సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నషా ముక్తి మిత్ర: నషా ముక్త్ భారత్ అభియాన్ ఒక విప్లవాత్మక మార్పు... డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 5:39PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి పౌరుడు నషా ముక్తి మిత్రగా మారి... నషా ముక్త భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ)లో క్రియాశీలకంగా పాల్గొనాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం కోరింది. ఎన్ఎంబీఏ యాప్ 2.0లో అందుబాటులోకి వచ్చిన అధునాతన ఫీచర్ల ద్వారా డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలనుకునేవారు నషా ముక్తి మిత్రగా మారటం ఇప్పుడు సులభంగా, అందరికీ అందుబాటులో ఉండేలా, ప్రభావవంతంగా మారింది.
మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చేందుకు శక్తిమంతమైన, ప్రజాస్వామ్య ఉద్యమంగా నషా ముక్తి మిత్ర మారనుంది. సాధారణ పౌరుల శక్తిని, నిబద్ధతను క్షేత్రస్థాయిలో డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా నిర్దిష్టమైన చర్యలుగా మార్చేందుకు నిర్మాణాత్మక వేదికను ఇది అందిస్తుంది.
ముఖ్యమైన అంశాలు:
-
ఇప్పటికే 28,000లకుపైగా నషా ముక్తి మిత్రలుగా నమోదు చేసుకుని, అవగాహనా సదస్సులు, కౌన్సెలింగ్ మద్దతు, ముందుగానే వ్యసనాలను గుర్తించటం, పునరావాస సహాయం ద్వారా కమ్యూనిటీల్లో సహకారాన్ని అందిస్తున్నారు.
-
వయసు, వృత్తి, నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా ఎన్ఎంబీఏ యాప్ 2.0 ద్వారా నషా ముక్తి మిత్రగా నమోదు చేసుకోవచ్చు.
-
ఈ కార్యక్రమం పట్ల చూపే నిబద్ధతకు నమోదు తర్వాత అధికారిక గుర్తింపు పత్రం, ప్రతిష్ఠాత్మక ఎన్ఎంబీఏ బ్యాడ్జ్ను పొందుతారు.
-
ఈ వేదిక అందరికీ అందుబాటులో ఉంటుంది.
సాధారణ పౌరుల క్రియాశీల భాగస్వామ్యం నషా ముక్త్ భారత్ అభియాన్ను వేగవంతం చేస్తుందని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను, కుటుంబాలను, మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. పౌరులు నషా ముక్తి మిత్రులుగా మారడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టటం, అవగాహన పెంపొందించటం, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవటం, ఈ మహమ్మారికి వ్యతిరేకంగా బలమైన సామాజిక రక్షణ కవచాన్ని నిర్మించటంలో నేరుగా పాల్గొనవచ్చు.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశ్ పంత్ మాట్లాడుతూ.. "నషా ముక్త్ భారత్ అభియాన్, కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. జాతీయ సంకల్పం. నషా ముక్తి మిత్ర రూపంలో ఈ ఉద్యమాన్ని మేం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పును చూసి ఆందోళన చెందే ప్రతి భారతీయుడికి ఇప్పడు అధికారిక వేదిక ద్వారా తమ వంతు కృషి చేసే అవకాశం లభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నిపుణులు, పదవీ విరమణ చేసిన పౌరులు, యువత.. అందరూ ఎన్ఎంబీఏ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకుని, నషా ముక్తి మిత్రగా నమోదు చేసుకోవాలని, సమాజంలో కోరుకునే మార్పుకు మార్గదర్శకులు కావాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అందరం కలిసికట్టుగా ఆరోగ్యకరమైన, బలమైన, డ్రగ్స్ రహిత భారతాన్ని నిర్మిద్దాం" అని పిలుపునిచ్చారు.
నషా ముక్తి మిత్ర ఎలా అవ్వాలి:
-
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్ఎంబీఏ యాప్ 2.0 ను డౌన్లోడ్ చేసుకోవాలి.
-
యాప్లో నమోదు చేసుకుని, నషా ముక్తి మిత్ర కోసం రూపొందించిన నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి.
-
డిజిటల్ ధ్రువపత్రాన్ని, ఎన్ఎంబీఏ బ్యాడ్జ్ను పొందండి.
-
మీ ప్రాంతంలో అవగాహనా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సహాయక చర్యలు ద్వారా మీ వంతు సహకారం అందించండి.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు.. ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, సివిల్ సొసైటీ సంస్థలు, స్థానిక నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఇవాళ మీరు వేసే ఒక అడుగు.. రేపు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది.
చేతులు కలుపుదాం. నషా ముక్తి మిత్రులవుదాం. నషా ముక్త్ భారత్ను నిర్మిద్దాం.
మరింత సమాచారం కోసం ఎన్ఎంబీఏ వెబ్సైట్ను సంప్రదించండి. లేదా ఎన్ఎంబీఏ యాప్ 2.0ను డౌన్లోడ్ చేసుకోండి.
ఎన్ఎంబీఏ యాప్:
https://play.google.com/store/search?q=nasha+mukt+bharat+abhiyan&c=apps&hl=en
https://www.instagram.com/nashamuktbharatabhiyaan/
https://x.com/NMBA_MSJE
https://www.facebook.com/NMBA.MSJE
https://www.youtube.com/@nashamuktbharatabhiyaan4550
https://www.whatsapp.com/channel/0029Vb6s9tg1SWst8ZSHXa1f
***
(రిలీజ్ ఐడి: 2261831)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23