పాదకత సంస్థల (ఎన్పీఓల) అధిపతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విధాన నిర్ణేతలు, ఉత్పాదకత రంగానికి చెందిన నిపుణులు ఏపీఓ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సభ్యదేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని, సమన్వయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 20 మే 2026న సన్నాహక, రహస్య సమావేశాలతో ఈ మూడు రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నెట్వర్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
21, 22 మే 2026 తేదీల్లో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ఏపీఓ భవిష్యత్తు దిశానిర్దేశం, పాలన, వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సంబంధించిన పలు ముఖ్యమైన అజెండా అంశాలపై చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో సెక్రటరీ జనరల్ వార్షిక నివేదిక ఆమోదం, ఆర్థిక సంవత్సరం-2025 నివేదిక, ఆడిటర్ల నియామకం-2026, ఏపీఓ విజన్-2030 స్టీరింగ్ కమిటీ సిఫార్సులు, 2027-28 ద్వైవార్షిక కాలానికి సంబంధించిన ఏపీఓ ప్రాథమిక బడ్జెట్, పాలనా సంస్కరణలు, ప్రాంతీయ ఉత్పాదకత కార్యక్రమాల పురోగతి నివేదికలు, సంస్థాగత పనితీరును, నిబంధనల అమలును బలోపేతం చేయటం వంటి అంశాలున్నాయి.
మే 21, 2026న జరిగిన ప్రారంభ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గౌరవ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశ ఉత్పాదకత ఆధారిత వృద్ధి, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ, రవాణా సంస్కరణలు, ఎంఎస్ఎంఈల సాధికారత, సుస్థిర చర్యలు, ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ పాలక మండలి సమావేశం ముఖ్యమైన నాయకత్వ మార్పులకు కూడా వేదికగా నిలిచింది. 2026-27 సంవత్సరానికి గానూ ఏపీఓ చైర్మన్గా.. ఇండోనేషియా ఏపీఓ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్వర్ సనూసి బాధ్యతలు చేపట్టారు. భారతదేశ ఏపీఓ డైరెక్టర్, భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి శ్రీ అమర్దీప్ సింగ్ భాటియా నుంచి ప్రొఫెసర్ అన్వర్ సనూసి ఈ బాధ్యతలను స్వీకరించారు. ఇరాన్, జపాన్ దేశాల తాత్కాలిక ఏపీఓ డైరెక్టర్లు వరుసగా మొదటి, రెండో వైస్ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు.
ఉత్పాదకత పెంపుదల, సంస్థాగత నైపుణ్యానికి అందించిన విశేష కృషికి గుర్తింపుగా.. ఉత్పాదకత అడ్వకేట్లు, సాంకేతిక నిపుణుల కోసం ఏపీఓ అవార్డులు, ఎన్పీసీ ప్రత్యేక గుర్తింపు అవార్డుల ప్రధానోత్సవం ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణ.
ఏపీఓ సభ్య దేశాల్లో ఉత్పాదకత నిపుణుల ధ్రువీకరణ సంస్థలను అంచనా వేసేందుకు, వాటికి గుర్తింపు ఇచ్చేందుకు ఏపీఓ అక్రిడిటేషన్ సంస్థ (ఏపీఓ-ఏబీ)ని ఆసియా ఉత్పాదకత సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు భారత్తో సహా 13 ఏపీఓ సభ్య దేశాలు ఈ గుర్తింపును పొందాయి. ఈ కార్యక్రమం సందర్భంగా కంబోడియా జాతీయ ఉత్పాదకత సంస్థ ధ్రువీకరణ విభాగానికి ఏపీఓ-ఏబీ అక్రిడిటేషన్ పత్రాన్ని అందజేశారు.
పాలక మండలి సమావేశంలో ఏపీఓ విజన్-2030 లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు, డిజిటల్ పరివర్తన, సుస్థిరాభివృద్ధి, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపుదల, ఉత్పాదకత ఆధారిత వృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు సభ్యదేశాలు ఉమ్మడి నిబద్ధతను స్పష్టం చేశాయి.
మే 22, 2026న జరిగిన ముగింపు సమావేశంలో ఏపీఓ అధ్యక్షుడు ప్రసంగించారు. ఆ తర్వాత భారతదేశ ప్రత్యామ్నాయ డైరెక్టర్ శ్రీమతి నీర్జా శేఖర్ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం 2027లో 69వ జీబీఎం సమావేశానికి లావో పీడీఆర్ ఆతిథ్యం ఇవ్వనుందని, ఏపీఓ దేశాల అధిపతుల 67వ కార్యశాల సమ్మిట్ మీటింగ్ (ఎస్ఎం) 2027లో శ్రీలంకలో జరగనున్నట్లు ప్రకటించారు.
"ఇతర అంశాలు" శీర్షికన విజన్-2030లో భాగమైన జీఏఐఏ (జెన్యూన్ ఏఐ యాక్షన్) కార్యక్రమం గురించి సభ్య దేశాలకు ఏపీఓ తెలియజేసింది. ఇందులో ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపుదల, శిక్షణ వ్యవస్థల ఆధునీకరణపై ప్రత్యేకంగా చెప్పారు. ఆ తర్వాత రెండో ఉపాధ్యక్ష దేశమైన జపాన్ సమర్పించిన కార్యకలాపాల నివేదిక (మొదటి, రెండో రోజు)ను ఆమోదించారు. అనంతరం ఏపీఓ చైర్మన్ ప్రసంగంతో ఈ సమావేశం ముగిసింది.
అనంతరం ఢిల్లీలోని ప్రముఖ వారసత్వ ప్రదేశాలైన జాతీయ మ్యూజియం, హుమాయూన్ సమాధి, ఇండియా గేట్-సెంట్రల్ విస్టా సెరిమోనియల్ అవెన్యూ, ది లైట్ అండ్ ది లోటస్: బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రతినిధులు సందర్శించారు. ఈ ప్రదర్శనలో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలతో పాటు భారతదేశ బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే శిల్పాలు, ప్రాచీన గ్రంథాలు, కళాఖండాలను పొందుపరిచారు. న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన.. భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నాగరికత వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పింది. భారతదేశ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని స్వయంగా వీక్షించే అవకాశం లభించినందుకు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఆసియా ఉత్పాదకత సంస్థ 68వ పాలక మండలి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించటం ద్వారా.. ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా ఉత్పాదకతను పెంపొందించేందుకు, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయటానికి, సుస్థిర సామాజిక-ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు భారత్ నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది.
****
(రిలీజ్ ఐడి: 2264554)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14