మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో భారత్ ఇన్నోవేట్స్- ఇన్వెస్టర్ షోకేస్ కార్యక్రమం
ప్రముఖ భారతీయ, ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఆవిష్కరణలను ప్రదర్శించిన 24 డీప్ టెక్ అంకుర సంస్థలు
భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల ఏడాదిలో భాగంగా 2026 జూన్ 14-16 తేదీల్లో ఫ్రాన్స్లోని నీస్లో జరగననున్న భారత్ ఇన్నోవేట్స్ 2026 కోసం సన్నాహక కార్యక్రమం
పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని మరింత బలపరిచిన ఇన్వెస్టర్ షోకేస్
నాడు పోస్టు చేయడమైనది:
21 MAY 2026 1:57PM by PIB Hyderabad
ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) భాగస్వామ్యంతో 2026 మే 19న బెంగళూరులో భారత్ ఇన్నోవేట్స్ ఇన్వెస్టర్ షోకేస్ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ ప్రదర్శనలో ప్రముఖ పెట్టుబడిదారుల కమిటీ ఎంపిక చేసిన అధిక సామర్థ్యం కలిగిన 24 భారతీయ డీప్ టెక్ అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. భారత్కు చెందిన ప్రతిష్టాత్మకమైన ప్రారంభ, అభివృద్ధి దశల పెట్టుబడిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఫ్రాన్స్లోని నీస్ నగరంలో త్వరలో జరగబోయే భారత్ ఇన్నోవేట్స్ - 2026 ప్రధాన సమావేశానికి సన్నాహక కార్యక్రమంగా నిలిచింది.
రోజంతా సాగిన ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 85 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్న 90 మందికి పైగా ప్రముఖ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఇందులో పీక్ ఎక్స్వై పార్ట్నర్స్, యాక్సెల్, బెస్సెమర్ వెంచర్ పార్ట్నర్స్, బెర్టెల్స్మన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్, అవానా క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, కలారీ క్యాపిటల్, చిరాతే వెంచర్స్, 360 వన్ అసెట్, అవెండస్ క్యాపిటల్, బి క్యాపిటల్, ఆవిష్కార్ క్యాపిటల్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఓమ్నివోర్ వంటి అగ్రగామి సంస్థలు పాల్గొన్నాయి.
ప్రారంభ సమావేశంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి సౌమ్య గుప్తా మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా 2026 ఫిబ్రవరి 17న ఫ్రాన్స్ అధ్యక్షుడి సమక్షంలో భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారత్ ఇన్నోవేట్స్’ను ఆమె గుర్తుచేశారు. భారత్కు చెందిన డీప్ టెక్ వ్యవస్థాపకులు తమ అంకుర సంస్థలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో తోడ్పడే దీర్ఘకాలిక పెట్టుబడిదారులతో, భాగస్వాములతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇటువంటి వ్యవస్థీకృత వేదికలను కల్పించడానికి విద్యా మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందనడానికి ఈ బెంగళూరు ప్రదర్శన నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
అనంతరం భారత్ ఇన్నోవేట్స్ 2026 కీలక సలహా మండలి సభ్యులైన యాక్సెల్ భాగస్వామి శ్రీ ప్రశాంత్ ప్రకాష్, పీక్ ఎక్స్వీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజన్ ఆనందన్, అవెండస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ గౌరవ్ దీపక్లు ఈ కార్యక్రమ నేపథ్యాన్ని వివరించారు. పరిశోధనల ఆధారంగా పనిచేసే భారతీయ డీప్ టెక్ అంకుర సంస్థలను అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహంలో అగ్రస్థానంలో నిలపడం.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ రంగానికి మధ్య ఒక బలమైన వంతెనను నిర్మించడమే ఈ కార్యక్రమ వ్యూహాత్మక లక్ష్యమని వారు చెప్పారు.
దేశీయ అధునాతన డీప్-టెక్ ఆవిష్కరణల విస్తృతిని ఈ ప్రదర్శనలో పాల్గొన్న 24 అంకుర సంస్థలు చాటిచెప్పాయి. వీటిలో అంతరిక్ష, ప్రయోగ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ విమానయానం, అంతరిక్షం, రక్షణ, ప్రొపల్షన్, సెమీకండక్టర్లు, 5జీ, 6జీ, క్వాంటం కంప్యూటింగ్, న్యూరో-టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సెల్ థెరపీ, రీజనరేటివ్ మెడిసిన్, మహిళల ఆరోగ్యం, అగ్రి-బయోటెక్, ఖచ్చితత్వ వ్యవసాయం, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, నీరు, నౌకా వాణిజ్య రోబోటిక్స్, డిజిటల్ వైద్యం వంటి అత్యాధునిక రంగాలకు చెందినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి స్టార్టప్ వ్యవస్థాపకుడు 15 నిమిషాల నిర్దేశిత సమయంలో తమ ప్రదర్శనను ఇచ్చారు. ఇందులో 10 నిమిషాల పాటు తమ అంకుర సంస్థల వివరాలను వివరించగా.. మిగిలిన 5 నిమిషాలు పెట్టుబడిదారుల ప్రశ్నలకు సమాధానాలు అందించారు.
వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల మధ్య విస్తృతమైన నెట్వర్కింగ్, ముఖాముఖి చర్చలతో ఆ రోజు కార్యక్రమం ముగిసింది. తదుపరి జరగబోయే ప్రదర్శనలో పాల్గొనబోయే అంకుర సంస్థలతో చర్చలు జరపడానికి పలువురు పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తం చేశారు.
భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంలో భాగంగా 2026 జూన్ 14-16 తేదీల్లో ఫ్రాన్స్లోని నైస్లో భారత్ ఇన్నోవేట్స్ 2026కు ప్రధాన సమావేశం జరగనుంది. దీనికి సన్నాహకంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పలు ప్రత్యేక కార్యక్రమాల్లో బెంగళూరు ప్రదర్శన ఒకటి. ఫ్రాన్స్లో జరగబోయే ప్రధాన కార్యక్రమంలో పరిశోధన, అభివృద్ధి ఆధారంగా పనిచేస్తున్న సుమారు 120 భారతీయ డీప్ టెక్ అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రపంచ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, సాంకేతిక భాగస్వాముల ముందు ప్రదర్శించనున్నారు.
భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమం ప్రధానంగా 13 అత్యాధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించింది. ఇందులో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, తదుపరి తరం కమ్యూనికేషన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ, అంతరిక్షం, రక్షణ, తయారీ, పరిశ్రమలు 4.0 వంటి రంగాలు ఉన్నాయి. భారత్కు చెందిన ఆవిష్కర్తలు, సంస్థలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక రంగానికి మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం... భారతీయ డీప్-టెక్ అంకుర సంస్థలకు ఫ్రాన్స్, ఐరోపా, ప్రపంచ మార్కెట్లలోకి విస్తరించేందుకు మార్గాలను సుగమం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
****
(రిలీజ్ ఐడి: 2263961)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15