వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 2026 నుంచి ఐరోపా మార్కెట్కు ఆక్వా ఎగుమతులు ఈయూ కొత్త ముసాయిదా జాబితాలో భారత్
2025-26లో భారత్ నుంచి సముద్ర ఉత్పత్తులు ఎగుమతయ్యే మూడో అతిపెద్ద మార్కెట్గా మారిన ఈయూ: విలువ పరంగా 41 శాతం పెరిగిన ఎగుమతులు
నియంత్రణల అమలు, బాధ్యతాయుతమైన ఆక్వాసాగు పద్ధతులపై ఎంపీఈడీఏ, ఈఐసీ చేసిన ప్రయత్నాలకు ఈయూ ముసాయిదా జాబితా సవరణలో దక్కిన గుర్తింపు
భారతదేశ ఆహార భద్రత, అవశేషాల పర్యవేక్షణ విధానాలను బలోపేతం చేస్తున్న జాతీయ అవశేషాల నియంత్రణ కార్యక్రమం, కఠినమైన పరీక్షలు, నిఘా వ్యవస్థలు
प्रविष्टि तिथि:
14 MAY 2026 3:03PM by PIB Hyderabad
2024 అక్టోబర్ 4న జారీ చేసిన ఇంప్లిమెంట్ రెగ్యులేషన్ (ఈయూ) 2024/2598లో భారత్ను చేర్చకపోవడం వల్ల ఎదురైన సమస్యలను పరిష్కరిస్తూ.. ఈయూ మార్కెట్లోకి ఆక్వా ఉత్పత్తులను ఎగుమతులను కొనసాగించడానికి 2026 మే 12న యూరోపియన్ యూనియన్ సవరించి ప్రచురించిన ముసాయిదాలో భారత్ను చేర్చింది. గతంలో జారీ చేసిన నియంత్రణలో సెప్టెంబర్ 2026 నుంచి ఈయూలోకి మానవ వినియోగం కోసం జంతు ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతి ఉన్న తృతీయ పక్ష దేశాల జాబితాలో భారత్ను చేర్చలేదు.
యూరోపియన్ కమిషన్ డెలిగేటెడ్ రెగ్యులేషన్ (ఈయూ) 2023/905కు అనుగుణంగా భారత్ అమలు చేసిన చర్యలను అనుసరించి ఈ సవరించిన ముసాయిదా జాబితాను రూపొందించారు. ఈ నియంత్రణ ప్రకారం ఈయూకు ఎగుమతి చేసే జంతువులు, జంతు ఉత్పత్తుల్లో పెరుగుదలను ప్రోత్సహించే సూక్ష్మజీవి నాశక ఔషధాలు, మానవ చికిత్స కోసం మాత్రమే ఉపయోగించే సూక్ష్మజీవ నాశకాలు లేవని ఎగుమతులు చేస్తున్న దేశాలు నిర్దారించుకోవాలి.
ఆహారం కోసం పెంచే జంతువుల్లో ఈయూ నియమాల ప్రకారం సూక్ష్మజీవ నిశక ఔషధ వినియోగంపై ఉన్న నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేశామన్న హామీలను, భరోసాలను సమర్పించిన దేశాలను మాత్రమే ఈ సవరించిన జాబితాలో చేర్చినట్లు 2026 మే 12న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో యూరోపియన్ కమిషన్ పేర్కొంది.
జాబితాలో భారత్ను చేర్చాలన్న ప్రతిపాదన దేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల రంగంలో సానుకూల పరిణామాన్ని సూచిస్తుంది. అలాగే భారత నియంత్రణ వ్యవస్థలు, అవశేషాల పర్యవేక్షణ వ్యవస్థలు, ఆహార భద్రతా ప్రమాణాలపై యూరోపియన్ యూనియన్కు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సవరించిన నియంత్రణను యూరోపియన్ కమిషన్ ఆమోదించిన తర్వాత సెప్టెంబరు 2026 నుంచి ఈయూ మార్కెట్లకు భారతీయ ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి అంతరాయం ఏర్పడదని అంచనా వేస్తున్నారు.
భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల ప్రధాన గమ్యస్థానాల్లో యూరోపియన్ యూనియన్ ఒకటి. 2025-26లో భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు మూడో అతిపెద్ద మార్కెట్గా యూరోపియన్ యూనియన్ మారింది. ఈ ఎగుమతుల విలువ 18.94 శాతం వాటాతో అంటే 1.593 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. 2024-25లో యూరోపియన్ యూనియన్కు చేసిన ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదయింది. ఎగుమతులు విలువ పరంగా 41.45 శాతం, పరిమాణం పరంగా 38.29 శాతం పెరిగాయి. ఇక్కడికి చేసే ఎగుమతుల్లో సాగు చేసిన రొయ్యలు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి.
నియంత్రణల అమలును బలోపేతం చేయడానికి, బాధ్యతాయుతమైన ఆక్వాసాగును ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ), ఎగుమతుల తనిఖీ మండలి (ఈఐసీ) లాంటి సంస్థల ద్వారా వాణిజ్య విభాగం చేపడుతున్న ప్రయత్నాలను కూడా ఈ సవరణ గుర్తిస్తుంది.
జాతీయ అవశేష నియంత్రణ కార్యక్రమం (ఎన్ఆర్సీపీ), దిగుబడి అనంతర పరీక్షల కార్యక్రమం, నిషేధిత యాంటీబయాటిక్స్, ఔషధ గుణాలున్న పదార్థాల కోసం కఠినమైన పరీక్షలు, నిఘా వ్యవస్థలతో పాటుగా పెంపకందారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భారత్లో ఆహర భద్రత, అవశేషాల పర్యవేక్షణ విధానం బలోపేతమయింది.
పశువైద్య ఔషధ ఉత్పత్తులు, యాంటీమైక్రోబయల్ అవశేషాలు, వాటి జాడను గుర్తించే ప్రక్రియలు, ఆక్వాసాగులో, సముద్ర ఆహార ఉత్పత్తుల శుద్ధిలో నాణ్యతకు హామీ ఇచ్చేలా వాటికి సంబంధించిన వ్యవస్థలను భారత్ స్థిరంగా మెరుగుపరుస్తోంది. ప్రతిపాదిత జాబితాలో భారత్ను చేర్చడాన్ని భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కొనసాగుతున్న సాంకేతిక భాగస్వామ్యం, నియంత్రణ సహకారాల సానుకూల ఫలితంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా, సముద్ర ఆహార రంగం నుంచి ఎగుమతుల్లో వృద్ధిని, ఉద్యోగావకాశాలను, విదేశీ మారక ద్రవ్య ఆర్జనను పెంచుతుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2261222)
आगंतुक पटल : 53