ఈ కార్యక్రమ నిర్వహణ సమయంలో మొత్తం 16 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 26 కీలక కేసులను డాక్టర్ జితేంద్ర సింగ్ ముందు ఉంచారు. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 12 కేసులు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 8 కేసులు, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 2 కేసులు ఉండగా.. మిగిలిన కేసులు ఇతర మంత్రిత్వ శాఖలు,విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి.
ఈ పెన్షన్ అదాలత్కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు హాజరయ్యారు. మహారాష్ట్రలోని అకోలా, ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్దిదారులతో సహా ఎనిమిది మంది పెన్షనర్లు ప్రత్యక్షంగా హాజరయ్యారు. మరో 18 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి, రాజస్థాన్లోని బికనీర్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, తమిళనాడులోని ఈరోడ్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి పెన్షనర్లు ఇందులో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం దేశవ్యప్తంగా విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తుంది.
పెన్షన్ అదాలత్ యంత్రాంగం ద్వారా పరిష్కరించిన కేసుల్లో లబ్ధిదారులకు భారీ ఆర్థిక ఊరట లభించింది. ఒక కేసులో ఏకంగా రూ. 74 లక్షలకు పైగా పెన్షన్ ప్రయోజనాలను విడుదల చేశారు. మరో రెండు వేర్వేరు కేసుల్లో ఒక్కొక్కరికి సుమారు రూ. 46 లక్షల చొప్పున బకాయిలను చెల్లించారు.
ఈ కార్యక్రమంలో పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు పెన్షనర్ల సంఘాలు, బ్యాంకులు, ఇతర భాగస్వాములు ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు.
2014 నుంచి పెన్షన్ సంస్కరణలు సాగిన తీరును కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఒకప్పుడు పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రజల దృష్టికి దూరంగా కేవలం పరిమిత పరిపాలనా విధానంలోనే ఉండేదని అన్నారు. కానీ నేడు నిరంతర సంస్కరణలు, డిజిటల్ జోక్యాలు, పౌర కేంద్రీకృత నిర్ణయాల వల్ల ప్రభుత్వంలోనే అత్యంత వేగంగా స్పందించే శాఖలలో ఒకటిగా ఎదిగిందని ఆయన అన్నారు.
బయోమెట్రిక్ ప్రామాణీకరణ,డిజిటల్ సాంకేతికత ద్వారా జీవిత ధ్రువీకరణ పత్రం ప్రక్రియను సరళీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, దీనివల్ల వృద్ధ పెన్షనర్లు ఎదుర్కొంటున్న కష్టాలు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు.ఇప్పటివరకు ఒక కోటి మందికి పైగా పెన్షనర్లు ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందారని, ఇది పెన్షన్ పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా మార్చిందని వివరించారు.
కుటుంబ పెన్షన్ నిబంధనల సరళీకరణ, వ్యక్తులు కనబడకుండా పోయిన కేసులకు సంబంధించిన పాత నిబంధనలను తొలగించడం, విడాకులు తీసుకున్న లేదా విడిపోయిన కుమార్తెలకు, అలాగే ఇతరులపై ఆధారపడే దివ్యాంగులకు చేకూర్చేలా నిబంధనలను సడలించడంతో సహా ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన అనేక సంస్కరణలను కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ఈ సంస్కరణలన్నీ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను, పెన్షనర్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఎంతో సున్నితత్వంతో రూపొందించినవని మంత్రి స్పష్టం చేశారు.
మిషన్ కర్మయోగి గురించి ప్రస్తావిస్తూ.. పరిపాలన అనేది కేవలం నిబంధనలను యాంత్రికంగా అమలు చేయడం కాదని, ప్రజా సేవల పంపిణీ వెనుక ఉన్న ఉన్నతమైన లక్ష్యంపై దృష్టి సారించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విధానపరమైన సంక్లిష్టతల్లో చిక్కుకుపోకుండా, పౌరులు సకాలంలో అర్థవంతమైన ఫలితాలు పొందేలా అధికారులు పరిష్కార మార్గాల దిశగా ఆలోచించాలని సూచించారు.
సంక్లిష్టమైన, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారానికి పెన్షన్ అదాలత్లు ఒక శక్తిమంతమైన సంస్థాగత వ్యవస్థగా ఎదిగాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 2017లో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 15 పెన్షన్ అదాలత్లు నిర్వహించారని తెలిపారు. వీటిలో మొత్తం 27,812 కేసులను స్వీకరించగా, 19,948 ఫిర్యాదులు అదాలత్ జరుగుతున్న సమయంలోనే పరిష్కారమయ్యాయన్నారు. అంటే దాదాపు 71.72 శాతం విజయవంతమైన పరిష్కార రేటు నమోదైందని చెప్పారు. మిగిలిన కేసులను తదుపరి దశలో వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయం, సమీక్షా యంత్రాంగాల ద్వారా పరిష్కరించారని తెలిపారు.
పెన్షన్ సంస్కరణలు, ఫిర్యాదుల పరిష్కార వేదికలపై మరింత అవగాహన, విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి సమాచారం అందేలా, వారు ప్రభుత్వంతో అనుసంధానమై ఉండేలా.. సోషల్ మీడియా, ఆధునిక సమాచార సాధనాలను విస్తృతంగా ఉపయోగించాలని ఆయన అన్ని శాఖలు, సంస్థలకు పిలుపునిచ్చారు.
***